Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కనురెప్పల సరిహద్దుల్లో
ఘనీభవించిన కన్నీటి చుక్కను
తరిచిచూడు మిత్రమా..! ఒక్కసారి
ముత్యంలా మారిన బిందువులో
కథలు చెప్పే రంగులెన్నో
రంగు రంగులో ఒక భావం
ప్రతి భావంలో ఒక పరిమళం
కనిపించీ కనిపించని
ఆ కన్నీటిచుక్క స్ఫటికంలా మారి
మనసు వెతలకు
ప్రతిబింబమే అవుతుంది చూడు..!
మంచిపని మనసుకు హాయినిస్తుంది. చెడ్డపని మనసును నొప్పిస్తుంది. ఈ నొప్పి భరించాలన్నా, ఆ హాయి పొందాలన్నా మనసు సిద్ధపడాలి. అంతే. మనసుంటే మార్గముంటుంది అంటారు పెద్దలు. వారు అనుభవపూర్వకంగా చెప్పారు. మనం మనకు కావాల్సిన వారిని కలవాలనుకుంటాం. దారి తెలియదు. వెదుక్కుంటూ వెళ్తాం. ఈ సువిశాల ప్రపంచంలో ఎన్నో అవస్థలు. అయినా మనకు నచ్చితే ఎంత కష్టమైన పని అయినా యిష్టపడి చేస్తాం. కష్టాలు నష్టాలు యిష్టపడి ఉంటాం. మన మిత్రులు ఎందాక రమ్మంటే అందాక వెళ్తాం. అప్పుడు ఆ దారిలో ఎన్ని అవరోధాలెదురైనా అవన్నీ భరిస్తాం. భరించాలి. మన లక్ష్యం చేరుకోవాలి. ఇటువంటప్పుడే మనం మిత్రులు అనుకుంటుంటాం.. వారు చాలా దగ్గరలోనే ఉన్నా మనకు దగ్గర కాలేరు. మరికొందరు ఎంతో దూరంగా ఉన్నా, మనసుకు దూరం కాలేరు. వీళ్లెప్పుడూ మన హృదయంలో సదా నిలిచే ఉంటారు.
మనసుకు నచ్చిన వారితో మనం ప్రతి క్షణం మాట్లాడలేక పోవచ్చు. మన మనస్సు మాత్రం వారి కోసం ప్రతి క్షణం నేస్తమా..! నేస్తమా..! అని పరితపిస్తూనే ఉంటుంది. ఓ పక్షిలా మనక్కూడా రెక్కలుంటే ఎంత బావుండునో..! ఎంచక్కా నెచ్చెలి దగ్గరికి వాలిపోవచ్చు..! అప్పుడే ఆ సమయాన ప్రకృతి అందాలన్నీ మౌనంగా పలుకరించే వేళ.. మెలమెల్లగా మల్లెమొగ్గలు విచ్చుకుంటున్నట్టు.. మదిలో ఓ స్నేహభావం మెదిలి మిత్రులు కనిపిస్తారు. స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది. వారి మధ్యలో ఓ పసిపాప బోసినవ్వూ.. వెన్నముద్దలా మురిపిస్తూ 'వెన్నెల లోని వికాసమె వెలిగించెద నీ కనులా..! వేదన మరిచీ ప్రశాంతిగా నిదురించుము ఈ రేయీ..!' అని మరిపిస్తూ ఉంటే, మనసు దూదిపింజలా ఎగిరిపోతూ ఉంటుంది. అలా కలకీ నిజానికీ సరిహద్దు చెరిగిపోయిన గొప్ప క్షణాలు ఉంటాయి. సరిగ్గా ఆ క్షణంలో, కలా నిజమూ రెండూ దాగుడుమూతలాడి, కల కరిగిపోయి, ఓ పచ్చి నిజంగా మారిపోతుంది. నువ్వు ఈ భూమ్మీదే ఉన్నావ్..! అని మన మనస్సు మన చేతిని గిచ్చి మరీ చెబుతుంది. అలా నిజమెప్పుడూ చెదిరిపోదు.
మనసు పరిపూర్ణంగా నిండిపోతే మగతగా ఉంటుంది. మధ్య మధ్య అది కొంచెం కొంచెం తొణికిపోతుంటే చురుకుదనం ఏర్పడుతుంది. ఎగిసిపోయేది ఏదయినా మనసుకు రెక్కలు తొడుగుతుంది. ఏ పదార్ధమయినా ఏ రూపంలోనైనా ఎగిసిపోయినపుడు మనసుకు నిరవధిక తన్మయత్వం కలుగుతుంది. అప్పుడు ఊహలకు కూడా రెక్కలొచ్చి, అబ్బ..! యిప్పుడే యిక్కడే ఉన్నట్టుండి ఈ క్షణాన వర్షం కురిస్తే, నీలి ఆకాశంలో తళుక్కున ఓ మెరుపు మెరిస్తే... ముంచుకు వచ్చే మబ్బులు.. నీటితో నిండి తెల్లని నిండైన వెండి మబ్బులు.. ఒకదాని వెంట మరొకటి పరుగులు పెట్టే ఆ మబ్బుల్ని తదేకంగా చూస్తుంటే 'మమత లెరిగిన మేఘమాలా...! బావ లేనిది బతకజాలా..!!' అని ఓ భావగీతిక కమ్మని కథలా సాగిపోతుంది. కళ్లలో కళ, వ్యక్తీకరణలో అందం, అక్షరాలలో కాంతీ, జీవితంలో ఔన్నత్యం.. యివన్నీ పొదిగిన ముత్యంలా మనస్సు వికసిస్తుంది.
మనసులోని భావాన్ని సుతిమెత్తగా చెప్పగలిగిన నేర్పు ఉన్నవారు చక్కని స్నేహాన్ని పెనవేసుకోగలుగుతారు. మహాకవి శ్రీశ్రీ పలికించినట్టు ''మనసున మనసై... బతుకున బతుకై.. తోడొకరుండిన అదే భాగ్యమూ.. అదే స్వర్గమూ...! నిన్ను నిన్నుగా ప్రేమించుటకూ.. నీకోసమే ...!'' నని చెప్పేంతగా ఆలుమగల అనుబంధం కలిగి ఉండాలి. మనం అనుకున్నట్టు జీవితం సాఫీగా సాగిపోవాలంటే భార్యాభర్తల మధ్య పరస్పర సహకారం ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. పరస్పర అవగాహన కూడా చాలా ముఖ్యం. కుటుంబం అన్నతరవాత సమస్యలుంటాయి. సహజమే కదా! చిన్నా చితకా తేడాలున్నా, ఇరువైపులా సర్దుకుపోయే స్వభావం ఉండాలి. ఇందుకు ముందుగా ఆధిపత్య భావజాలంలో నుండి పురుష పుంగవులు బయట పడాలి. ''ఆమెకు శరీరం ఉంది. దానికి వ్యాయామం కావాలి. ఆమెకు మెదడు ఉంది. దానికి జ్ఞానం యివ్వాలి. ఆమెకు హృదయం ఉంది. దానికి అనుభవం యివ్వాలి.'' అనే సంగతిని అర్ధం చేసుకుని మెలగాలి. మనస్ఫూర్తిగా వ్యవహరించాలి.
మన మధ్య నడిచే నీడలు కూడా ఉంటాయి. నీడలు నడవడమేమిటీ..? అని అనుకుంటాం. బహుశా.. అలా సందేహించే వారికి తెలియకపోవచ్చు.. ఎన్ని అవరోధాలు ఎదురయినా ముందుకు నడిచే మనుషులుంటారనీ.. వారిలో కూడా మనసుంటుంది కదా. మరి ఆ మనుషులు నడిచినప్పుడు వారికి తోడుగా నీడలు నడవకేమి చేస్తాయి చెప్పండీ..! అందుకని ఆ అడుగులకు గమనం ముఖ్యం. మనసుంటే మార్గం ఉంటుందీ అనేది కూడా అంతే నిజం.