Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సౌదీ అరేబియాలో కొనసాగుతున్న నిర్బంధకాండతో పాటుగా లెబనాన్ ప్రధానిని అపహరించటం, యెమెన్పై చేస్తున్న యుద్ధాన్ని తీవ్రతరం చేయటం, ఇరాన్, లెబనాన్లు తనపై 'యుద్ధ ప్రకటన' చేశాయని సౌదీ ప్రకటించటం మధ్యప్రాచ్యంలో తాజాగా ఏర్పడిన తీవ్ర సంక్షోభానికి అద్దం పడుతున్నాయి. గత 25ఏండ్లలో ఈ ప్రాంతంలోని వివిధ దేశాలపై అమెరికా చేసిన దురాక్రమణలలో దాదాపు 20లక్షలమంది ప్రజలు చనిపోయారు. ఎన్నో లక్షలమంది నిరాశ్రయులయి కాందిశీకులుగా మారారు.
ఇరాక్ నుంచి లిబియా, సిరియా, యెమెన్లదాకా యావత్ సమాజాలన్నీ రక్తసిక్తమయ్యాయి. పెట్టుబడిదారీ ప్రపంచంపై క్షీణిస్తున్న తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు అమెరికా సామ్రాజ్యవాదం అమెయమైన తన సైనిక శక్తితో చమురు నిల్వలు అపారంగా వున్న ఈ ప్రాంతంపై జులుం చలాయిస్తున్నది. ఎంతటి వినాశకరమైన సైనిక సాధనాలను వినియోగించినా అమెరికా లక్ష్యాలు నెరవేరటం లేదు. ఇరాక్లో రెండు ట్రిల్లియన్ల అమెరికన్ డాలర్లు(ఒక ట్రిల్లియన్ డాలర్లు 60లక్షల కోట్ల రూపాయలకు సమానం) ఖర్చు చేసి 4,400మంది సైనికుల ప్రాణాలను త్యాగం చేసినప్పటికీ ఆ దేశంలో అమెరికా తన ఆధిపత్యానికి ఎదురులేకుండా చేసుకోలేకపోయింది.
ఇరాక్, సిరియా, ఆ ప్రాంతంలోని ఇతర దేశాలలో అమెరికాకు ప్రధాన ప్రాంతీయ ప్రత్యర్థిగా ఇరాన్ ఎదురుపడుతున్నది. అలాగే ఈ ప్రాంతంలోని మార్కెట్లపైనా, చమురు వనరులపైనా అమెరికా పెట్టుబడి నియంత్రణను రష్యా, చైనా సవాలు చేస్తున్నాయి. ఈ మొత్తం ప్రాంతంలో యుద్ధాలను విస్తృతం చేయటమే అమెరికా ప్రతిస్పందనగా ఉన్నది. ఇటువంటి పరిస్థితిలో అణ్వస్త్ర యుద్ధం సంభవించటానికి కూడా అవకాశం చాలా ఉన్నది. 2015లో ఒబామా పాలనలో ఇరాన్తో చేసుకున్న అణ్వస్త్ర ఒప్పందాన్ని గుర్తించటానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరాకరిస్తున్నారు. అంతేకాకుండా ఇరాన్తో ప్రత్యక్షంగా తలపడటానికి ట్రంప్ పాలన తయారవుతున్నది.
గత మే నెలలో ట్రంప్ సౌదీ అరేబియాను సందర్శించినప్పుడు ఇరాన్కు వ్యతిరేకంగా సౌదీ నాయకత్వంలో ప్రగతినిరోధక సున్నీ రాజ్యాల కూటమి ఏర్పాటుచేయటానికి మంత్రాంగం నడిచింది. ఈ ఏర్పాటులో సౌదీ అరేబియాకు దేశంలో అణచివేత చర్యలు చేపట్టటానికీ, ఆ ప్రాంతమంతటా సైనిక హింసను ప్రేరేపించటానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. సౌదీ అరేబియాలో క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అవినీతిని నియంత్రించాలనే పేరుతో అనేకమంది రాజ కుటుంబీకులను, మంత్రులను నిర్బంధించిన తరువాత అమెరికా ప్రతిస్పందనను చూసిన వారికి ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నదనే విషయం అర్థమయింది. అలా జరిగిన నిర్బంధాల తరువాత అనేక కీలక పదవులలో ఇరాన్ వ్యతిరేకులు చేరారు.
అంతేకాకుండా గత వారం సౌదీ పాలకులు లెబనాన్ ప్రధాన మంత్రి హరీరిని సౌదీ అరేబియా రాజధాని రియాద్కు పిలిపించారు. హరీరి సౌదీ రాజధానిలో దిగగానే ఆయన ప్రయాణించిన విమానాన్ని పోలీసులు దిగ్బంధించారు. ఆయన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత ఇరాన్ను, లెబనాన్ షియా ఉద్యమం హెజ్బొల్లాను నిరసిస్తూ తయారుచేసిన ప్రకటన ఆయనచేత సౌదీ అధికారిక మీడియా ముందు చదివించారు. సౌదీ-లెబనాన్ల ద్వంద పౌరసత్వం కలిగిన హరీరి హెజ్బొల్లాతో తెగతెంపులు చేసుకోనందున ఆయనను లెబనాన్ ప్రధాని పదవి నుంచి తొలగించాలని సౌదీ రాచరికం నిర్ణయించింది. హరీరిని కుటుంబంసహా సౌదీ రాచరికం బందీలుగా ఉంచింది. ఈ ఊహకందని సౌదీ రాచరికపు చర్యలను ట్రంప్ పాలన, కార్పొరేట్ మీడియాలు సల్మాన్ చేపట్టిన 'సంస్కరణలు'గా అభివర్ణించాయి.
అలానే రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దిశగా యెమెన్ నుంచి ప్రయోగించబడిన రాకెట్ను ఇరాన్ సరఫరా చేసిందనే నిర్దారణకాని అభియోగానికి ట్రంప్ మద్దతు పలికారు. రాకెట్ ప్రయోగించారనే మిషతో యెమెన్లో తాను చేస్తున్న నరమేధాన్ని సౌదీ అరేబియా మరింతగా పెంచింది. ఉపశమన సరఫరాలు ప్రజలకు చేరకుండా సరిహద్దులపైనా, రేవులపైనా బాంబు దాడులను తీవ్రతరం చేసింది. అమెరికా వెనుదన్నుతో సాగుతున్న ఈ దిగ్బంధంతో పెద్ద ఎత్తున కరువు ఏర్పడి లక్షలాది ప్రజల మరణాలు సంభవిస్తాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఇప్పటికే 12వేలమంది యెమెనీలను సౌదీ మిలిటరీ చంపివేసింది. అరబ్ ప్రపంచంలో అత్యంత పేద దేశమయిన యమెన్ను సౌదీ అరేబియా నేలమట్టం చేసినప్పటికీ ఆ దేశం ఓటమిని అంగీకరించలేదు. అలాగే కతార్ను దిగ్బంధించినా ఆ దేశం సౌదీకి జీ హుజూర్ అనలేదు. ప్రస్తుతం సౌదీ అరేబియా ఇరాన్పై యుద్ధానికి కాలు దువ్వుతున్నది.
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న రాజకీయ సంఘటనలు ప్రపంచశాంతికి విఘాతం కలిగిస్తున్నాయి. సౌదీ అరేబియా అమెరికా దన్నుతో ఒక దేశ ప్రధానిని అపహరించటం, వివిధ దేశాలపై యుద్ధాలకు కాలుదువ్వటమంటే మానవాళిని మూడవ ప్రపంచ యుద్ధంవైపు నడిపించటమే అవుతుంది. ప్రపంచ ప్రజల శాంతి ఉద్యమం మాత్రమే ఈ యుద్ధోన్మాదాన్ని నిలువరించగలదు. యుద్ధం, ఆధిపత్యం, అసమానతల మూలాలు పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నాయన్న వాస్తవం ఈ ఉద్యమం మరింత ఉన్నత లక్ష్యాలవైపు సాగవలసిన అవసరాన్ని తెలియజేస్తున్నది.