Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితంలో ప్రతిక్షణం నవనవోన్మేషంగా గడపాలన్న ఆకాంక్ష సహజం. మన అనుభవాల్లో, ఎదురయ్యే సంఘటనల్లో, దు:ఖంలో, సంతోషంలో కొత్తదనం కోసం ఆరాటపడటం మానవనైజం. సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, పూలు వికసించడం, నదులు ప్రవహించడం సర్వసాధారణం. కాలాలు వచ్చిపోతుంటాయి. రుతువులు మారుతుంటాయి. హేమంతం, గ్రీష్మం, వసంతం రాక అనివార్య పరిణామం. అయినప్పటికీ కాలాన్ని కొలమానంగా చేసుకొని నవ్యతని ఆశించడం మానవ స్వభావం. అందుకే నూతన సంవత్సరమన్నా, కొత్త రుతువులున్నా, కొత్త పంటలన్నా మనుషుల్లో ఒక ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. మానసికావరణంలో తెలియని ఉత్తేజమేదో తిరుగాడుతుంటుంది. ఏడాది పోకడ, రాకడ మామూలే అని సరిపెట్టుకోనివ్వదు మస్తిష్కం. కొత్త ఏడాదికి స్వాగతం పలకడం, కవిత్వ తోరణాలతో ఆహ్వానించడం ఆనందప్రద కలాపం. అందుకే విళంబి ఉగాదికి స్వాగతం పలుకుతోంది తెలుగు సమాజం.
''నాకు ఉగాదుల్లేవు, ఉషస్సుల్లేవు'' అని కృష్ణశాస్త్రి రాసినప్పటికీ కాసింత సాంత్వన కోసం ఆరాటపడే మనసు పండుగ వాతావరణానికి అతీతంగా ఉండదు. రెక్కలకష్టమ్మీద బతికే వారు పండగనాడు కూడా పనులు తప్పవని ఈసురోమంటారే తప్ప పండగ మీద విముఖత చూపరు. పండగంటేనే నూతనోత్సాహంతో మనసు విరాజిల్లుతుంది. పండగలన్నా, జాతరలన్నా, ఉత్సవాలన్నా, ఊరేగింపులన్నా ఆసక్తి చూపుతారు మనుషులు. నలుగురు కలిసే సందర్భాలు, మనసులు కలబోసుకునే సన్నివేశాలు పండగ వేళల్లోనే సాధ్యం. కష్టం, సుఖం పంచుకోడం, మంచీచెడ్డా మాట్లాడుకోడం ఎప్పుడయినా కొత్తగా ఉంటుంది. తెలియని విషయాలేవో తెలుసుకుంటున్న అనుభూతి హృదయానికి గొప్ప ఊరడింపు.
పండగలనే కాదు ఇతరేతర సందర్భాల్లోనూ కొత్తదనం కోసం ఉవ్విళ్ళూరుతుంది మనసు. కౌమారం విడిచి యవ్వనప్రాయంలోకి వెళ్ళే సమయాన తెలియని ఆకర్షణ ఏదో మనుషుల్ని కట్టిపడేస్తుంది. భావోద్వేగాలతో లోకమంతా కొత్తగా కనిపిస్తుంది. ఊగించి శాసించే ఉద్వేగాలు, యవ్వనోద్రేకాలు కొత్తకొత్తగా వుండి ఆనందాన్నీ, దు:ఖాన్నీ, ఎడబాటునీ ఇస్తాయి. 'బాధే సౌఖ్యమనే భావన రానీవోరు' అన్నాడో కవి. ఎందుకంటే కొన్నిసార్లు బాధ అనివార్యం. ప్రేమ వైఫల్యాలు, ఎడబాట్లు, ఆకస్మిక బ్రేకప్లు మనిషిని నిలువనియ్యవు. అంతా శూన్యంగా అనిపిస్తుంది. ఆశిస్తారు, భంగపడతారు. భంగపాటు ఎల్లకాలం ఉండదనే ఎరుక ఉండదు. అందుకే మనసుకు దూరం కావడం, మనిషికి దూరం కావడం భరించలేని దు:ఖం కలిగిస్తుంది.
దు:ఖించే మనసు అలాగే ఉండిపోదు. కాలం ఎవరికోసమూ నిలిచిపోదు. మరల కొత్త మనుషులు తారసపడతారు. మనసైన మనిషి కోసం అనుకోకుండా ఎదురుచూస్తారు. మరల కొత్త సరికొత్తగా అనిపిస్తుంది. ''ఒక అనుభవం తర్వాత మరో అనుభవమే జీవితం'' అంటారు కవి పఠాభి. అయితే ఎప్పటికప్పుడు ఆ అనుభవం కొత్తగా ఉండాలన్నదే మనిషి తపన. అందుకే బాల్యం, కౌమారం, యవ్వనం, నడిప్రాయం, వార్థక్యం అన్నవి ప్రతి మనిషికి నూతన దశలే. ఆయా దశల్లోని ప్రతి సంఘటనా, ప్రతి కలాపమూ కొత్తగా రూపొందించు కోవాలన్న ఆరాటమే అనేకానేక అనుభవాలకు మూలం.
పెళ్ళి, పిల్లలు, వాళ్ళను పెంచడం, వాళ్ళ బాల్యం, కౌమారం, యవ్వనం, యవ్వనావస్థల్లోని వెతలు అన్నీ ఎప్పటికప్పుడు నవీనదశలే. ఈ క్రమాన మనిషి వ్యక్తిగా, సమూహంలో ఒకనిగా పరస్పర ప్రభావితమైన పాత్రలు పోషిస్తారు. వ్యక్తిగా తన జీవిత ఔన్నత్యానికి సమాజం మూలమనే స్పృహ ఉన్నవారు చైతన్యవంతమైన పాత్రని నిర్వహిస్తారు. మనిషి మేలుని కోరని వ్యవస్థల తీరును భిన్నరూపాల్లో ప్రతిఘటిస్తారు. మనిషి మంచి కోసం ఏం చేస్తే బావుంటుందన్న ఆలోచనతో తమ వ్యక్తిగత, సమాజగత జీవితాన్ని మలచుకుంటారు. ఈ ప్రయాణంలో అవసరమైతే వ్యక్తిగా తన సౌఖ్యం కన్నా సమాజహితం మేలని తలపోస్తారు. అందుకు అనువైన ఆచరణని సంతరించుకుంటారు. ఇక్కడా కొత్తగా ఆలోచిస్తారు. భిన్నమైన క్రియాశీలతతో వ్యవహరిస్తారు. సరికొత్త నినాదాలు, పోరాటరూపాలు కాలానుగుణంగా కొత్త ఎజెండాలతో పదునెక్కుతాయి.
మార్పు అనివార్యం, అవసరమన్న లక్ష్యం తప్ప నిశ్చల నిశ్చితాలుండవు. సకలం మారుతుంటాయి. నవీన ఉత్తేజంతో భాసిల్లుతాయి. ఒకనాడు కరపత్రం ఊగించి శాసించే ఉద్యమతేజం. ఈ రోజున సోషల్మీడియాలో పెట్టే చిన్నపోస్టు సైతం జనావళిని కదిలించే ఉద్యమ నినాదం. సాంకేతిక ప్రజ్ఞ ఒకరి సొత్తు కాదు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పాలకుల భజన చేసినా, సోషల్మీడియా సరికొత్త రూపాల్లో ఎదురుదాడి చేస్తుంది. వేల సంవత్సరాల మానవ ప్రయాణంలో ప్రతిభా సంపత్తులు ఒక్కచోట నిలిచిపోలేదు. ప్రజలపరం కావడం అనివార్యమయ్యాయి. మారుతున్న కాలాన మారే ప్రజల సరికొత్త ఆకాంక్షలకు అనువుగా మారడం తప్పనిస్థితి. జీవితంలో కొత్తదనం ఆశించే మానవస్వభావమే దీనికి చోదకశక్తి. కొత్తదనమంటే మార్పును కోరడం, మార్పు కోసం అసంకల్పితంగానే శ్రమించడం, మార్పు దిశగా ప్రయాణించడం. ఈ ప్రయాణంలో ఉగాదులు ఎన్నో వస్తుంటాయి. వాటిని సరికొత్తగా స్వాగతం పలకడం చరాచర ప్రకృతికి సత్కారం.
న