Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ద్వేషం ఆరోగ్యానికి హానికరం మనిషికయినా, సమాజానికయినా. ద్వేషింపబడే వారే కాదు ద్వేషించేవారు సైతం శాంతంగా ఉండలేరు. ప్రశాంతంగా జీవించలేరు. ఎదుటివాళ్ళని నొప్పిస్తున్నామన్న భ్రమలో తాము కూడా నొప్పికి లోను కావడం ద్వేషగుణంలో ఇమిడి వుంది. కారణం లేకుండానే కొందరు అసూయాద్వేషాల్ని పెంచుకుంటారు. తమకు ఏం కావాలో తమకే తెలియక ఎదుటివారి స్థితిని చూసి అసూయ చెందడం కొందరి నైజం. ఇది తొలుత అసూయగా మొదలయి తర్వాత ద్వేషంగా పరిణమిస్తుంది. వ్యక్తులకు ఉండే అకారణ అసూయాద్వేషాలు ఎదుటివారిని ఇబ్బందికి లోను చేస్తాయి. కొన్నిసార్లు పట్టించుకోవద్దని అనుకున్నా, ఎప్పుడో ఒకసారి నొప్పికి లోనవుతారు. కాలక్రమాన అనవసర ద్వేషాల్ని పట్టించుకోని మూర్తిమత్వంతో ముందుకు సాగుతారు. ఇది ఆయా మనుషుల పురోగతికి అవసరమైన సుగుణం.
అసూయాద్వేషాలని పట్టించుకోని స్థితి సహేతుక దృష్టికోణం ద్వారా మాత్రమే సాధ్యం. వ్యక్తులుగా ఈర్ష్యాసూయల్ని అధిగమించడానికి ఇది తప్పనిసరి. కానీ సమాజంలో పాతుకుపోయిన విద్వేషభావాల్ని పరిహరించడం అంత సులువు కాదు. అన్యాయాల్ని ప్రశ్నించే వారిని సైతం నిందాపూర్వకదృష్టితో నిలదీసే ధోరణి సమాజ పురోగతికి ఆటంకం. మతం కేంద్రంగా ఆడుతున్న రాజకీయ క్రీడలో మనుషులు విద్వేషభావాల చిక్కుముళ్ళలో చిక్కువడుతున్నారు. మధ్యతరగతికి చెందిన చాలామంది విద్వేష ప్రచారాల ప్రభావంలో పడి హేతుదృష్టిని కోల్పోవడం అతి పెద్ద సామాజిక సంక్షోభం.
మైనారిటీల మీద, దళితుల మీద వ్యక్తమయ్యే అభిప్రాయాల్లో విద్వేష భావాల ప్రభావమే అధికం. అసిఫా మీద పాశవిక దాడిని ఖండిస్తూ కవులు, రచయితలు, మేధావులే కాదు మామూలు మనుషులు సైతం స్పందించారు. వారి స్పందనని కూడా మతం దృష్టితో చూసినవారు లేకపోలేదు. ఒక పసిపాప మీద జరిగిన ఘోర దురంతాన్ని నిరసించడం మనుషులందరి బాధ్యత. ఇలాంటి ఉదంతాలు ఇతర చోట్ల జరిగినప్పుడు కూడా సమాజం స్పందిస్తూనే ఉంది. కానీ అప్పుడు స్పందించిన వారు ఇప్పుడు మాట్లాడరేమిటని మతఛాందసవాదులు ప్రశ్నించడం చూస్తున్నాం. మైనారిటీలు కాబట్టే నోరు విప్పారన్న వాచలతని ప్రదర్శిస్తున్నారు.
ఒక అన్యాయాన్ని, దుర్మార్గాన్ని, అమానుష కృత్యాన్ని నిరసించేప్పుడు బాధితులు ఎవరు, ఏ మతానికి చెందినవారని లెక్కలు వేసుకోరు. కానీ లెక్కలు వేస్తూ వక్రబుద్ధితో కూడిన రాతలు రాసే ధోరణి సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం. వాస్తవాలు తెలియకుండానే, తెలుసుకోకుండానే ఇంకొందరు మతదృష్టితో గందరగోళం సృష్టిస్తున్నారు. ఇటీవల కాశ్మీర్లో యాసిన్ మాలిక్ని అరెస్టు చేసినపుడు కూడా ఇదేవిధమైన దుర్మార్గపు ప్రచారానికి ఒడిగట్టారు. మాలిక్ని ఒక రాక్షసుడిగా చిత్రించే దుష్ప్రచారానికి పూనుకున్నారు. మతం పేరుతో జరిగే విద్వేషక్రీడలో వాస్తవాలు మరుగున పడటం, నిజాలకి మసిపూసి అబద్ధాల్ని ఊరేగించడం వర్తమాన వైచిత్రి.
వ్యక్తుల్లో అసూయాద్వేషాలు ఆయా వ్యక్తుల సంస్కారానికి సంబంధించినవి. కానీ సమాజంలో విద్వేషభావాల వ్యాప్తి హేతుదృష్టిని, స్వతంత్ర ఆలోచనని హరించే కుట్రపూరిత పన్నాగం. మనలోనే మన పక్కనే వుండి ద్వేషభావాల్ని ప్రచారం చేసే ప్రక్రియ సామాజిక మాధ్యమాల్లో వేగంగా సాగుతున్నది. ఒక నిజాన్ని కప్పి పుచ్చడానికి వంద అబద్ధాల్ని అందంగా ప్యాక్ చేసి ప్రచారంలో పెట్టడం విద్వేష రాజకీయాల మంత్రాంగంలో భాగమైంది. తాము నమ్మే నిజాలు సైతం అబద్ధాలేమో అనే అనుమానానికి లోను చేసే ఛాందసవాదం ఎక్కువగా చెలామణీలో వుంది. తమ అసహనంతో, విద్వేషభావాలతో ఆలోచనాపరులయిన వారిని సైతం గందరగోళంలో పడేసే చాణక్యం వర్తమాన భారతంలో పెచ్చరిల్లింది. తామే హింసాప్రవృత్తితో, విద్వేషపూరిత నైజంతో మనుషుల మీద దాడి చేసే శక్తులే మతం గురించీ, భక్తి గురించీ ప్రవచిస్తున్నాయి.
మతం వ్యక్తిగతం. మతాన్ని, దైవాన్ని నమ్మని వారు కూడా వ్యక్తుల మతస్వేచ్ఛని అడ్డుకోలేదు. లౌకికశక్తులు బలంగా ఉన్న కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ప్రజలు తమ మతాల్ని తాము ఆచరిస్తున్నారు. తమకు నచ్చిన దైవాన్ని ఆరాధిస్తున్నారు. కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న రోజుల్లోనూ దుర్గామాత ఉత్సవాలు బెంగాల్లోనూ ఘనంగా జరిగాయి. అక్కడ ప్రభుత్వం ప్రజల నమ్మకాల్ని ప్రశ్నించలేదు. మతం వ్యక్తిగత పరిధిలో ఉన్నంతవరకు దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ మతాన్ని పాచికగా చేసుకొని ఉన్మాదాన్ని రెచ్చగొట్టే కుటిలయత్నాల్ని ప్రశ్నించడం అనివార్యమైనప్పుడే లౌకికవిలువల ప్రస్తావన ముందుకొచ్చింది. లౌకిక భావాల వ్యాప్తి బలపడాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మత ప్రాతిపదికన విద్వేషభావాల్ని రెచ్చగొట్టే శక్తుల్ని ప్రతిఘటించడం తప్పనిసరయింది. ద్వేషగుణం సమాజానికి ఎంతటి ప్రమాదకరమో ప్రశ్నించక తప్పని అనివార్యత నెలకొన్నది. ఇవాళ ఈ ప్రశ్నల్ని మరింత సూటిగా, పదునుగా సంధిస్తూ హేతుదృష్టిని ప్రోది చేయడం ఆలోచనాపరుల కర్తవ్యం.