Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్-ఉన్ల మధ్య సింగపూర్లో జరిగిన సమావేశం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఈ మధ్య కాలంలో వార్తలను సేకరించటానికి ఇంతమంది పాత్రికేయులు కూడిన శిఖరాగ్ర సమావేశం ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. అధికారంలోవున్న ఒక అమెరికా అధ్యక్షుడు ఒక ఉత్తర కొరియా నాయకుడ్ని ముఖాముఖి కలవటం చరిత్రలో ఇదే తొలిసారి. ప్రస్తుత పరిస్థితుల్లో వీరిమధ్య జరిగిన ఒప్పందం ఒక ముందడుగు. ఎందుకంటే 1950వ దశకం మొదటి భాగంలో ఈ దేశాల మధ్య జరిగిన యుద్ధంలో కాల్పుల విరమణ జరిగిన తరువాత 65ఏండ్ల పాటు ఒక విధమైన యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఆ యుద్ధంలో అమెరికా ఉత్తర కొరియాను సర్వనాశనం చేసింది. అమెరికా యుద్ధ విమానాలు చేసిన దాడులలో 30లక్షలమందికిపైగా ఉత్తర కొరియా ప్రజలు విగత జీవులయ్యారు.
తమ దేశాలమధ్య 'నూతన సంబంధాల'ను పెంపొందించుకోవటం కోసం ఇరు దేశాలూ ప్రయత్నిస్తాయనీ, కొరియా ద్వీపకల్పంలో సుస్థిర శాంతి స్థాపన జరుగుతుందనీ ట్రంప్, కిమ్లు సంతకాలు చేసిన సంయుక్త ప్రకటన పేర్కొంది. ఉత్తరకొరియా భద్రతకు దక్షిణకొరియాతో సంయుక్త సైనిక విన్యాసాల నిలుపుదలకూ ట్రంప్ హామీ ఇవ్వగా, కొరియా ద్వీపకల్పాన్ని సమూలంగా అణ్వాయుధరహిత ప్రాంతంగా మార్చటానికి నిబద్ధతతో కృషి చేస్తానని కిమ్ వాగ్దానం చేశాడు. అయితే ఈ ప్రకటిత లక్ష్యాలను ఎలా సాధిస్తారు? వాగ్దానాలను ఎలా నెరవేరుస్తారు? అనే విషయాల గురించి వేచి చూడాలి.
ట్రంప్-కిమ్ల సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందనే చెప్పాలి. తన దేశాన్ని అమితంగా ప్రేమించే కిమ్ 'చాలా తెలివైనవాడు' అని ట్రంప్ పొగిడాడు. గతేడాది ఇదే ట్రంప్ కిమ్ను 'బొమ్మ రాకెట్తో ఆడుకునేవాడు' అని అన్నాడు. అంతేకాకుండా ఉత్తర కొరియాను ప్రపంచం కనీవినీ ఎరుగని విధంగా సర్వనాశనం చేస్తానని ట్రంప్ హెచ్చరించాడు.
ఉత్తర కొరియాకు అమెరికాతో ఏర్పడిన యుద్ధ ప్రమాదం తొలగిపోయిందనే హామీని ఈ సమావేశం ఇవ్వకపోయినప్పటికీ, ఆ దశలో చర్చలు కొనసాగింపునకు సానుకూల వాతావరణం కల్పించింది. కిమ్తో చేసుకున్న ఒప్పందంలోని అస్పష్టతలను తొలగించి దానికి ఎంతోకొంత నిర్దిష్టత తీసుకువచ్చే బాధ్యతను అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపియో, జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్లకు ట్రంప్ అప్పగించాడు. కిమ్ను హత్యచేయటం ద్వారా మాత్రమే ఉత్తర కొరియాలో అణ్వస్త్ర నిరాయుధీకరణను సాధించగలమని తాను అమెరికా గూఢచార సంస్థ సీఐఏ డైరెక్టర్గావున్న సమయంలో పోంపియో సూచించాడు. అలాగే ఉత్తర కొరియాను బాంబు దాడులతో హౌరెత్తించాలని బోల్టన్ ఇటీవల ఫిబ్రవరి నెలలో తాను వాల్స్ట్రీట్ జర్నల్లో రాసిన వ్యాసంలో చెప్పాడు. ఉత్తర కొరియాతో అమెరికా చేయవలసిన చర్చలు 'లిబియా నమూనా'లాగా ఉండాలని ఈమధ్య కాలంలో బోల్టన్ సూచించాడు. అంటే కిమ్ వద్దనున్న మానవ హనన ఆయుధాలను నిర్వీర్యం చేయటం కోసం ఒక ఒప్పందం చేసుకుని అంతిమంగా ఆయనను హతమార్చటమే బోల్టన్ 'లిబియా నమూనా' లక్ష్యం.
సైనిక దాడులు చేస్తామని, ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ఇతర దేశాలను భయపెట్టి నిరాయుధులను చేసే అలవాటు ఉన్న అమెరికాతో ఈ ఒప్పందం జరగటం విశేషం. 'లిబియా నమూనా' అనేది అమెరికా అమలు చేసే విధానానికి మినహాయింపు కాదు. అదే దాని అసలు విధానం. ఇరాక్, లిబియా దేశాలపై యుద్ధం చేసి ఆయాదేశాల నాయకులను హతమార్చింది. ప్రపంచంలోని ప్రధాన దేశాలతో ఇరాన్ కుదుర్చుకున్న అణ్వస్త్ర ఒప్పందం నుంచి ట్రంప్ ఏకపక్షంగా వైదొలిగాడు. అంటే సింగపూర్లో ఉత్తర కొరియాతో చేసుకున్న ఒప్పందం నుంచి కూడా వైదొలగటం ట్రంప్కు చిటికలో పని.
అమెరికా కిమ్ జోంగ్-ఉన్తో చర్చలు చేయటానికి కారణం ఆయన దగ్గరి అణ్వస్త్రాలకు భయపడో లేక ఈశాన్య ఆసియాలో సుస్థిర శాంతిని నెలకొల్పటానికో కాదు. అమెరికా ప్రధాన లక్ష్యం తమ శత్రు దేశాలయిన రష్యా, చైనాలకు, పోటీదారులుగా ఆవిర్బవించనున్న జపాన్వంటి దేశాలకు వ్యతిరేకంగా తన సామ్రాజ్యవాద ప్రయోజనాలను ముందుకు తీసుకుపోవటమే. రష్యా, చైనాలతో సరిహద్దుగల ఉత్తర కొరియాను తన ఆధీన రాజ్యంగా మలచుకుంటే ప్రపంచ ఆధిపత్యం కోసం అగ్రరాజ్యాలమధ్య జరుగుతున్న పోరులో అమెరికా వ్యూహాత్మక పరిస్థితి మెరుగవుతుంది. ఇదే అసలు విషయం.
ఈ నేపథ్యంలో వాణిజ్య యుద్ధోన్ముఖంగా సాగుతున్న అగ్రరాజ్య ఆధిపత్యపోరుకు చెందిన ప్రపంచ రాజకీయ నేపథ్యంలో సింగపూర్ ఒప్పందం ఫలితాలు వేచిచూడవల్సిందే! సంక్షుభిత పెట్టుబడిదారీ వ్యవస్థ నిరంతర యుద్ధాలకు తెగబడుతుంది. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో కార్మికవర్గం నాయకత్వాన సకల పీడిత ప్రజలను సమీకరించటంతోనే పెట్టుబడిదారీ వ్యవస్థ యుద్ధ పిపాసకు వ్యతిరేకంగా అడ్డుకట్ట వేయగలం.