Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనబాహుళ్యానికి సేవలందించాల్సిన మన బ్యాంకులు ఆ సామాజిక లక్ష్యానికి నిలువునా పాతరేసి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, ప్రయివేటు కార్పొరేట్లకు పాదాక్రాంతం అయ్యాయనడానికి లెక్కకు మించిన ఆధారాలున్నాయి. ప్రభుత్వరంగ జాతీయ బ్యాంకుల్లోని 1,463 మంది ఖాతాదారులు ఒకొక్కరు రూ.వంద కోట్లు, అంతకుమించిన రుణాన్ని ఎంచక్కా ఎగవేశారంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన నివేదిక తాజా ఉదంతం. ఎగవేసిన అప్పులను బ్యాంకులు ముద్దుగా నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ)గా పేర్కొంటున్నప్పటికీ అవన్నీ మొండి బకాయిలే. అలాంటి బకాయిల మొత్తం రూ.7.4 లక్షల కోట్లని ఆర్థికశాఖ ద్వారా లోకానికి వెల్లడైంది. ప్రస్తుత నివేదిక ప్రకారం ఒక్క స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)లోనే ఇలాంటివి 143 ఖాతాలున్నాయి. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా, యూనియన్, యూఎస్ఓ తదితర బ్యాంకుల్లో గణనీయమైన సంఖ్యలో శతాధిక కోట్ల రూపాయలు ఎగవేసిన బడా కంపెనీలున్నాయి.
యథా రాజా తథా ప్రజా అన్నట్టు, నయా-ఉదారవాద ఆర్థిక విధానాలను ప్రభుత్వాలు భుజానికెత్తుకున్నాకనే బ్యాంకుల్లో బడాబాబుల ఎగవేతలు పెరుగుతున్నాయనేది నిర్వివాదాంశం. 2013 నుంచి 2015 మధ్య రూ.1.14 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలను 29 బ్యాంకులు ఎంతో ఉదారంగా మాఫీ చేశాయి. ఈ కాలంలో యూపీఏ, ఎన్డీఏ రెండు ప్రభుత్వాలూ కేంద్రంలో అధికారంలో ఉండటం గమనార్హం. ఇందులో రూ.40 వేల కోట్లు రద్దు చేసి ఎస్బీఐ టాప్లో ఉంది. ఒక పక్క కింగ్ఫిషర్ అధినేత విజయమాల్యా 17 బ్యాంకులకు రూ.7 వేల కోట్లకుపైన బురిడీకొట్టి విదేశాలకు చెక్కేశారని కేంద్ర నేర పరిశోధనా సంస్థ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ల దర్యాప్తులో తేలగా, అదే మాల్యా అప్పుల్లో రూ.1,200 కోట్లను ఎస్బీఐ గతేడాది మాఫీ చేసింది. అప్పుడే ఎన్పీఏలుగా మారిన 63 మంది అప్పులు రూ.7 వేల కోట్లకుపైన ఆ బ్యాంక్ రద్దు చేసింది. కార్పొరేట్ రుణాల రద్దుపై విత్తమంత్రి అరుణ్ జైట్లీ చేసిన సూత్రీకరణ మరీ విచిత్రం. పరిపాలనా చర్యల్లో భాగంగా వారి ఖాతాలు జాబితా నుంచి తొలగించాం తప్ప రద్దు చేయలేదనడం ముఖానికి ముక్కు ఎటుందంటే చుట్టూ తిప్పి చూపడమే.
అధికారిక నివేదికల సంగతెలా ఉన్నా బ్యాంకులన్నింటా రూ.15 లక్షల కోట్ల ఎన్పీఏలున్నాయని అంచనా. అందులో 35 కార్పొరేట్ కంపెనీల బకాయిలు రూ.7 లక్షల కోట్లు. మరో 23 సంస్థలు రూ.4.5 లక్షల కోట్లు బ్యాంకులకు బాకీ పడినాయి. వాటిని వసూలు చేయాల్సిన బ్యాంకులు ఆ బకాయిదారులకు విల్ఫుల్ డిఫాల్డర్లు (ఉద్దేశపూర్వక ఎగవేతదారులు) అన్న నిక్నేమ్ తగిలించి అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం మాఫీ చేస్తున్నాయి. బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టిన వారిలో రిలయన్స్, అదానీలు మొదలుకొని ఏపీలోని ట్రాన్స్ట్రారు, ల్యాంకో వరకు ఉన్నాయి. వారికే ప్రభుత్వాలు కాంట్రాక్టులిచ్చి దన్నుగా నిలబడి సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు? బ్యాంకులు వారి సేవలో తరించకుండా ఉంటాయా? ఓట్ల కోసం రాజకీయపార్టీలు అప్పుడప్పుడు రైతులు, డ్వాక్రా మహిళలు, తదితరుల బ్యాంక్ రుణాలు రద్దు చేస్తామని హామీ ఇస్తున్నాయి. అధికారంలోకొచ్చాక వాటి అమలు దగ్గరకొచ్చేసరికి ఆర్థిక క్రమశిక్షణ, విత్త సంక్షోభం, బ్యాంకుల దివాలా వంటి సాకులు వెతుకుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాని మోడీ స్వయంగా రైతుల రుణాల రద్దుకు హామీ ఇచ్చి బీజేపీ గెలిచాక నాలుక మడత పెట్టడం, రుణమాఫీ పథకాలు సరి కాదని జైట్లీ హితబోధలు లంకించుకోవడం అఘాయిత్యమే. కార్పొరేట్లకు చెందిన అన్నేసి వేలు లక్షల కోట్లు మాఫీ చేస్తూ బక్కచిక్కిన రైతుల అప్పుల రద్దుపై జైట్లీ, అరుంధతీ భట్టాచార్య, రంగరాజన్, వైవి రెడ్డి వంటి ఆర్థిక మేధావులు 'నీతి' సూత్రాలు వల్లించడం దారుణం. రైతులకు పంటలేసుకోడానికి రూ.50 వేలు రుణం ఇవ్వడానికి చేతులు రాని బ్యాంకులకు కార్పొరేట్లకు రూ.శతాధిక కోట్ల మంజూరుకు మాత్రం చేతికి ఎముక ఉండట్లేదు. రైతులకే కాదు డ్వాక్రా గ్రూపులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీలకు, ప్రభుత్వ ప్రాయోజిత పథకాల లబ్దిదారులకు బ్యాంకులు అప్పులివ్వకుండా తిప్పుకుంటున్నాయి. అత్యధిక ప్రజలకు అప్పులివ్వకుండా వారు దాచుకున్న డిపాజిట్లను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నాయి.
కనీస బ్యాలెన్స్ లేదనే పేరుతో జరిమానాలు విధించి రూ.1,800 కోట్లు పిండుకుంది ఎస్బీఐ. కార్పొరేట్ల బకాయిల వల్ల కలిగే నష్టాలను ప్రజల డిపాజిట్లతో పూడ్చుకునేందుకు కేంద్రం ఎఫ్ఆర్డీఏ బిల్లు తెస్తోంది. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు సామాన్య ప్రజలు రూ.5 వేలు డ్రా చేయడానికి నానా ఇబ్బందులూ పడితే కార్పొరేట్లకు మాత్రం రూ.వందల కోట్ల లావాదేవీలు యథేచ్ఛగా సాగిపోయాయి. ఇదీ ప్రభుత్వ విధానం. రూ. వేల కోట్లు ఎగవేసిన కార్పొరేట్ల నుంచి వ్యక్తిగత ఆస్తులను జప్తు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేసి బ్యాంకులు, ప్రభుత్వాలు వసూలు చేస్తేనే బ్యాంకుల మనుగడ, మన ఆర్థిక వ్యవస్థకు ఊరట.