Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ రాజకీయ యువనికపై కదలికలు వేగం పుంజుకుంటున్నాయి. సరికొత్త సమీకరణలు, అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటు న్నాయి. వెరసి బీజేపీకి ఎదురుగాలి మొదలైంది. ఉత్తరప్రదేశ్, బీహార్ ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు తాజా ఉదాహరణ. నిజానికి ఈ ఎదురుగాలి గుజరాత్ ఎన్నికల నుండే మొదలైంది. ప్రధాని మోడీకి ప్రతిష్టాత్మకం, బీజేపీకి కంచుకోట అనుకున్న గుజరాత్లో బీజేపీ గెలిచినప్పటికీ అది అంత గౌరవప్రదమైన గెలుపేమీ కాదు. గుజరాత్లో బీజేపీ స్థానాల సంఖ్య 165 నుంచి 99కి పడిపోవడం గమనార్హం. ఈ గెలుపు కూడా ప్రధాని నానా ప్రయాసలు పడితే తప్ప సాధ్యం కాలేదు. ఆపైన పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీకి వరుస ఓటములు ఎదురయ్యాయి. ఈ పరాభవం నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో సాధించిన చిన్న చిన్న విజయాలతో ఉపశమనం పొందుతున్న బీజేపీకి తాజా యూపీ, బీహార్ ఫలితాలు శరాఘాతమనే భావించాలి. ఎందుకంటే దేశంలోనే అత్యధిక పార్లమెంట్ స్థానాలు ఉన్న రాష్ట్రం యూపీ. గత లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్ష విజయాలను అందించి అధికారంలో కూర్చోబెట్టిన రాష్ట్రం యూపీ. అటువంటి రాష్ట్రంలో స్వయంగా ముఖ్యమంత్రి యోగి, ఉప ముఖ్యమంత్రి మౌర్య ఖాళీ చేసిన గోరఖ్పూర్, ఫూల్పూర్ లోక్సభ స్థానాల్లో బీజేపీ ఓటమిపాలైంది. దశాబ్దాలుగా తిరుగులేని విజయాలను సాధిస్తూ వచ్చిన ఈ స్థానాల్లో బీజేపీకి ఎదురైన ఈ ఓటమి మారుతున్న రాజకీయ పరిస్థితులకు సూచిక.
బద్ధ విరోధులైన సమాజ్వాదీ, బహుజన సమాజ్వాదీ పార్టీలు ఆఖరు నిమిషంలో చేతులు కలపడం ఈ ఎన్నికల్లో అనూహ్య పరిణామం. కేవలం ఈ కారణంగానే బీజేపీ ఓడిపోయిందని చెప్పలేం. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీల ఓట్లతోపాటు, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లను కలిపినా బీజేపీకి వచ్చిన ఓట్లకంటే తక్కువే. కనుక ఈ ఫలితం బీజేపీ పట్ల ప్రజా వ్యతిరేకతను స్పష్టం చేస్తున్నదనడంలో సందేహం లేదు. ఇక బీహార్లో ఆర్జేడీ విజయాన్ని కూడా తేలిగ్గా తీసిపారేయలేం. నితీశ్కుమార్ బీజేపీ పంచన చేరాక జరిగిన ఈ ఆరియా లోక్సభ ఫలితం కూడా బీజేపీకి చేదు అనుభవాన్నే మిగిల్చింది. అంతేకాదు ఈ ఫలితం మోడీ, నితీశ్ల మైత్రి ఎంత అనైతికమో, అపవిత్రమో తేల్చి చెప్పింది. ఏది ఏమైనా యూపీ, బీహార్లతోపాటు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ముఖాముఖి తలపడుతున్న పంజాబ్, రాజస్థాన్లలో కూడా చతికిలబడటం బీజేపీకి ఎదురుదెబ్బే. బీజేపీ ఏలుబడిలో దేశమంతటా అలుముకున్న అసహనం, మతోన్మాదం, హింసాత్మక ధోరణులతోపాటు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఫలితంగా దుర్భరమవుతున్న ప్రజా జీవితం, పెచ్చరిల్లుతున్న అవినీతి, కుంభకోణాలను ప్రజలు అర్ధం చేసుకుంటున్నారనడానికి సూచికలు ఈ ఫలితాలు. బీజేపీ మిత్రపక్షాలకు కూడా ఈ విషయం స్పష్టమతుండటంతో క్రమంగా దూరమవుతున్నాయి.
బీజేపీకి మిత్రపక్షాలు దూరమవుతుండటానికి కేవలం ఆ పార్టీ పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతే కారణం అని చెప్పలేం. దీనికి మించి ఎవరి కారణాలు వారికున్నాయి. అన్నింటికీ మించి మోడీ-షా ధ్వయం నియంతృత్వ ధోరణి వారిని ఆందోళనకు గురిచేస్తున్నది. ఆ తరువాత కేంద్రంలో ప్రభుత్వం తమ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వటం లేదన్నది వాటి ఆక్షేపణ. శివసేన ఇందుకొక తార్కాణం. శివసేన బీజేపీకి అత్యంత సన్నిహితమైన మిత్రపక్షం. కానీ అదే శివసేన నేడు ప్రభుత్వాన్నీ, బీజేపీ నాయకత్వాన్నీ బహిరంగంగా విమర్శిస్తోంది. మరో ప్రధాన మిత్రపక్షం అకాలీదళ్ చాలాకాలంగా వేచిచూసే ధోరణినే అవలంబిస్తూ, అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నది. ఇక తెలుగుదేశం ఏపీకి అన్యాయం జరిగిందంటూ ఇటీవలే మంత్రివర్గం నుంచి వైదొలగి, ఇప్పుడు అవిశ్వాస తీర్మానం కూడా పెట్టింది. నిన్న మొన్నటి వరకు మోడీనీ, కేంద్రాన్నీ పల్లెత్తు మాట అనని టీఆర్ఎస్ ఉన్నట్టుండి వ్యతిరేక గళం అందుకుంది. బీజేడీ నేత నవీన్ పట్నాయక్ సైతం బీజేపీని మునిగిపోతున్న పార్టీగా అభివర్ణిస్తున్నారు. వీటన్నిటికీ కారణాలేమైనా రాజకీయంగా బీజేపీకి ఎదురుగాలినే సూచిస్తున్నాయి.
బీజేపీకి దూరమవుతున్న ఈ రాజకీయ పక్షాలన్నీ కాంగ్రెస్తో కలవడానికి సిద్ధంగా లేవు. అందుకే తృతీయ ఫ్రంట్ వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ తృతీయఫ్రంట్ పాటెత్తుకుంటే చంద్రబాబు ఫెడరల్ ఫ్రంట్కు ప్రయత్నిస్తున్నట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. వీటికి సానుకూలతలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ కానట్టే, ఈ రెండింటికీ ప్రత్యామ్నాయం మరో రాజకీయ కూటమి మాత్రమే కాదన్నది ఇక్కడ గుర్తించవలసిన అంశం. పార్టీలు వేరైనా కాంగ్రెస్, బీజేపీల విధానాలు ఒక్కటే. వీటికి నిజమైన ప్రత్యామ్నాయం కావాలి. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నా పట్టించుకోని నేతలు తమ పార్టీల ప్రయోజనాలకు ప్రమాదం ఏర్పడినప్పుడు మాత్రమే ప్రత్యామ్నాయాల గురించి మాట్లాడటం వలన ప్రయోజనమేముంటుంది..!? ఇప్పుడు కావాల్సింది ఒక నిజమైన ప్రజాపక్షం. ఓ విధానపరమైన ప్రత్యామ్నాయం. అదే ప్రజల ఆకాంక్ష.