Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయ స్థాయిలో మూడవ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. మంచిదే, మోడీ పాలన ఈ దేశానికి పట్టిన చీడ. రాష్ట్ర పాలకులకే కొంచెం ఆలస్యంగా అర్థమైంది. ధరలు పెరుగుతున్నాయి. నిరుద్యోగం ఎప్పుడూ లేనంత స్థాయికి పెరిగింది. రైతుల ఆత్మహత్యలూ పెరిగాయి. కార్మికుల హక్కులు హరిస్తున్నారు. ప్రయివేటీకరణ విధానాలు వేగంగా అమలు చేస్తున్నారు. మహిళలమీద లైంగికదాడులు పెరిగాయి. రోజుకో నిర్భయ వార్త వినవల్సి వస్తున్నది. దళితుల మీద దాడులూ పెరిగాయి. ప్రజాస్వామ్యాన్ని మంటగలుపు తున్నారు. కాంగ్రెస్ విధానాలే బీజేపీ కూడా అమలు చేస్తున్నది. వీటికి తోడు సమాజంలో అసహనం పెంచి పోషిస్తున్నారు. ఏమి తినాలో, ఏమి మాట్లాడాలో, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో కూడా సంఘపరివార్ నిర్ణయిస్తున్నది. ప్రజలను మతపరంగా విభజించి పబ్బం గడుపుకుంటున్నారు. అందుకే మోడీ పాలన పట్ల ప్రజలు విసుగు చెందారు.
70వ దశకంలో బెంగాల్లో కాంగ్రెస్ భయానక దాడులతో ప్రారంభించి దేశంలో ఎమర్జెన్సీ నిరంకుశ పాలన ప్రకటించింది. నేడు మోడీ ప్రభుత్వం త్రిపురలో విధ్వంసకర దాడులతో మరో ఎమర్జెన్సీకి, నియంతృత్వ పాలనకు బాటలు వేస్తున్నది. త్రిపురలో దాడులు చేస్తున్న వారంతా నిన్నటిదాకా కాంగ్రెస్ నేతలే! ఇప్పుడు బీజేపీ ముసుగులో, సంఘపరివార్ ఆశీర్వాదంతో దాడులకు తెగబడ్డారు. అందువల్ల కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పాలనకు భిన్నమైన పాలన అవసరమే. ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా? అన్న చర్చ నడుస్తున్నది. ఫలించాలనే కోరుకోవాలి. కానీ, ఈ రెండు పార్టీలకు భిన్నంగా, కేసీఆర్ ఫ్రంట్ చూపించే ప్రత్యామ్నాయ విధానాలేమిటన్నది అసలు ప్రశ్న.
కేవలం బీజేపీ, కాంగ్రెస్లను ఓడిస్తే చాలునని ప్రజలు భావించటం లేదు. వారి జీవితాలలో మార్పు చూపించే విధానాలు కోరుకుంటున్నారు. గతంలో మూడు దశాబ్దాల పాటు కాంగ్రెసేతర, బీజేపీయేతర సంకీర్ణ ప్రభుత్వాలు కూడా ఆ రెండు పార్టీల ఆర్థిక విధానాలనే అమలు చేసాయి. ఆ అనుభవంతోనే ప్రజలిప్పుడు విధానాలు మారాలని కోరుకుంటున్నారు.
ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని కాదని మోడీ ఏకపక్షంగా పెద్దనోట్లు రద్దు చేశారు. ఆర్థిక వనరులు తమ చేతుల్లో కేంద్రీకరిస్తూ జీఎస్టీ ప్రవేశపెట్టారు. సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు కోత విధించారు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసారు. నిటిఆయోగ్ పేరుతో రాష్ట్రాలను అడుక్కునేవిగా మార్చారు. బడ్జెట్లో కేటాయించిన మేరకు కూడా రాష్ట్రాలకు రావాల్సిన నిధులు విడుదల చేయలేదు. కేంద్రమే నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తామంటున్నది. అరుణాచల్ప్రదేశ్, ఉత్తరఖండ్, తమిళనాడు వంటి ఎన్నికైన ప్రభుత్వాల మీద దాడులు చేసింది. అన్ని సందర్భాలలోనూ రాష్ట్ర పాలకులు కేంద్ర బీజేపీ సర్కారుతో అంటకాగారు. అందుకే టీఆర్ఎస్ నేతలు చూపించే ప్రత్యామ్నాయం ఏమిటన్నది ప్రజల ప్రశ్న.
ప్రజాస్వామ్యం, లౌకిక విలువల కోసం ప్రాంతీయ పార్టీలు గతంలో గట్టిగానే నిలబడ్డాయి. కానీ ఆర్థిక విధానాల విషయంలో బీజేపీ, కాంగ్రెసుల దారిలోనే నడిచాయి. తర్వాత కాలంలో ప్రాంతీయ పార్టీల నాయకత్వాలలో అవకాశవాదం పెరిగింది. మూడవ ఫ్రంట్ గురించి మాట్లాడుతూనే, అది సాధ్యం కానప్పుడు బీజేపీ కాంగ్రెస్లలో ఎవరితో జతకట్టడానికైనా వీరు సిద్ధపడుతున్నారు. అందుకే ఇప్పుడు మూడవ ఫ్రంట్ గురించి మాట్లాడితే... మూడవఫ్రంట్ విధానాలేమిటన్న ప్రశ్న అడగాలి. ప్రజల సమస్యలూ, ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు వదిలిపెట్టి పదవుల కోసం పాకులాడటాన్ని ప్రజలు తిరస్కరించాలి. అందుకే.... కేవలం మూడవ ఫ్రంట్ అధికారంలోకి రావటం కాదు. ప్రజల జీవితాలలో వెలుగునింపే విధానాలు కావాలి. సంకీర్ణాలు నిలబడవనీ, సుస్థిర పాలన అందించజాలవనీ ఎద్దేవా చేసే వారి అసలు ఉద్దేశం బీజేపీ లేదా కాంగ్రెస్ చేతుల్లో అధికారం పెట్టాలన్న తాపత్రయమే. సరైన విధానాల ప్రాతిపదికగా ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వాలు నిలబడగలవనీ, సుస్థిరపాలన అందించగలవనీ భారత దేశ అనుభవమే రుజువు చేసింది. వామపక్ష సంకీర్ణ ప్రభుత్వాలే బెంగాల్లో 34ఏండ్లు... త్రిపురలో 25ఏండ్లు సుస్థిర పాలన అందించాయి. ఇప్పుడు కేరళలో ఆదర్శ పాలన అందిస్తున్నది.
ఇప్పటివరకు కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినప్పటికీ, అమలు జరిపింది బడాబాబుల ప్రయోజనాలు కాపాడే విధానాలే. ఇప్పుడు కావల్సింది ప్రజల సమస్యలు పరిష్కరించే విధానాలు. రైతుల ఆత్మహత్యలకు పరిష్కారం చూపాలి. ఉపాధి అవకాశాలు పెంచాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి. మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నాలను తిరస్కరించాలి. కులవివక్ష, కుల దురహంకారాన్ని అరికట్టాలి. మైనారిటీలకు, బడుగు బలహీన వర్గాలకు భద్రత కల్పించాలి. చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి. ఏకాభిప్రాయ సాధన పేరుతో బీజేపీ, కాంగ్రెస్ నేతల్లాగా కుంటిసాకులు వెతకవద్దు. మహిళలపై లైంగిక దాడులు అరికట్టాలి. ఎన్నికల విధానంలో సంస్కరణలు చేపట్టాలి. శ్రామికుల హక్కులు, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి. నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా, రాష్ట్రాల హక్కుల కోసం నికరంగా నిలబడాలి. ధరల పెరుగుదలను అదుపు చేయాలి. విధానాలను విస్మరించి, అధికారం గురించి మాత్రమే మాట్లాడటం కాదు. విధానాలతో ముందుకు రావాలి.