Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ సర్కారు కేంద్ర ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నిటిఆయోగ్ను ఏర్పాటు చేశాక నిర్వహించిన పాలక మండలి భేటీల్లో ఆదివారంనాటి భేటీకి ప్రాధాన్యత ఉంది. ఈ ప్రభుత్వంలో బహుశా ఇదే చివరి సమావేశం. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ సారైనా నిటిఆయోగ్ను ప్రజల మార్గం పట్టిస్తారని ఎదురు చూసిన వారి ఆశలకు అధ్యక్ష స్థానం నుంచి ప్రధాని నరేంద్రమోడీ ఆద్యంతం చేసిన ఉపన్యాసం నిరాశకు గురిచేసింది. దూకుడుగా 'సంస్కరణ'లను అమలు చేసి తీరతామని మోడీ కుండబద్దలు కొట్టారు. తన విధానాల మూలంగా జనబాహుళ్యం అంతకంతకూ కడగండ్ల పాలవుతున్నప్పటికీ వాటినే కొనసాగిస్తామని స్వరం పెంచారు. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎదురుతిరిగిన రాష్ట్ర ప్రభుత్వాలను దెబ్బతీయడమే ఆయన ముందున్న ప్రధాన లక్ష్యం. ఢిల్లీలో కేజ్రీవాల్ను ఎలా ఇబ్బందులకు గురిచేస్తున్నారో చూస్తున్నాం. తాజాగా జమ్మూకాశ్మీర్లో కాల్పుల విరమణ రద్దు నిర్ణయాన్ని ఆ రాష్ట్ర సీఎం మెహబూబా ముఫ్తీ వ్యతిరేకించారని కూటమి నుండి బీజేపీ వైదొలగి పీడీపీ ప్రభుత్వాన్ని అర్ధాంతరంగా కూలదోసింది. రాష్ట్రపతి పాలన విధించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్రం అనుసరిస్తున్న వివక్షాపూరిత విధానాల పట్ల బీజేపీయేతర ప్రభుత్వాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. నాలుగేండ్లల్లో సమాఖ్యతత్వానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరించిన మోడీ ప్రభుత్వం పునరాలోచన చేయకపోగా అదే తన పంథా అని స్పష్టం చేసింది. లోక్సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఆర్థిక పొదుపు పెరుగుతుందనీ, ఖర్చులు తగ్గుతాయనీ ప్రధాని ఈ సమావేశంలో ఉద్ఘాటించారు. దీనిద్వారా దేశంలో హిందూత్వ రాజ్యం ఏర్పాటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉద్దేశం. జమిలి ఎన్నికలపై సమగ్ర చర్చ అవసరమని చెబుతూనే ముఖ్యమంత్రులు కలిసి రావాలని నిర్దేశించే ప్రయత్నం చేయడం విడ్డూరం. జమిలి ఎన్నికల ప్రతిపాదన ఆచరణలోకొస్తే రాష్ట్ర అసెంబ్లీ కాలాన్నయినా తగ్గించాలి లేదా మెజార్టీ కోల్పోయిన రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించే అధికారాన్ని ఆ చట్ట సభలకు లేకుండా వాటి అధికారాలను కుదించాలి. ఇప్పుడు దేశంలో జరుగుతున్నది అదే. ఇది రాజ్యాంగ మౌలిక స్వభావానికి విరుద్ధం. అయినా బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికల పాట పాడటం రాజ్యాంగాన్ని తూలనాడటమే.
ప్రభుత్వాల విధానాల మూలంగా వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకున్నది. వ్యవసాయరంగం బాగు పడకుండా డబుల్ డిజిట్ వృద్ధి అసాధ్యం. ప్రస్తుతం వ్యవసాయంలో కార్పొరేట్ పెట్టుబడులు చాలా తక్కువగా ఉన్నాయని వాటిని పెంచేందుకు దోహదపడే విధానాలను రాష్ట్రాలు రూపొందించాలని చెప్పడమంటేనే వ్యవసాయరంగంలో పెట్టుబడులను ఉపసంహరించాలని చెప్పడమే. మోడీ ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకొని కార్పొరేట్లకు ఎర్రతివాచీ పరిచి తద్వారా రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామంటోంది. సంస్థాగత పరపతి అందుబాటులో లేక ప్రయివేటు అప్పులను ఆశ్రయించి రైతులు రుణగ్రస్తులవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత్యంతరం లేక కోట్లాదిమంది చిన్న, సన్నకారు రైతులు సాగును విడిచి పోతున్నారు. ఈ రంగంలోకి మరింతగా కార్పొరేట్లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) జొరబడితే భవిష్యత్తులో అసలైన రైతులు కనపడరు. వ్యవసాయానికి ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేసే ప్రతిపాదన కూడా గ్రామీణ పేదల ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడమే అవుతుంది. ఇప్పటికే ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే దిశగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. జీఎస్టీ, నోట్ల రద్దు, ఎఫ్డీఐలు ఆమాంబాపతు చర్యలన్నీ నిటిఆయోగ్ అమ్ములపొదిలో నుంచి ఊడిపడ్డవే. నిటిఆయోగ్ను అడ్డం పెట్టుకొని సరళీకరణ విధానాలకు కార్యాచరణను రూపొందిస్తోందీ మోడీ ప్రభుత్వం.
జీఎస్టీ తదితర నిర్ణయాలతో కేంద్రం తమ హక్కులను కాలరాస్తోందని పలు రాష్ట్రాల నుంచి నిరసనలు వ్యక్తమవుతుండగా ఫలితాల ఆధారంగా నిధుల కేటాయింపు లుంటాయని నిటిఆయోగ్ భేటీలో రాష్ట్రాలకు ఉద్భోదించి పుండు మీద కారం చల్లారు ప్రధాని. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ ఆదేశానుసారం ద్రవ్య నియంత్రణ, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) చట్టాలతో ద్రవ్యలోటుకు పరిమితులు విధించగా ఇంకా వ్యయ దిద్దుబాటుకు దిగి రావాలని పేర్కొనడమంటే రాష్ట్రాలను మరింతగా ఆర్థిక దిగ్బంధంలోకి నెట్టడమే. 15వ ఫైనాన్స్ కమిషన్ విధివిధానాల్లో పేర్కొన్న కొన్ని ప్రమాదకరమైన నిబంధనలు మార్చాలని ఆయా రాష్ట్రాలు డిమాండ్ చేస్తుండగా వ్యయ దిద్దుబాటుకు ఆర్థిక సంఘానికి ఆలోచనలు జోడించాలనడం సమాఖ్య స్ఫూర్తికి భంగకరం. రాష్ట్రాల అభిప్రాయాలను బుట్టదాఖలు చేసి ముఖ్యమంత్రులే సహకార, పోటీతత్వ, సమాఖ్య దేశ నిర్మాణానికి టీమిండియా మాదిరి పని చేయమనడం, విధానాల రూపకల్పనలో సీఎంలు క్రియాశీలకంగా వ్యవహరించాలనడం కేంద్రం ఏకపక్ష ధోరణికి తార్కాణం. 2022 నాటికి సరికొత్త భారతావనిని తీర్చి దిద్దేందుకు కొన్ని 'చర్యలు' అవసరమని చెప్పడం వెనుక కార్పొరేట్ల దోపిడీకి ఊతమివ్వడమే. ఇలాంటి వాటితో ఆర్థిక అసమానతలను తగ్గిస్తామనడం, మానవాభివృద్ధి ప్రామాణికాలను మెరుగు పరుస్తామనడం పచ్చి మోసం.