Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెట్రో ఉత్పత్తుల ధరల ప్రభావం ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోసింది. పండ్లూ కూరగాయలు సహా పలు ఆహార ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికే అడ్డూ అదుపూ లేకుండా పెరిగిన ధరలు, నోట్ల రద్దుతో ఎండుటాకుల్లా మారిన సామాన్యుల జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. ఈ ఏడాది ఏప్రిల్లో 4.58శాతంగా ఉన్న వినియోగ(రిటైల్) ద్రవ్యోల్బణం, మే నెల వచ్చేసరికి 4.87శాతానికి ఎగబాకింది. గతేడాది మేనెలలో వినియోగ ద్రవ్యోల్యణం 2.18శాతంగా ఉంది. ఆహార ధరల సూచి 2.80శాతం నుంచి 3.10శాతానికి పెరిగింది. కూరగాయల ధరలు 8.04శాతానికి, పండ్ల ధరలు 12.33శాతానికి పెరుగుదల నమోదైంది. ఆలుగడ్డలు గరిష్టంగా 81.93శాతం ప్రియమై ఆందోళనకర స్థాయికి చేరాయి. ఇవి సాక్షాత్తూ కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన లెక్కలే. ఈ ఏడాది జనవరి తర్వాత ద్రవ్యోల్బణం ఇంత గరిష్ట స్థాయికి చేరడం ఇదే ప్రథమం. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు కళ్లెం వేయకుంటే, భవిష్యత్తులో దిగుమతుల బిల్లు భారీగా పెరిగి కరెన్సీ మారకంపై తీవ్ర ప్రభావం చూపనుందని కేంద్రాన్ని అసోచామ్ హెచ్చరించింది. ఇది నరేంద్రమోడీ ప్రభుత్వం చివరి సంవత్సరంలో దేశ ప్రజలకు అందిస్తున్న కానుకగా చెప్పవచ్చు.
చమురు ధరల వల్ల టోకు ధరల ద్రవ్యోల్బణం ఏకంగా 14 నెలల గరిష్టానికి ఎగబాకి 4.43శాతానికి పెరిగింది. గతేడాది మార్చిలో 5.11శాతంగా నమోదు చేసుకున్న టోకు ద్రవ్యోల్బణం ఈ మే నెలలో మరోసారి గరిష్టానికి చేరుకుని అన్నిటిపైనా ప్రభావం చూపింది. ఇది మరో 0.80శాతం పెరగవచ్చని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. వినియోగదారీ ధరల సూచీని కాకుండా టోకుధరల సూచీని ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ద్రవ్యోల్బణం రేటుకు, వాస్తవంగా ప్రజలు ఎదుర్కొంటున్న ధరల సమస్యకు పొంతన లేకుండా పోయింది. ప్రపంచంలో చాలా దేశాలు ద్రవ్యోల్బణాన్ని లెక్కించేందుకు వినియోగదారీ ధరల సూచిని ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే ఆహార ధరలు 0.87శాతం నుంచి 1.60శాతానికి పెరిగినా నరేంద్రమోడీ ప్రభుత్వంలో చలనం లేదు. పెట్రో రేట్లు పెరిగితే ద్రవ్యోల్బణం కట్టు తప్పుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. పెట్రోల్, డీజిల్ రేటు లీటర్కు రూపాయి పెరిగితే ద్రవ్యోల్బణం 0.03శాతం నుంచి 0.08శాతం పైకి ఎగబాకుతుందన్న అధ్యయనాలు ఉండనే ఉన్నాయి. ఇదే జరిగితే ద్రవ్యవిధానంలో ఆర్బీఐ మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు పెరిగాయన్న అంచనాతో ఆర్బీఐ వడ్డీ రేట్లను 0.25శాతం పెంచింది. ఆగస్టులో మరోసారి వడ్డీ రేట్లు పెరగడం ఖాయమని విశ్లేషకుల అంచనా. ఒక్క పెట్రో ఉత్పత్తుల ధరలే ఎంతోమంది జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.
దేశ ఆర్థిక వ్యవస్థను ద్రవ్యోల్బణం అత్యంత ప్రభావితం చేస్తోంది. ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ద్రవ్యోల్బణం ప్రభావాలను, వాటి కారణాలను అర్థం చేసుకుని తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం పెరగడం ద్వారా ప్రజల కొనుగోలుశక్తి హరించుకుపోతుంది. ప్రభుత్వానికి రావాల్సిన రాబడి తగ్గి ద్రవ్యలోటు పెరిగే ప్రమాదం ఉంది. బీజేపీ ప్రభుత్వం ద్రవ్యలోటును తగ్గించుకునే పేరిట సంపన్నవర్గాలకు తోడ్పడింది. ఎరువులు, క్రిమిసంహారక మందులు, విద్యుత్ వంటి రైతులకిచ్చే సబ్సిడీలకు కోత పెట్టింది. మరోవైపు సంపన్నవర్గాలకు, కార్పొరేట్ రంగానికి భారీగా పన్నులు మినహాయించింది. కాంగ్రెస్ హయాంలోనే ఈ విధానం ఉన్నా ఇప్పుడు మోడీ మరింత వేగం పెంచారు. ఎరువులూ ఇంధన ధరలూ పెరిగాయి. అదే సమయంలో ప్రజా సంక్షేమాన్నీ సేవలనూ చిన్నచిన్నగా ప్రయివేటీకరిస్తున్నారు. వైద్యం, విద్య, తదితర ఖర్చులను వినిమయ ధరల సూచిక లెక్కల పరిధిలోకి రాకుండా జాగ్రత్తపడింది. అందుకే ద్రవ్యోల్బణం లెక్కలకన్నా వాస్తవంగా ధరల పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటున్నది.
మోడీ సర్కారు వచ్చాక అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించలేదు. సరికదా ఇంకా పెరిగాయి. రోజువారీగా ధరలు నిర్ణయించే విధానం వలన అవి రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. ఆ విధంగా సమకూరిన వేల కోట్ల రూపాయలు కేంద్ర ఖజానాలో జమ చేసుకున్నది. కర్నాటక ఎన్నికల సమయంలో పదహారురోజుల పాటు నిలిపేసిన పెట్రో ధరలను ఆ తర్వాత వారం రోజుల పాటు రోజుకు లీటర్కు 50 పైసల నుంచి రూపాయి చొప్పున పెంచుకుంటూ వచ్చింది. ఉపఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో ధరలను నామమాత్రంగా పైసా, రెండు పైసలు తగ్గిస్తూ వస్తున్నది. ఇది కూడా తాత్కాలికమే. మరోవైపు పెద్దనోట్ల రద్దుతో కోట్లాదిమంది ఉపాధి కోల్పోయారు. అయినా నోట్లరద్దుతో ఆర్థిక వ్యవస్థ స్వచ్ఛంగా ఉందనీ, తన పాలన బ్రహ్మాండంగా ఉందనీ ప్రధానమంత్రి కితాబు ఇచ్చుకుంటున్నారంటే సామాన్య ప్రజల జీవితాల గురించి ఆయనకు ఏపాటి శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. అధిక ధరలు, ఆహార ద్రవ్యోల్బణంపై ప్రజలు సమైక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది.