Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గెలుపైనా... ఓటమైనా... వాటిని హుందాగా స్వీకరించడం గొప్ప లక్షణం. కానీ అక్కడ ఓటమి వినమ్రంగా సగర్వంగా తలెత్తుకుని నిలుచుంటే విజయం మాత్రం అహంకారంతో అసహనానికి గురవుతున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా సాగవలసిన ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసి అధికారం చేజిక్కించు కున్న వాళ్లు తమ విజయోత్సవాలను సైతం అప్రజాస్వామికం, అరాచకాల మయం చేయడం తొలిసారిగా చూస్తున్నాం... త్రిపుర ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే మొదలైన బీజేపీ మూకల హింస, విధ్వంసం ఇంకా కొనసాగుతుండటమే గాక దేశమంతటికీ పాకుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రజలపై దాడులకు దిగడం, పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయడం, లెనిన్ విగ్రహాలను కూల్చివేయడంతో మొదలైన ఈ ఉన్మాదం దేశమంతటా పెరియార్, అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలపై కూడా సాగుతోంది. ఈ విధ్వంసం కేవలం ఆవేశం తలకెక్కిన, విజయోత్సాహంతో విచక్షణ కోల్పోయిన కార్యకర్తల గుంపులు చేస్తున్నదిగా భావించలేం. ఇది సంఫ్ు పరివార్ ముందస్తు వ్యూహమేనని స్పష్టమవుతున్నది. బీజేపీ అగ్రనాయకులు త్రిపురలో మతోన్మాదులు సృష్టిస్తున్న మారణకాండను నిస్సిగ్గుగా సమర్ధిస్తుండటమే గాక, మరింత రెచ్చగొడు తుండటమే ఇందుకు నిదర్శనం.
ఈ మూకలు గో సంరక్షణ అనీ, లవ్ జిహాద్ అనీ, గొడ్డు మాంసం తిన్నారనీ దేశంలో దళితులు, మహిళలు, మైనారిటీ ప్రజలపై దాడులూ హత్యలకు తెగబడినప్పుడు కూడా వారిని సమర్థిస్తూ వెనకేసుకొచ్చిన వైనాన్నే బీజేపీ నేతలు ఇప్పుడూ అనుసరిస్తుండటం గమనార్హం. ఒకరు లెనిన్ విదేశీయుడు అంటారు. మరొకరు ఆయన టెర్రరిస్టు అతనికి విగ్రహాలెందుకు అంటారు. ఇంకొకరు ''చలోపల్టాయి'' అంటూ వరుస ట్వీట్లతో రెచ్చగొడుతుంటారు. ఇక పెరియార్ పని పడతామని ఒకాయన, అంబేద్కర్కూ ఇదే గతి అని ఇంకొకాయనా హెచ్చరిస్తుంటారు. ఇంత జరుగుతున్నా గవర్నర్ కూడా ఇది ప్రభుత్వాలు మారినప్పుడల్లా జరిగే అతి సాధారణ తంతుగా కొట్టిపారేస్తారు. ఫలితంగా ఈ ఉన్మాదం దావానలంలా దేశమంతటినీ తాకుతోంది... పెరియార్, అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలపైకీ తెగబడుతోంది..! కానీ దేశం మొత్తం ఈ అరాచకాలను ఖండిస్తోంది... వ్యూహంలో భాగంగానే బీజేపీ ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తోందంటూ దేశమంతటా నిరసనలు పెల్లుబుకుతుండటం.., రాజకీయ పక్షాలతో పాటు యావత్ మేథో ప్రపంచం నుండీ విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ప్రధాని మోడీ తన మౌనం వీడి ఈ దాడులను ఖండించక తప్పలేదు. కానీ ప్రధాని ఖండించినా, బీజేపీ అధ్యక్షుడు హెచ్చరించినా ఈ దాడులు మాత్రం ఆగలేదు. దాడులకు పాల్పడుతున్న మూకలపై ఏ చర్యలూ లేవు... ఇది బీజేపీ అహంకారానికి పరాకాష్ట..! ఒకవైపు క్షేత్రస్థాయిలో విద్వేషాలు వెదజల్లుతూనే, మరోవైపు వాటిని ఖండిస్తూ మొసలి కన్నీళ్లు కార్చడం వీరికి మాత్రమే సాధ్యమైన విద్య.
అయినా విగ్రహాలను కూల్చినంత మాత్రాన వారి సిద్ధాంతాలు కూలిపోతాయా..! బుల్డోజర్లతో వాటిని తొలగించినంత తేలికగా ప్రజల గుండెల్లో వెలుగుతున్న వారి భావాలను ఆర్పగలరా..? లెనిన్ విదేశీయుడనీ, ఆయన ఈ దేశానికి చేసిందేమిటనీ విపరీత వాదన చేసేవారు ఓ విషయం గుర్తుపెట్టు కోవాలి. లెనిన్ అంతర్జాతీయవాది. సకల దేశాల శ్రామికుల విముక్తి శ్వాసించినవాడు... ఈనేల మీద సామ్యవాద వ్యవస్థను సాకారం చేసి ప్రపంచమంతటికీ వ్యాపించినవాడు... అన్నిటికీ మించి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పాలన నుండి భారతదేశం విముక్తి సాధించాలని కోరుకున్నవాడు... బ్రిటిష్ వలసవాదుల పెత్తనాన్ని గట్టిగా వ్యతిరేకించినవాడు... కానీ స్వాతంత్య్రోద్యమంలో ఏ పాత్రాలేని వారు, బ్రిటిష్ దొరలకు దాసోహమైనవారు లెనిన్ ఈ దేశానికి ఏం చేశాడని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది..! లెనిన్ మొత్తం ప్రపంచానికే గొప్ప విప్లవ స్ఫూర్తి... ఆ స్ఫూర్తిని వీరు అడ్డుకోగలరా..? కులాన్ని నిర్మూలించడానికీ, హేతువాద దృక్పథాన్ని వెలుగొందింప చేయడానికి అపారమైన కృషి చేసినవారు పెరియార్ రామస్వామి. ఆయన ఆత్మగౌరవ పోరాటం నేటికీ దక్షిణాదినంతటినీ ప్రభావితం చేస్తోంది... ఆ భావ వ్యాప్తిని అరికట్టగలరా..? డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అంటరాని తనంపై పెనుమంట.. అణగారిన వర్గాల ఆశాజ్యోతి.. ఆ జ్యోతిని ఆర్పేయగలరా..?
ఎన్నికలన్నాక గెలుపోటములు సహజాతి సహజం. అయినా త్రిపురలో గెలుపోటముల మధ్య ఓట్ల తేడా అరశాతం కూడా లేదు. బీజేపీకి 43శాతం వస్తే... సీపీఐ(ఎం)కు 42.7శాతం వచ్చాయి. కానీ గత ఎన్నికల్లో 1.54శాతానికే పరిమితమైన వారికి ఇప్పుడు 43శాతం ఓట్లు ఏ తీరున వచ్చాయో, అందుకు వారు ఎన్ని అనైతిక, అరాచక, అప్రజాస్వామిక చర్యలకు ఒడిగట్టారో అంతా బహిరంగ రహస్యమే...! ఈ మాత్రానికేనా ఈ మిడిసిపాటు..!? ఈ మాత్రానికేనా ఈ విజయ గర్వం..!? కాదు.. ఈ మాత్రానికే కానేకాదు... అక్కడ వారు గెలిచింది కమ్యూనిస్టుల మీద.. ఈ గెలుపు ద్వారా వారు ఓ నిజమైన ప్రత్యామ్నాయాన్ని చిదిమేశారు... తమ కుటిల పన్నాగాల ద్వారా ఓ నిఖార్సయిన ప్రజాపక్షాన్ని ఓడించారు.. అందుకే ఈ వీరంగం.. అందుకే విధ్వంసం... ఈ ఉన్మాదులు ఓ విషయాన్ని గమనించి తీరాలి... అదేమిటంటే వీరు మాత్రమే గెలిచామని విర్రవీగుతున్నారు.. కానీ ప్రపంచమంతా మహాద్భుతంగా పనిచేసిన ఓ గొప్ప ప్రభుత్వం పడిపోయిందని బాధపడుతోంది... త్రిపురలో కొత్తగా కొలువుదీరుతున్న వీరు మనిషిని, మనిషి శబ్దాన్ని నిషేదిస్తూ ఏ రాజ్యాన్ని నిర్మిస్తారు..? మృగరాజ్యాన్నేనా..!?