Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ నిర్వాకంతో కాశ్మీర్ ప్రజల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్టు తయారైంది. ఒక వ్యూహం ప్రకారం మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీకి మద్దతు ఉపసంహరించిన బీజేపీ, ఆ రాష్ట్ర ప్రజానీకంపై కేంద్ర పాలనను రుద్దింది. ప్రజాభీష్టానికి భిన్నంగా కాశ్మీర్పై పెత్తనం సాగించడానికి తెగబడింది. అయితే, ఇదేమీ అనూహ్య పరిణామం కాదు. నిజానికి ఎన్నికల అనంతరం అధికారమే లక్ష్యంగా బీజేపీ-పీడీపీ కుదుర్చుకున్న అనైతిక పొత్తే అకాల విచ్ఛిన్నానికీ బీజం వేసింది. పరస్పర భిన్న ధ్రువాలైన ఈ రెండు పార్టీలూ కలిసిన తీరుపైనే అప్పట్లో రాజకీయ పరిశీలకులు పెదవి విరిచారు. సందేహాలూ వ్యక్తమైనాయి. తాజా పరిణామం ఆ అనుమానాలనే నిజం చేసింది. పీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకూంటూ బీజేపీ తీసుకున్న నిర్ణయం పట్ల కాశ్మీర్ మీడియా ఏ మాత్రమూ ఆశ్చర్యం వ్యక్తం చేయక పోవడం గమనార్హం. ఎప్పటి నుండో అనుకుంటున్న సంఘటన జరిగినట్టుగానే అక్కడి పత్రికలు కథనాలను ప్రచురించాయి. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మే 20వ తేదీన కాశ్మీర్లో జరిపిన పర్యటనే ఈ విచ్ఛిత్తికి బీజం వేసిందంటూ ప్రచురితమైన వార్తలూ బీజేపీ ఒక పథకం ప్రకారం చేసిన కుట్రను బహిర్గతం చేస్తున్నాయి. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను సాకుగా చూపడం కేవలం తన చర్యను సమర్థించుకోవడానికి వేసుకున్న ముసుగు మాత్రమే!
నిజానికి భారతీయ జనతాపార్టీకి గానీ, దానిని వెనుక నుండి నడిపించే సంఫ్ు పరివారానికి గానీ కాశ్మీర్ సమస్య పరిష్కారం పట్ల ఏనాడూ చిత్తశుద్ధిగానీ అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న అమానవీయ పరిస్థితుల పట్ల సానుభూతి గానీ లేదు. దేశం మొత్తం మీద 'హిందూత్వ' ప్రచారానికి కాశ్మీర్ సమస్యను ఉపయోగించుకోవడమే బీజేపీ ప్రధాన లక్ష్యం. తాను అధికారంలో లేని కాలంలో కాశ్మీరీ పండిట్ల సమస్యను అడ్డం పెట్టుకుని, హిందూ-ముస్లిం విద్వేషాన్ని రగిల్చింది. అక్కడ అధికారంలో భాగం పంచుకున్నాక 'ఉగ్రవాదం' సమస్యను వాడుకుంటోంది. అందుకే సంకీర్ణ కూటమిలో భాగస్వామిగా అధికారంలో కొనసాగినప్పటికీ సమస్యను పరిష్కరించడానికి ఏ మాత్రమూ చొరవ చూపకపోగా మరింత ఆజ్యం పోసింది. కాశ్మీర్ ప్రజల విశ్వాసాన్ని పొందడానికి బదులుగా వారందరినీ ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. సైన్యానికి సర్వాధికారాలు దఖలు పరిచి వినోదం చూసింది. స్థానిక ప్రజలను మానవ కవచాలుగా చేసుకుని కవాతు చేసినా మోడీ సర్కారు నుంచి తీవ్ర స్పందన కనపడక పోవడం యాధృచ్ఛికమేమీ కాదు. పెచ్చరిల్లిన హింస, నిర్బంధకాండపై స్థానికులు ఆగ్రహిస్తే ఉగ్రవాదానికి ఊతమిస్తున్నారంటూ గగ్గోలు పెట్టింది. సమస్యను పరిష్కరించే తీరు ఇది కాదని ప్రతిపక్షాలు, మానవ హక్కుల సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు చేసిన హెచ్చరికలను బేఖాతరు చేసింది. కాశ్మీరాన్ని కల్లోల సీమగా మార్చి వేసింది.
అధికారిక సమచారం ప్రకారం పీడీపీ - బీజేపీ కూటమి అధికారం చేపట్టిన 2015 నుంచి ఇప్పటి వరకూ కాశ్మీర్లోయలో 36 మంది ఉగ్రవాదులు, 14 మంది భద్రతా సిబ్బంది, 17 మంది సాధారణ పౌరులు మరణించారు. 107 రాళ్ల దాడుల సంఘటనలు జరిగాయి. వందలాదిమంది గాయాలపాలయ్యారు. ఈ లెక్కలు చాలు.. కాశ్మీర్ లోయలో జరుగుతున్న మారణహోమాన్ని అర్థం చేసుకోవడానికి! ఈ అమానవీయ పరిస్థితులను ప్రపంచానికి వెల్లడి చేసినందుకే సీనియర్ పాత్రికేయుడు బుఖారీ అమానుషంగా హత్యకు గురయ్యాడు. నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ పరిస్థితులను మార్చడానికి కృషి చేయాలి. కానీ కాల్పుల విరమణను ఆ విషాద సంఘటనకు కారణంగా చూపి, దానిని ఏకపక్షంగా ఎత్తివేసి క్రూర రాజకీయ క్రీడకు తెర తీసింది. సహజంగానే దీనిని జీర్ణించుకోలేని పీడీపీ విమర్శలకు దిగడం, దానిని సాకుగా చూపి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడం, ప్రభుత్వాన్ని కూల్చడం చకచకా సాగిపోయాయి. గవర్నర్ పాలన కాశ్మీర్కు కొత్తకాదు. కానీ కేంద్రం కనుసన్నల్లో సాగే ఈ పాలనలో పౌరుల హక్కులకు ఏ గతి పట్టనుందో అర్థమవుతూనే ఉంది.
2017 సెప్టెంబర్లో అఖిలపక్షబృందం కాశ్మీర్లో పర్యటించినప్పుడు కేంద్ర హోంమంత్రి రాజనాథ్సింగ్ లోయలోని అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చలను ప్రారంభిస్తామని, రాజకీయ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి ప్రజల నమ్మకాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ, ఆ దిశలో ఒక్కటంటే ఒక్క చర్యకూడా ఇంతవరకు తీసుకోని కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో పరాయీకరణ భావాన్ని మాత్రం గణనీయంగా పెంచింది. ఇదే ధోరణి కొనసాగిస్తే భవిష్యత్లో చోటుచేసుకునే పరిణామాలకూ మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఇంతటి కీలక పరిణామం జరుగుతున్నప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోవటం గమనార్హం. జాతీయ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషిస్తానని చెబుతూ, ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్న నేతలు దేశం మీద తీవ్ర ప్రభావం కలుగజేసే సున్నితమైన కాశ్మీర్ సమస్యమీద కనీసం స్పందించకపోవడం విస్మయం కలిగిస్తోంది.