Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ పౌరులందరికీ న్యాయం ప్రసాదించాల్సిన న్యాయాధీశులే న్యాయాన్ని అర్థిస్తూ ప్రజల ముందుకు రావడం ఆశ్చర్యకరమే కాదు ఆందోళనకరం కూడా. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గగోరు, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ శుక్రవారం పాత్రికేయులతో సమావేశం ఏర్పాటు చేయడమే ఒక అసాధారణ పరిణామం. సుప్రీంకోర్టులో చోటుచేసుకుంటున్న విపరీత పోకడల పట్ల ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తున్న తీరును ఈ నలుగురు న్యాయమూర్తులు బహిరంగంగానే ప్రశ్నించడం గమనార్హం. దేశంలో న్యాయవ్యవస్థ దుస్థితికి ఈ పరిణామం నిలువెత్తు నిదర్శనమని న్యాయకోవిదులు చేస్తున్న విశ్లేషణ సహేతుకంగానే కనిపిస్తోంది. న్యాయవ్యవస్థలో ప్రతికూల ప్రభావాలపై ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినా గోడు పట్టించుకోనందునే మరో దారిలేక మీడియా ముందుకొచ్చామని న్యాయమూర్తులే ఘోషిస్తుంటే అంతకన్నా దిగ్భ్రాంతికర అంశం మరొకటి ఏముంటుంది? సర్వోన్నత న్యాయస్థానాధీశులుగా ఉన్న వీరి పరిస్థితే ఇలావుంటే ఇక దేశంలో సామాన్య పౌరుల గోడు పట్టించుకొనే దిక్కేముంటుంది.
సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి సహచర న్యాయమూర్తుల్లో ప్రథముడే కానీ, ఆయనకంటూ ప్రత్యేకంగా అపరిమిత అధికారాలు లేవని, న్యాయ పరిపాలనలో కేసుల బదలాయింపుల్లో సీనియారిటినీ పక్కన బెట్టి వ్యవహరించారంటూ ఇప్పుడు జస్టిస్ దీపక్ మిశ్రాను ఈ నలుగురు న్యాయమూర్తులు విమర్శించడం, ఒకటి రెండు కేసులను కూడా వారు బహిరంగంగానే ఉదహరించడం పెద్ద చర్చకు దారితీసేదే. ప్రధానంగా కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉదహరిస్తూ మెజార్టీ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును వమ్ము చేయడానికి మరో బెంచ్ ఏర్పాటు చేయడం న్యాయమూర్తుల నియామకాలపైనే తీవ్ర ప్రభావం చూపిందని న్యాయమూర్తులు ఆందోళన వెలిబుచ్చడం గమనార్హం. వైద్య ప్రవేశాలకు సంబంధించి వీరు ఉదహరించిన మరొక కేసు విషయంలోనూ సంప్రదాయాలకు, మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చి ప్రధాన న్యాయమూర్తి వ్యవహరించిన తీరు ఆందోళన కలిగించేదే. న్యాయమూర్తులుగా ఉంటూనే ఇలా బహిరంగంగా దేశ ప్రధాన న్యాయమూర్తిని విమర్శించడం సరైనదా కాదా అనే చర్చ పక్కనబెడితే న్యాయవ్యవస్థ గాడితప్పుతున్న విషయాన్ని ఈ పరిణామం గుర్తుచేస్తోంది.
అన్యాయం, అక్రమాలు రాజ్యమేలినప్పుడు, హక్కులు కాలరాయబడినప్పుడు, అధికార మదంతో పౌరుల స్వేచ్ఛను ప్రభుత్వాలు హరించినప్పుడు 'మీ పక్షాన మేమున్నామంటూ' కొండంత అండగా నిలవాల్సిన న్యాయవ్యవస్థే 'ధర్మం దేహీ' అని న్యాయాన్ని అర్థించాల్సిన దుస్థితికి కారణమెవ్వరని ప్రశ్నిస్తే వేళ్లన్నీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైకే మళ్లుతాయి. రాజకీయ ప్రమేయానికి ఆస్కారం లేకుండా, స్వతంత్రంగా నడవాల్సిన న్యాయవ్యవస్థలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే విపరీతమైన పోకడలు, ధోరణులు పెరిగిపోయాయన్నది నిర్వివాదాంశం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేనాటికే జస్టిస్ దీపక్ మిశ్రాపై అవినీతి ఆరోపణలు ఉన్నమాట కూడా యథార్థం. న్యాయకోవిదులు అనేక మంది ఆయన నియామకంపై అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తం చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించిన బీజేపీ ప్రభుత్వం న్యాయవ్యవస్థనూ వదల్లేదు. కీలకమైన కేసుల్లో హిందూత్వ శక్తులకు అనుకూలంగా తీర్పులు వచ్చే విధంగా న్యాయస్థానాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని వచ్చిన ఆరోపణలకు నేడు సుప్రీం కోర్టులో జరుగుతున్న పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. దేశాన్ని నియంతృత్వం వైపు నడిపించేవి. రాజ్యంగం ప్రకారం శాసన, కార్య, న్యాయ నిర్వాహక వ్యవస్థలు సమతుల్యంగా పనిచేయాల్సి వుంటుంది. మొదటి రెండు వ్యవస్థలు చట్టవ్యతిరేక నిర్ణయాలు తీసుకొంటే వాటిని న్యాయవ్యవస్థ జోక్యం చేసుకొని రాజ్యాంగ రక్షణకు పూనుకోవాల్సి వుంటుంది. దీనికి న్యాయవ్యవస్థ రాజకీయ ప్రభావాలకు లోనుకాకుండా స్వతంత్రంగా వ్యవహరించడం ముఖ్యమైనది. ప్రస్తుతం న్యాయవ్యవస్థలో ఈ స్వతంత్రత కొరవడుతోందని నలుగురు సుప్రీం కోర్టు నాయమూర్తులు వెల్లడించిన అంశాలు తెలియజేస్తున్నాయి. మన సామాజిక వ్యవస్థలో ఏర్పడిన తీవ్రమైన సంక్షోభానికి ఇతర వ్యవస్థలతోబాటు న్యాయవ్యవస్థలో తలెత్తిన ఈ వివాదం ఒక సంకేతం.