Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎల్ సాల్వెడార్కు చెందిన 2,60,000మంది ప్రజలకు ఇచ్చిన తాత్కాలిక రక్షణ హోదా (టీపీఎస్)ను రద్దు చేస్తున్నట్టు అమెరికా ప్రభుత్వానికి చెందిన హోమ్లాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ సోమవారంనాడు ప్రకటించింది. 18నెలల్లో అంటే 2019 సెప్టెంబరు9వ తేదీకల్లా వీరందరూ అమెరికాను విడిచి వెళ్ళాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అలా చేయని వారిని నిర్బంధంగా ఎల్ సాల్వెడార్కు పంపటం జరుగుతుందని చెప్పారు. ఇలా టీపీఎస్ హోదాగల 2,60,000 మందితో పాటుగా వారి 1,90,000 మంది పిల్లలు కూడా ఇలా అమెరికాను వీడవలసిన ఎల్ సాల్వెడార్ ప్రజలలో ఉన్నారు. అంటే అమెరికాలోని టొలేడో, న్యూ ఓర్లీన్స్వంటి పట్టణాలలో ఎంత జనాభా ఉంటుందో అంతమందిని అమెరికా నుంచి బలవంతంగా పంపనున్నారు.
అయితే అంతమంది ప్రజలను వారి స్వదేశానికి బలవంతంగా పంపటం అంత తేలిక కాదు. ఉదాహరణకు అమెరికా రాజధాని నగరమైన వాషింగ్టన్ డీసీ ప్రాంతంలో 50వేలమంది, లాస్ ఏంజెల్స్ నగరంలో 40వేలమంది, హూస్టన్, న్యూయార్క్ నగరాలలో మరో 50వేలమంది ఎల్ సాల్వెడార్ ప్రజలు నివసిస్తున్నారు. వీరందరినీ నిర్బంధంగా వారి దేశానికి పంపాలంటే ఫాసిస్టు తరహా ఆపరేషన్ అవసరమౌతుంది. అంత ర్యుద్ధాల నుంచీ లేక ప్రకృతి వైపరీత్యాలనుంచీ పారిపోయి తలదాచుకునే వారికి అమెరికాలో అనుమతి ఇచ్చినవారిలో ఎల్ సాల్వెడార్ ప్రజలే అత్యధిక శాతం ఉన్నారు. సంప్రదాయ కాందిశీకులకు ఇచ్చే అనుమతుల కంటే టీపీఎస్ హోదా ఉన్నవారికి ఎక్కువ కాలం అనుమతులు ఉంటాయి.
టీపీఎస్ హోదాతో ఎల్ సాల్వెడార్ నుంచి స్థిరపడినవారి మూలాలు అమెరికా కార్మికవర్గంలో చాలా లోతుగా ఉన్నాయి. సాల్వెడార్ నుంచి అమెరికాకు వలస వచ్చినవారు సగటున గత 21ఏండ్లుగా జీవిస్తున్నారు. ప్రస్తుతం నిర్బంధంగా పంపదలచిన వారు మధ్యవయసుకు వచ్చారు. వారి జీవితాలలో ప్రధాన భాగం అమెరికాలోనే గడిచింది. ఒక అంచనా ప్రకారం ఈ ఎల్ సాల్వెడార్ కార్మికులను నిర్బంధంగా అమెరికా నుంచి పంపివేస్తే రాబోయే పదేండ్లలో అమెరికా స్థూల జాతీయోత్పత్తి దాదాపు 110బిలియన్ డాలర్లు తగ్గిపోతుంది.
ఎల్ సాల్వెడార్లో అనేక భారీ భూకంపాలు సంభవించిన కాలంలో 1994 సంవత్సరానికి ముందు 1,90,000మందినీ, 2001 సంవత్సరానికి ముందు 2,60,000 మందినీ అమెరికాలోకి అనుమతించారు.1980 సంవత్సరం నుంచి 1992 సంవత్సరందాకా ఎల్ సాల్వెడార్లో సాగిన అంతర్యుద్ధం బారిన పడకుండా అనేక వేలమంది ప్రజలు తప్పించు కున్నారు. అమెరికా మద్దతుగల హంతక ముఠాలు అనేక వేలమంది రైతులను చంపివేశాయి. మొజేటే అనే గ్రామంలోనే 1200మంది రైతులను ఊచకోత కోశారు. హంతకముఠాలచే హత్యగావింపబడుతున్నవారి సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా నమోదవుతున్న దేశానికి వేలాదిమందిని నిర్బంధంగా పంపటమంటే వారికి మరణ శిక్ష వేయటమే. 2014-2015 మధ్యకాలంలో ఒబామా ప్రభుత్వం ఎల్ సాల్వెడార్కు బలవంతంగా పంపినవారిలో అనేక మంది హత్యగావింప బడినట్టు గార్డియన్ పత్రికలో ప్రచురింపబడిన ఒక నివేదిక పేర్కొన్నది.
ఎల్ సాల్వెడార్ నుంచి వలస వచ్చిన ప్రజలకు ఇచ్చిన టీపీఎస్ హోదాను రద్దు చేయటమంటే ట్రంప్ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ఎత్తివేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా భావించాలి. అంతకు ముందు నికరాగువా నుంచి వలస వచ్చిన 2500మందికి ఇచ్చిన టీపీఎస్ హోదా రద్దు చేశారు. వారు అమెరికాను విడిచి వెళ్ళటానికి 2019 సంవత్సరం జనవరి 5వ తేదీదాకా గడువు ఇచ్చారు. హైతీ నుంచి వలస వచ్చిన 57వేలమందికి ఇచ్చిన టీపీఎస్ హోదా 2019 సంవత్సరం జులై 22వ తేదీకల్లా ముగుస్తుంది. అయితే ట్రంప్ ప్రభుత్వం ఇటువంటి దారుణమైన నిర్ణయం తీసుకోవటంలో డెమోక్రటిక్ పార్టీ ప్రమేయం కూడా ఉన్నది. ట్రంప్కు ముందున్న అధ్యక్షుడు బారక్ ఒబామా అమెరికాకు వలస వచ్చిన లక్షలాది పేద కార్మికులను బలవంతంగా దేశం నుంచి గెంటివేశాడు. నేడు ట్రంప్ పాలన తీసుకున్న నిర్ణయం అటువంటి విధానం కొనసాగించినట్టుగా అర్థం చేసుకోవాలి. 2014 సంవత్సరంలో మధ్య అమెరికాలో చెలరేగిన హింస నుంచి తప్పించుకుని అమెరికా చేరిన వేలాది మహిళలను, వారి పిల్లలను ఒబామా ప్రభుత్వం జైళ్లలో నిర్బధించింది.
బతకటానికి అమెరికాకు వలసగా వచ్చిన ప్రజలకు వ్యతిరేకంగా ట్రంప్ ప్రతిపాదిస్తున్న జాతీయవాదాన్ని అశేష అమెరికా ప్రజానీకం ఆమోదించటం లేదు. అనేక ఏండ్లుగా అమెరికాలో జీవిస్తున్న వలసగా వచ్చిన ప్రజలకు పౌరసత్వం ఇవ్వాలని 10మందిలో 9మంది అమెరికన్లు కోరుతున్నారు. వలస 'సంస్కరణ' పేరుతో జరుగుతున్న 'చర్చ'ను అమెరికాలోని ప్రగతిశీల ప్రజానీకం తిరస్కరిస్తున్నది. అనధికారికంగా అమెరికాలో నివసిస్తున్నవారు నేరం చేశారనే భావన అత్యంత లోపభూయిష్టమైనది. ఎందుకంటే అమెరికాలో నివసిస్తున్న ప్రజలందరూ ఎప్పుడోఒకప్పుడు వలసగా వచ్చిన వారే. ఎల్ సాల్వెడార్ నుంచి వలసగా వచ్చి టీపీఎస్ హోదావున్న కార్మికులను కాపాడే శక్తి వర్ణ, జాతి వివక్షలకు అతీతమైన కార్మిక వర్గానికి మాత్రమే ఉన్నది. తమ మధ్య జీవిస్తున్న తమ తోటి ఎల్ సాల్వెడార్ కార్మికులను కాపాడుకునే కర్తవ్యాన్ని తోటి అమెరికా కార్మికులు ఎలా నిర్వహిస్తారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.