Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం గురించి హంగామా చేస్తున్నది. వ్యవసాయరంగాన్ని సంక్షోభం నుండి కాపాడటమా? లేక ఉపశమన చర్యలా అన్నదే అసలు సమస్య. ఉరితాడు బారిన పడకుండా రైతును కాపాడటమా? లేక జీవగంజి పోయటమా? తేల్చుకోవాల్సిన సమయమిది. కష్టాల్లో ఉన్నవాడికి రూపాయి ఇచ్చినా సంతోషమే! అందువల్ల ఎకరానికి 8వేలు ఉపయోగమే. వేడినీళ్ళకు చన్నీళ్ళలాగా తోడ్పడతాయి. మంచిదే. రుణమాఫీ అన్నా... ఆర్థిక సహాయం అన్నా అంతే. కానీ అవే సమస్యకు పరిష్కారం కాదన్న విషయాన్ని చర్చకు రాకుండా చేయటంలో పాలకులు జయప్రదమవుతున్నారు. ఈ మాత్రపు సహాయాలకు కూడా కౌలు రైతులు నోచుకోలేదు. కాంగ్రెసు, టీడీపీల పాలనలో కౌలురైతులను పొమ్మనకుండా పొగబెట్టారు. టీఆర్ఎస్ పాలనలో బహిరంగంగానే కౌలు రైతుల బాధ్యత తమది కాదని ప్రకటించారు. స్వంత దారులైన పేద, మధ్యతరగతి రైతులకు అందే ప్రయోజనం కూడా పరిమితమే. 14శాతం ఉన్న ధనిక రైతుల చేతుల్లో 68లక్షల ఎకరాల భూమి ఉండగా, 86శాతం రైతుల చేతుల్లో 84లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉన్నది. అంటే ఆర్థిక సాయం పేరుతో ప్రభుత్వం ఖర్చు చేసే రూ.7వేల కోట్లలో దాదాపు సగం, కొద్దిమంది ధనికులకే. ఎకరం రైతుకు ఎనిమిది వేలు ఇస్తే, వంద ఎకరాల భూస్వామికి ఎనిమిది లక్షలు దక్కుతాయి.
బాధిత రైతులను ఆదుకోవటమా? లేక వాడుకోవటమా అన్నదే అసలు సమస్య. నాడు కాంగ్రెసూ, టీడీపీలైనా... నేడు టీఆర్ఎస్ అయినా... చేస్తున్నది వాడుకోవటమే. టీడీపీ పాలనలో రైతుమిత్ర లేదా కాంగ్రెసు పాలనలో ఆదర్శరైతు అన్నా... ఇప్పుడు టీఆర్ఎస్ పాలనలో రైతు సమన్వయ సమితులు అన్నా... అదే జరుగుతున్నది. ఓట్ల వేటకు పూనుకోవటమే! రైతుకు కావల్సింది రుణసదుపాయం, పంటకు గిట్టుబాటుధర, నాణ్యమైన విత్తనాలు, శాస్త్రీయమైన సూచనలు, కరువు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ఆదుకోవటం. వీటి గురించి మాట్లాడకుండా... కేవలం రుణమాఫీ లేదా ఆర్థిక సహాయం చుట్టూ తిప్పటమంటేనే, పాలకుల నిజాయితీ నేతి బీరకాయలో నెయ్యి వంటిదేనని స్పష్టమవుతున్నది. రూ.11 లక్షల కోట్లు ఎగవేసిన బడా కార్పొరేట్ సంస్థలకే మళ్ళీ మళ్ళీ మాఫీలూ... మరిన్ని రుణాలు అందజేస్తున్న పాలకులు, రైతులకు మాత్రం సాధ్యం కాదంటున్నారు. ప్రయివేటు వడ్డీ వ్యాపారులకు బలిపెడుతున్నారు. ఉత్పత్తిఖర్చుకు 50శాతం అదనంగా కలిపి ధాన్యం ధర నిర్ణయించాలని స్వామినాథన్ కమిషన్ సిఫారుసు చేసింది. ఎన్నికల బహిరంగ సభలలో స్వామినాథన్ జపం చేసిన మోడీ, ఈ మూడున్నర ఏండ్లలో మళ్ళీ ఆ ఊసే ఎత్తలేదు. రాష్ట్రంలో పంటలకు ధర గ్యారంటీ చేయలేని ప్రభుత్వం ఇది. రేపు నిజంగానే సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి కోటి ఎకరాలకు నీళ్ళిస్తే... ఆ పంట ఎవరు కొనుగోలు చేయాలి? ఈ ప్రశ్నకు పాలకుల దగ్గర సూటిగా సమాధానం లేదు. పత్తివేస్తే ధర రాదనీ, పంట మార్చాలనీ రాష్ట్ర పాలకుల సూచనలను నమ్మిన రైతులు పంటలు మార్చారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి పత్తికి మాత్రమే ధర పలికింది. మిర్చి రైతు చేతికి మాత్రం సంకెళ్ళు పడ్డాయి. ఈ సీజన్లో పత్తి రైతుకు దిక్కులేదు. వ్యాపారులు, సీసీఐ అధికారులు చేతులు కలిపారు. పత్తిరైతు వెన్ను విరిచారు. పాలకులు తమాషా చూస్తున్నారు. మార్కెట్ శక్తుల చేతుల్లో రైతు విలవిల్లాడుతున్నాడు.
వరి వద్దనీ, వాణిజ్యపంటలే ముద్దు అనీ... రైతును ఆ వైపు నెట్టింది పాలకులే. పెరిగిన పెట్టుబడి ఖర్చులకు బాధ్యత పాలకులదే. ఇప్పుడు ఎకరానికి నలభైవేలు పెట్టుబడి ఖర్చుకు, నాలుగువేల సహాయంతో సంబురపడాలంటున్నారు. అప్పు సౌకర్యానికీ, గిట్టుబాటు ధరకూ తమకు సంబంధం లేదంటున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారూ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలకులదీ ఒకే దారి. గతంలో కాంగ్రెసు, టీడీపీ పాలకులు చేసిందే ఇప్పుడు తెలంగాణ పాలకులూ చేస్తున్నారు. మోసపోతున్నది మాత్రం రైతులే. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా సాధారణ రైతులకు అందే పరిమిత రుణ సదుపాయానికి కూడా మరిన్ని ఆంక్షలు విధించారు. విత్తనచట్టం చేయవల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేయదు. తామే చేస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడా ఊసే ఎత్తదు. రైతులు మాత్రం ప్రయివేటు సంస్థల నకిలీ విత్తనాలతో నిలువునా దగా పడుతున్నారు. ఈ పాలకులు మాటల్లో ఏమి చెప్పినా... ఆచరణలో పేద, మధ్య తరగతి రైతులను వ్యవసాయరంగం నుండి బయటకు తోసి, కార్పొరేట్ శక్తులను ప్రోత్సహించటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. టీడీపీ పాలనలో ఇజ్రాయిల్ జపం చేస్తూ కుప్పం తరహా వ్యవసాయం అన్నారు. కాంగ్రెసు పాలనలో కంపెనీ వ్యవసాయానికి ప్రయత్నించారు. ఇప్పుడు తెలంగాణ పాలకులు మరోసారి ఇజ్రాయిల్ పాట పాడుతున్నారు. కేంద్రంలో నాటి కాంగ్రెసు పాలకులు ఉద్దీపన పథకాల పేరుతో బడా కార్పొరేట్లకు లక్షల కోట్లు కట్టబెట్టారు. ఇప్పుడు బీజేపీ పాలకులు రుణాలు మాఫీ చేసారు. ఎగవేతదారులైన కార్పొరేట్లను రక్షించేందుకు డిపాజిటర్లను బలిచేసే చట్టం రూపొందిస్తున్నారు. రైతు కష్టాలు మాత్రం ఎవరికీ పట్టలేదు. అయితే... ఈ పార్టీలూ, పాలకులూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అందరినీ, అన్ని సందర్భాలలోనూ మోసం చేయటంలో సఫలం కాలేరు.