Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికాకు వలస వచ్చినవారి కుటుంబాలకు చెందిన పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేసి నిర్బంధించే విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇది 'పిల్లలపట్ల అమానుషం'గా ప్రవర్తించటమేనని అమెరికా అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకటించింది. ఇది పిల్లలను 'క్రూరంగా హింసించటం తప్ప మరొకటి కాదు' అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఈ చర్య 'నీతి బాహ్యమైన మానవ హక్కుల ఉల్లంఘన' అని ఐక్యరాజ్యసమితి నిందించింది.
అమెరికా చరిత్రలో ఇటువంటి సంఘటనలు కొల్లలు. 1830వ సంవత్సరం నుంచి 20ఏండ్ల పాటు మూలవాసులైన స్థానిక తెగలకు చెందిన లక్షలాది ప్రజలను (వేలాదిగా చనిపోతున్నా) వారి నివాస ప్రాంతాల నుంచి తరలించటం, తిరగబడిన బానిసలను జైళ్ళలో కుక్కటం, మొదటి ప్రపంచ యుద్ధం తరువాత రాడికల్స్గా అనుమానించినవారిని దేశం నుంచి వెళ్ళగొట్టటం, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపనీయులు అమెరికన్లను నిర్బంధించటం వంటి కిరాతక సంఘటనలు అమెరికా చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అయితే పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరు చేయటమనే హేయమైన, నీతిమాలిన ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని వర్ణించటం దుస్సాధ్యం. ఏ దేశ నాయకులైతే ప్రజాస్వామ్య వ్యవస్థ ఔన్నత్యం గురించి, మానవ హక్కులను గౌరవించటం గురించి నిత్యం ఊదరగొడుతుంటారో అటువంటి దేశంలో ఇటువంటి కిరాతక చర్య 21వ శతాబ్దంలో జరుగుతున్నది.
అమెరికా అంతటా వేలకు వేలమంది పిల్లలను జంతువులను బంధించినట్టు పంజరాలలో బంధించారు. చాలామంది పిల్లలకు తెలియదు వారి తల్లిదండ్రులు ఎక్కడున్నారో. తల్లిదండ్రులతో పిల్లలను మాట్లాడనివ్వటం లేదు. ఇప్పటికే నిర్బంధించబడిన పిల్లలకు అదనంగా రోజూ వందల మంది పిల్లలను పట్టుకునివచ్చి నిర్బంధిస్తున్నారు. అమెరికాలోని అనేక ప్రాంతాలలో నిర్బంధ క్యాంపుల నగరాలు వెలుస్తున్నాయి. ఇలా నిర్బంధించబడుతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో భరించలేని వేడి వుండే ఎడారి ప్రాంతాలలో వీరిని ఉంచుతున్నారు. కిక్కిరిసిన జైళ్లు పిల్లల రోదనలతో మారుమోగుతున్నాయి. జైళ్ళలో పిల్లలపై భౌతిక, లైంగిక దాడులు జరుగుతున్నాయి. కుటుంబాల నుంచి పిల్లలను వేరుచేయటం నాజీ నిర్బంధ క్యాంపులను తలపిస్తున్నది. అమెరికా చరిత్రలో ఇది ఒక ఘోరమైన సంఘటనగా మిగిలిపోతుంది.
ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి, మానవ హక్కులకు అమెరికా ప్రతీక అనే వాదన దీనితో ఎందుకూ కొరగాకుండా పోతుంది. ఇటువంటి వాదనలతోనే ప్రపంచంలో అనేక ప్రాంతాలలో అమెరికా సైనికంగా జోక్యం చేసుకుంటూ లక్షలాది ప్రజల మరణానికి కారకమౌతున్నది. అనేక మిలియన్ల ప్రజలు ప్రాణభీతితో తమతమ దేశాలను విడిచి పారిపోవటానికి ప్రయత్నిస్తున్నారు. 1970వ, 80వ దశాబ్దాలలో సెంట్రల్ అమెరికా దేశాలను అమెరికా దన్నుతో పరిపాలించిన నియంతలు వేలకువేల ప్రజలను హత్యలు చేశారు. ఇప్పటికీ ఆ దేశాలు శిథిలావస్థలోనే ఉన్నాయి. 1950వ దశాబ్దంలో కొరియాలో 30లక్షలమందిని, 1960వ, 70వ దశాబ్దాలలో వియత్నాం, కంబోడియా, లావోస్ దేశాలలో 30లక్షలమంది అమాయక ప్రజలను అమెరికా హతమార్చింది. ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా ప్రాంతాలలో అమెరికా సామ్రాజ్యవాదం చేత లక్షలాది మంది ప్రజల హననం నేడుకూడా కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుతం ఈ యుద్ధాలలో సమిధలుగా మారినవారి పిల్లలను వారి మాజీ దురాక్రమణదారులు జైళ్ళలో కుక్కుతున్నారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన ఒక సమావేశంలో వలస వచ్చిన తల్లిదండ్రులను 'పిల్లల స్మగ్లర్లు' అని ట్రంప్ నిందించాడు. అంతేకాకుండా వలసవచ్చినవారిని న్యాయస్థానాలలో విచారించవలసిన అవసరం లేకుండా చేయాలని మొట్టమొదటగా ఆయన అదే ఉపన్యాసంలో పేర్కొన్నాడు. 'మాకు సరిహద్దుల్లో భద్రత కావాలి. న్యాయమూర్తులు కాదు. మాకు వలస వచ్చేవారి అవసరం లేదు' అని ఆయన అన్నాడు. ట్రంప్ ఇటువంటి ప్రకటనలు చేస్తున్నాడంటే ఇప్పటికే వలసవచ్చిన ప్రజల హక్కులపై దాడులు చేయటానికి కావలసిన పథక రచన జరిగే ఉంటుంది. ప్రతిపక్ష స్థానంలోవున్న డెమోక్రటిక్ పార్టీ కూడా పరోక్షంగా వలసవచ్చిన వారిని వెనక్కు పంపాలనే విధానాన్ని అనుసరించటం ఆ పార్టీ దివాళాకోరు రాజకీయాలకు ప్రతిబింబిస్తున్నది. వలస వచ్చిన వారిని నిర్బంధించటం, ప్రాణాపాయం ఉంటుందని తెలిసికూడా బలవంతంగా వారివారి దేశాలకు పంపటం వంటి చర్యలను బిల్ క్లింటన్, ఒబామాల పాలనలో తీసుకోవటం జరిగింది. ఒక్క ఒబామా కాలంలోనే అమెరికాకు వలసవచ్చిన 27లక్షలమందిని నిర్బంధించి, బలవంతంగా వారివారి దేశాలకు పంపటం జరిగింది. అదేకాలంలో జైళ్ళ, అనేక రకాల నిర్బంధ కేంద్రాల సమాహారాన్ని నిర్మించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హౌమ్లాండ్ సెక్యూరిటీ అధినేతగా జాన్ కెల్లీ డెమోక్రాట్లమద్దతుతోనే నియమించబడ్డాడు. తల్లిదండ్రులనుంచి పిల్లలను వేరుచేసే విధానాన్ని ప్రవేశపెట్టింది ఇతనే. ఈవిధంగా అమెరికా రాజకీయ వ్యవస్థ పూర్తిగా కుళ్ళిపోయి వుంది. అమెరికా విధానాల ఫలితంగా బతకటమే కష్టమైన పరిస్థితుల నుంచి బతుకుతెరువుకోసం అమెరికా వలసవచ్చిన అశేష ప్రజల హక్కుల పరిరక్షణకోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక శక్తులను సమీకరించటం అవసరం. పెట్టుబడిదారీ వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం కారణంగా జరుగుతున్న ఈ దాడిని ఎదుర్కోవటానికి అదే వ్యవస్థపై కార్మికవర్గం నాయకత్వంలో ఉద్యమించటమే ఏకైక మార్గం.