Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అటు రవికిరణాల మనోహరం.. యిటు కొత్తనీటితో సెలయేరు పరవళ్లు.. పచ్చని చెట్టు కొత్త చిగుళ్లు తొడుగుతుంది. ఆకు పచ్చని నిగారింపు.. సుతిమెత్తని సవ్వడి.. తెరలు తెరలుగా తెమ్మెర మీటినట్టే ఉంటుంది. ఎటు చూసినా అరవిచ్చిన గులాబీలూ.. చేలగట్ల మీద పసుపు పచ్చని తంగేడు పూలూ... మురిపించే ఎర్రని మందారాలూ.. చామంతుల నిగనిగలూ.. ఘుమఘుమలూ.. ఈ హేమంతంలో సుమంతం చూడ చక్కని సొబగులు.. హేమంతం విశేషమే అంత. వేకువజాము నుంచే పక్షుల కిలకిలా రావాలు.. 'కాలమిలా ఆగిపోనీ... కల నిజమై కరిగిపోనీ... అన్నీ మరిచి...' హాయిగా ఉండిపోతే ఎంత బావుండు అన్నంత ఆహ్లాదంగా తెలిమబ్బు కన్నులపండువులా ఉంటుంది.
కొత్త సంవత్సరానికి హేమంతం మంచి అలంకారం తెస్తుంది. ఎండా వానా చలీ ఒకదాని తరువాత ఒకటి వచ్చేసి తమ పని పూర్తి చేసుకుని వెళ్తుండగా, హేమంతం వస్తుంది. మంచు కురిసే వేళ.. ప్రకృతి పరవశిస్తూ ఉంటుంది. పంటచేలు.. జిల్లుమనే నీళ్లు.. వేడి వేడి నెగళ్లుదగ్గర కూర్చుంటే వెచ్చగా ఉంటుంది. సూర్యుడు ఒక కక్ష్యలో నుంచి మరో కక్ష్యలో అడుగు పెడుతుంటాడు. ఇలా అడుగు పెట్టడమే సంక్రమణ. సంక్రమణ అంటే గమనం.. ఈ గమనం వల్లనే పడమటి గాలికి చలి ఎక్కువవుతుంది. ఆవిరితో కప్పేసిన అద్దంలా చంద్రుడు కనిపిస్తాడు. పున్నమి వెన్నెల్లో కూడా చందమామ సంపూర్ణంగా అగుపించదు. అందుకనే ఈ హేమంతంలో ప్రకృతి కూడా పరవశిస్తూ ఉంటుంది. తనలో తాను అక్షరాలూ రాసుకుంటుంది. గాలికి తలలూపే చెట్ల కొమ్మలు రాసుకున్న అక్షరాలే ఈ పచ్చని ఆకులూ.. హిమబిందువులు అద్దుకున్న నునులేత రోజా బాలలూ... సూక్ష్మంగా చదవగలిగితే, ఆ విరితోటలో ఎంతటి సాఫల్య దృక్పథం యిమిడి ఉందో..కదా.. అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది.
ఆ పచ్చని ఆకులు కూడా గుసగుస లాడతాయట.. అవీ ఎప్పుడో ఒకప్పుడు రాలిపోయి ధూళిలో కలిసి పోతాయనీ... అయినా అవి ఆ చెట్టుమీద ఉన్నంత కాలం తమను చూసేవారి కన్నులకు తన్మయత్వం నింపి తీరాలనే పట్టుదలతో, రెట్టింపు ఉల్లాసంతో మెరుస్తూ ఉంటాయి. గాలినే ఊయలగా చేసుకుని 'ఏమి హాయిలే..హలా..!' అని ఊగుతూ ఉంటాయి. ఇంతలో ఓ ఆకు నేల రాలగానే భూమి ఆప్యాయంగా అక్కున చేర్చుకుని హత్తుకుంటుంది. ప్రకృతికీ కాలచక్రానికీ ఉన్నటువంటి అవినాభావ బాంధవ్యమే అది. ప్రకృతితో మమేకమైనది యేదైనా అంతేమరి. మనసు పరిపూర్ణంగా నిండిపోతుంది. గట్టున నిల్చొని 'ఏటిలోని కెరటాలు ఎక్కడికీ పోవూ.. యెదలోపలి మమకారం ఎక్కడికీ పోదూ...' అని విరబూసిన హేమంతాన్ని మనసుతీరా ఆస్వాదించడమే మనవంతు.
ఇలా హేమంతం చల్లగా అడుగుపెడుతూనే ముంగిట్లో ముత్యాల ముగ్గులు తీర్చి దిద్దుతుంది. ఫలసాయాలు చేతికందే వేళ... అన్నదాతల లోగిళ్లు కళకళలాడుతూ.. గంగిరెద్దుల నృత్యాలూ, హరిదాసుల కీర్తనలతో పల్లెల్లో నిండైన సందడి. విశిష్టమైన భౌగోళిక, వ్యవసాయక, ఉన్నంతలో ఆర్థిక వెసలుబాటు సంతరించుకుంటుంది. సరిగ్గా యిదే సమయం..గత సంవత్సరం మరుగవుతుంది. నవీన సంవత్సరం అడుగిడుతుంది. ఎన్నెన్నో ఆశల పందిళ్లు.. కొత్త భావనలూ... కొంగ్రొత్త ఆశలూ.. పచ్చ పచ్చని చివుళ్ల వంటి కొత్త కోరికలూ మొగ్గలు తొడుగుతాయి. ఇలా కాలం తాజాగా పరిమళిస్తూ ఉంటుంది. మనుషులు ఆశాజీవులు. జీవితం అందమైన కలగా భావిస్తారు. తమ బతుకంతా హాయిగా గడిచిపోవాలని కోరుకుంటారు. మంచి జరిగితే, ఆనందంగా స్వీకరిస్తారు. చెడు జరిగితే బాధపడతారు. కుంగిపోతారు. మనం సంఘజీవులం. చుట్టూ జరిగే తప్పిదాల్ని అర్ధం చేసుకోవాలి. కనుక నలుగురితో కలిసి నడవడం అవసరం. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు అనుభవజ్ఞులు. ఒంటరిగా మనజాలం. బతికినన్నినాళ్లూ 'అందమే ఆనందం.. ఆనందమె జీవిత మకరందం.. !' అనుకుని అందరితో కలిసిమెలిసి బతికితే జీవితానికి ఓ అర్ధం.. ఓ సార్ధకత.. ప్రగతి భావుకులు కోరుకునేది జగతికి సముత్తేజం కలిగించే పరివర్తనా ప్రవృత్తినే..
కొన్నిసార్లు నేలమీద నడిచిపోతున్నా నిండు సరోవరంలో తేలిపోతున్నట్టనిపిస్తుంది. మనసును బట్టి ఆ అనుభూతి ఉంటుంది. నడకలో కుదుపులుంటాయి. జీవితంలో కూడా అంతే. ఆ కుదుపులకు వెనుదీయక అడుగులను కొనసాగిస్తాం. సరోవరం తరగలు కూడా అంతే. ఒక్కొక్కసారి పొంగుతూ, మరోసారి కుంగుతూ పోతుంటాయి. వాటిమీద తేలిపోయే మనం మన మనసును సర్దుబాటు చేసుకుంటాం. మళ్లీ ఎప్పటిలాగే తేలిపోతుంటాం. కానీ, నేలమీదైనా, నీటిమీదైనా సమ మనస్కతతో సాగిపోవాలి. యావత్ దేశం కూడా అంతే. విభిన్న జాతులు, భాషలు, మతాలు, సంస్కృతులూ ఉండటం సహజం. వీటన్నిటి మధ్య సరియైన అవగాహన ఉంటేనే దేశం భవిష్యత్ సుస్థిరం. అదుపు తప్పుతున్న పరిస్థితుల్ని అధిగమించడానికి పల్లె నుంచి ఢిల్లీ దాకా అన్ని రంగాల్లో సుపరిపాలన నెలకొల్పడానికి మనమంతా అంకితమయితే మన దేశం బాగుంటుంది. మనం బాగుంటాం. మన యిల్లు ప్రశాంతంగా ఉంటుంది. సుశాంతి వల్ల అందరం బాగుంటాం. అప్పుడే ప్రజల జీవితాల్లో విరబూసిన హేమంతం.