Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాతికేండ్ల కేరళ యువతి హదియా వివాహానికి సంబంధించి సుప్రీం కోర్టు నాలుగు రోజుల క్రితం వెలువరించిన తీర్పు వ్యక్తిగత స్వేచ్ఛకు పట్టం గట్టింది. హదియా తన ఇష్టప్రకారమే షఫీన్ జెహాన్ అనే ముస్లిం యువకుణ్ణి పెండ్లి చేసుకుంటే దానిని అడ్డుకునే హక్కు ఏ న్యాయస్థానానికి లేదని సుప్రీం స్పష్టం చేయడం మంచి విషయం. హదియా తాను ఇష్టపడి జెహాన్ను పెండ్లి చేసుకున్నానని పదే పదే చెప్పినా వినకుండా, ఆమె ఎవరో నడిపిస్తే నడుస్తున్నారని పోలీసులు, దర్యాప్తు సంస్థలు కట్టుకథలల్లితే వాటినే సత్యంగా భావించి కేరళ హైకోర్టు గత ఏడాది మే నెలలో ఇచ్చిన తీర్పును సుప్రీం నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. హదియాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దింది. న్యాయం కోసం గత పది మాసాలుగా ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకు తిరుగుతూ హదియా అనుభవించిన మానసిక క్షోభ భారతదేశంలో మరే మహిళకు పట్టకూడని విధంగా సుప్రీం చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన వ్యక్తి స్వేచ్ఛకు ఈ తీర్పు పట్టం గట్టడమే కాదు, హదియా వివాహంపై నానా యాగీ చేస్తున్న కాషాయ మూకలకు ఇదొక చెంపపెట్టు. కొత్త దంపతులను విడదీసి పైశాచికానందం పొందే పరివార్ మూకలు ఈ తీర్పు తరువాత కూడా బుసలు కొడుతున్నాయి. అందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ, ప్రజాతంత్రయుతంగా పనిచేయాల్సిన దర్యాప్తు సంస్థలు హదియా స్వేచ్ఛను హరించాలని చూడడమే బాధాకరం. ఆరెస్సెస్, బీజేపీ ఎజెండాకు అనుగుణంగా దర్యాప్తు సంస్థలు వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. వీరి దన్ను చూసుకునే మనువాదులు పెట్రేగేపోతున్నారు. ప్రేమబంధానికి ఉగ్రవాద ముద్రను అంటగట్టి ఆ నవ దంపతులను వేధిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కలచి వేస్తోంది. హదియా ఎవరి అదుపులోనూ ఉండనవసరం లేదనీ, తనకు నచ్చిన వ్యక్తితో జీవించవచ్చునని తీర్పు సుప్రీం స్పష్టం చేసిన తరువాత కూడా ఆమె భర్తకు ఉగ్రవాదంతో సంబంధముందన్న కోణంలో దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్నాయి. జెహానాకు ఉగ్రవాదంతో సంబంధాలున్నట్టు ఆధారాలుంటే అరెస్టు చేయవచ్చు. కానీ, ఇన్ని నెలలైనా ఒక్క ఆధారం సేకరించకుండా ఇంకా దర్యాప్తు కొనసాగింపు పేరుతో వెంటాడడంలో ఔచిత్యమేమిటి? దర్యాప్తు సంస్థలను ఆ దిశగా నడిపిస్తున్నదెవరో తెలుస్తూనే వుంది. దర్యాప్తు సంస్థల పరిస్థితి పంజరంలో బందీ అయిన చిలుకల్లా తయారైందని సుప్రీం ఎన్నడో చెప్పింది. కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ చేతిలో పావులుగా ఇవి వ్యవహరిస్తున్నంతకాలం ఇవి ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేవు.
హదియా కేసులో కేరళ హైకోర్టు వెలువరించిన తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం మొదటి నుంచి ఆగ్రహంతో వున్నది. యుక్తవయస్కురాలైన ఒక మహిళ వివాహాన్ని రద్దుచేసే విషయంలో మీకున్న అధికారాలు ఏమిటో చూసుకున్నారా? అని గతంలోనే నిలదీసింది. ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా చేసుకున్న పెండ్లిని న్యాయస్థానాలు రద్దుచేయగలవా? వారి నిర్ణయంలో జోక్యం చేసుకొనే అధికారం వాటికి ఎక్కడిది?' అని సుప్రీం ధర్మాసనం సూటిగా నిలదీసింది. ఆమె తనకు తగిన వ్యక్తిని ఎంచుకున్నదా లేదా, ఈ వివాహం ఆమె ప్రయోజనాలను కాపాడుతుందా లేదా అన్న విషయాలను కూడా న్యాయస్థానాలు నిర్ధారించలేని, నిర్ధారించకూడని అంశాలని తిరుగులేని రూలింగ్ ఇచ్చింది.
పాతికేండ్ల వయసున్న తాను మనసా వాచా ఇష్టపూర్వకంగానే షఫీన్ జహాన్ను వివాహం చేసుకున్నానని, తనకు నచ్చినమేరకే అతని మతాన్ని స్వీకరించాననీ, సునిశితంగా ఇస్లాంను అధ్యయనం చేసిన తర్వాతే తాను మతం మార్చుకున్నానని, ఈ ప్రక్రియ మొత్తంలో ఎక్కడా ఎవ్వరి ఒత్తిడీ తనపై లేదని నవంబరులో సుప్రీంకోర్టు ముందు హదియా వెళ్లబోసుకున్న గోడును చూసి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు చలించిపోయారు. హదియా మొత్తంలో అతిపెద్ద చిక్కుగా భావించేది ఆమె భర్తకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అంశం. నేరపూరితమైన ఈ కోణంలో సాగాల్సిన దర్యాప్తు హదియా వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్రతలకు భంగం కలిగించడం, ఆమెను ఇబ్బందులకు గురిచేయడం ఎంతమాత్రం అనుమతించరానిది. హిందూత్వ శక్తులు ప్రత్యేకంగా దృష్టి నిలిపిన ఒక్క కేరళలోనే హదియా లాంటి 89 జంటల కేసులను 'లవ్ జిహాదీ' కేసులుగా జాతీయ దర్యాప్తు సంస్థ వెంటాడివెంటాడి వేధింపులకు గురి చేస్తోందంటే దేశంలో ఎంతటి ప్రమాదకర పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు.
మతతత్వ శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గిన సొంత కుటుంబ సభ్యులే స్వచ్ఛమైన తమ ప్రేమకు ఉగ్రవాద కోణాలను అంటగట్టి ఛీకొట్టినా, న్యాయస్థానాల్లో కేసులు, దర్యాప్తు సంస్థల విచారణలు ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా నిత్య మానసిక సంఘర్షణలోనూ అలుపెరగక సంయమనంతో హదియా, ఆమె భర్త షఫీన్ సగౌరవంగా సర్వోన్నత న్యాయస్థానంలో విజయం సాధించిన తీరు, వారి మొక్కవొని పోరాట స్ఫూర్తి ఎంతైనా ప్రశంసనీయం. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో కుటుంబాన్ని ధిక్కరించవచ్చా? అని పితృస్వామ్యవాదులు కొందరు లేవనెత్తిన ప్రశ్నకు వ్యక్తిగత స్వేచ్ఛే ముఖ్యమని సుప్రీం కోర్టు తిరగులేని రీతిలో సమాధానమిచ్చింది. అందుకే ఈ తీర్పుఅనేక విధాలుగా ప్రాధాన్యత సంతరించుకుంది.