Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సహకార స్ఫూర్తి, పోటీతో కూడిన సమాఖ్యతత్వంతో ఒకే జట్టుగా ముందడుగు వేద్దామని మొన్నటి నిటి ఆయోగ్ పాలకమండలిలో ప్రధాని మోడీ ముఖ్యమంత్రులకు సూచించారు. తమ ప్రభుత్వ పాలన మాత్రం ఇందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే తూచ తప్పక మోడీ ప్రభుత్వం కూడా రాజ్భవన్ రాజకీయాలు చేస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఐఏఎస్లనూ అస్త్రంగా వాడుకుంటున్నది. తమతో చేతులు కలపలేదన్న ఒకే ఒక్క కారణంతో ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్థిరతపాల్జేసేందుకు వికృతక్రీడకు దిగింది. ఐఏఎస్లను సహకరించకుండా ఎగదోస్తోంది. విసుగెత్తిన కేజ్రీవాల్, సహచర మంత్రులతో కలిసి నిరసనకు దిగారు. ఎనిమిది రోజులుగా ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజన్ ఇంట్లో కేజ్రీవాల్ దీక్ష చేస్తున్నారంటే, ప్రజలచేత ఎన్నికైన ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా అడుగడుగునా ఎన్ని ఆటంకాలు కల్పిస్తున్నారన్నదీ అర్థమవుతోంది. కేజ్రీవాల్ దీక్షకు సీపీఐ(ఎం), టీడీపీ, టీఎంసీ, జనతాదళ్(ఎస్), శివసేన, తదితర పార్టీలు మద్దతు పలికాయి. ఆప్ నిర్వహించిన ర్యాలీలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరై సంఘీభావం ప్రకటించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని కేంద్రానికి ముఖ్యమంత్రులు పినరయి విజయన్, చంద్రబాబునాయుడు, మమతాబెనర్జీ, కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. తన ప్రజలను శిక్షిస్తున్నవారిపై తాను 'సర్జికల్ స్ట్రయిక్' చేస్తున్నానని కేజ్రీవాల్ ప్రకటించి కేంద్రానికి సవాల్ విసిరారు.
మూడేండ్ల కింద అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ తిరుగులేని మెజార్టీ సాధించింది. కేంద్రం నుండి కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఆశించిన సహకారం లేదు. బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినా ఢిల్లీలో రాలేకపోయింది. ఆప్ ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మంత్రుల ఇండ్ల వద్ద, కార్యాలయాల్లోనూ సీసీ కెమెరాలు బిగించేందుకు వేసిన ఎత్తులూ పారలేదు. లెఫ్ట్నెంట్ గవర్నర్ చర్యను నిరసిస్తూ దీక్ష చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఈ సమయంలోనే వాణిజ్య ప్రకటన విషయంలో ఆప్ ఎమ్మెల్యేలకు, ఐఏఎస్ అధికారులకు మధ్య చోటు చేసుకున్న వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. అప్పట్నుంచీ అధికారులు విధులకు హాజరుకావడం లేదు. ఒకరకంగా సహాయ నిరాకరణే. దీనిని బీజేపీ ప్రభుత్వం అవకాశంగా తీసుకున్నట్టు కనిపిస్తున్నది. ఢిల్లీ ముఖ్యమంత్రి లేఖ రాసినా స్పందించలేదు. దీంతో సీఎం, మంత్రులు లెఫ్ట్నెంట్ గవర్నర్ నివాసంలోనే బైటాయించారు. అక్కడనుంచే పాలన సాగిస్తున్నారు. ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ఆదేశాల మేరకు అధికారులు విధులకు గైర్హాజర్ అవుతున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. తాము సమ్మె చేయడం లేదని చెబుతూనే ముఖ్యమంత్రి, మంత్రులు నిర్వహించే సమావేశాలకు మాత్రమే హాజరుకావడం లేదని ఐఏఎస్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఈ వివాదంలో తప్పెవరిదన్న విషయం పక్కన పెట్టినా పరిస్థితి చక్కదిద్దాలన్న స్పృహ లెఫ్ట్నెంట్ గవర్నర్కు లేకపోవడం ఆశ్చర్యం. పైగా తనను సీఎం బెదిరించారంటూ అనిల్ బైజల్ ప్రకటించడం మరింత ఆజ్యం పోసింది. ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇతర దేశాల నుంచి ఎంతోమంది ప్రతినిధులూ పర్యాటకులూ ఢిల్లీకి వస్తుంటారు. దేశ రాజధానిలో ఇలాంటి సంఘటనలు జరగడం క్షంతవ్యం కాదు. ఇతర రాష్ట్రాల సీఎంల సూచనలతోనైనా కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలి.
కేజ్రీవాల్ పరిస్థితి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భిన్నమైనది. సొంతంగా ఏ నిర్ణయాలూ తీసుకోవడానికి వీల్లేదు. తాను చెప్పినట్టు నడుచుకోవాలన్న రీతిలో మోడీ ఉన్నారు. దీనికితోడు, పాలనాధికారి లెఫ్ట్నెంట్ గవర్నరేనంటూ 2016లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కేజ్రీవాల్కు పెద్ద దెబ్బ. అప్పట్నుంచే ఆప్ ప్రభుత్వానికి ఇక్కట్లు మొదలయ్యాయి. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వాయిదావేసి ఆర్నెల్లుగా ఎటూ తేల్చడం లేదు. కీలకమైన నిర్ణయాలకు గవర్నర్ తరచూ అడ్డు పడుతుండటమే ఆప్ ఎమ్మెల్యేల్లో ఆగ్రహాన్ని పతాకస్థాయికి పెంచింది. పుదుచ్చేరిలోనూ లెఫ్ట్నెంట్ గవర్నర్ అక్కడ ప్రభుత్వ పాలనకు అడ్డుపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ విధానాలకూ రాజ్యాంగ దుర్వినియోగాలకూ దేశంలో కమ్యూనిస్టులే తొలి బాధితులు. 1959లో కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూలదోసింది. పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాష్ట్రాల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఎన్నికల్లో ఓటమి పాలైనా గోవా, మణిపూర్, మేఘాలయాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. బీహార్ ప్రభుత్వంలో దొడ్డిదారిన స్థానం పొందింది. కర్నాటకలో విఫలయత్నం చేసింది. ఇటువంటి ప్రయత్నాలు ఇప్పటికే గాడి తప్పిన కేంద్ర రాష్ట్ర సంబంధాలను మరింత దెబ్బతీస్తాయి. ఇటువంటి వాటిని అడ్డుకుంటేనే ప్రజాస్వామ్యం మరింత పరిపుష్టి కాగలదు.