Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవినీతీ కుంభకోణాలకూ తమ పాలనలో చోటే వుండదని, అదే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ నాలుగేండ్ల క్రితం అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం మోడీ చిలక పలుకులు పలికారు. తమది పారదర్శకతతో కూడిన ప్రభుత్వమని గొప్పలు పోయారు. కానీ ఈ ప్రభుత్వంలో అవినీతి మరింత వ్యవస్థీకృతమైంది. సాక్షాత్తూ ప్రధానే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ అవినీతీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా మోడీ నోరెత్తడం లేదు. బీజేపీ అధ్యక్షుడు అమిత్షా కుమారుడి కంపెనీ కుంభకోణం ఉదంతం బయటపడినా దానిపైనా విచారణకు సిద్ధపడలేదు. మరోవైపు ఒక్కొక్క ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసే దోపిడీదారులకూ, బ్యాంకులను లూటీ చేసేవారికీ మోడీ ప్రభుత్వం వత్తాసు పలుకుతూ అవినీతిని ప్రశ్నిస్తున్న వారి నోరు నొక్కుతోంది. కాషాయ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో అవినీతి అంతకంతకూ పెరిగిపోతోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో అవినీతి భాగోతం వింటే ''కుంభకోణానికి కాదేదీ అనర్హం'' అన్నట్టు అక్కడ నేతలు దేనినీ వదల్లేదు. వ్యాపం మొదలు ఉల్లిగడ్డలు, డీజిల్, మొక్కలు, ఈ టెండర్, గిరిజనుల పాదరక్షల సరఫరా వరకూ ఒకటేమిటీ అనేక వేల కోట్ల రూపాయల కుంభకోణాలు వెలుగుచూశాయి. నోరు తెరిస్తే సచ్ఛీలతపై సందేశాలిచ్చే కమలం నేతలు వీటిలో దేనిపైనా విచారణకు సిద్ధపడకపోవడం వీరి అసలు రంగుకు అద్దంపడుతోంది.
ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ రాష్ట్రంలో ఆశీర్వాద్ యాత్ర మొదలుపెట్టారు. ఈ సమయంలోనే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడం గమనార్హం. మూడు వేల కోట్ల విలువైన ఈ టెండర్, గిరిజనులకు బూట్లు, పాదరక్షల సరఫరా వంటివి ప్రధానమైనవి. అంతకుముందు వైద్య విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి రూ. 630 కోట్ల వ్యాపం కుంభకోణం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2016 నవంబర్లో పెద్దనోట్ల రద్దులో భారీ కుంభకోణం జరిగినట్టు వార్తలు వచ్చినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. ప్రస్తుతం శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ గిరిజనులకు బూట్లు, చెప్పులు కానుకగా ఇస్తామని ఆశచూపింది. పార్టీపరంగా ఇస్తూ ప్రభుత్వ ధనాన్ని వినియోగించిందన్న ఆరోపణలున్నాయి. వాటిని మంత్రులు ఖండించినా అవన్నీ వాస్తవం బయటకు రాకుండా కప్పిపుచ్చుకోవడానికే... సీఎం ఆశీర్వాద్ యాత్రల్లోనే వీటిని పంపిణీ చేసారని సమాచారం. రాష్ట్ర జనాభాలో గిరిజనులు 21శాతం మంది ఉన్నారు. ధర్, జబువా, మాండ్లా వంటి జిల్లాల్లో 50 శాతం మంది వున్నారు. పాదుక పథకం కింద 10లక్షల మంది టెండు ఆకు సేకరణదారులకు పాదరక్షలు సరఫరా చేయాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటివరకు 8.13లక్షల మందికి అందించినట్టు మంత్రులు తెలపడం ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడడమే. ఇదొక పెద్ద కుంభకోణంగా ప్రతిపక్షాలు బలమైన ఆరోపణలు చేస్తున్నాయి. మరోసారి తమకే ఓటు వేయాలని కోరుతూ కోటిమంది మహిళలకు బీజేపీ నేతలు లేఖలు రాశారు. లేఖల ముద్రణకు, బట్వాడాకు కూడా ప్రభుత్వ నిధులు, యంత్రాంగాన్ని ఉపయోగించినట్టు ఆరోపణలున్నాయి.
మధ్యప్రదేశ్ జల్నిగమ్ లిమిటెడ్, రాజ్గఢ్, సత్నా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా కోసం ఈ టెండర్లను ఆహ్వానిస్తే అందులోనూ పెద్దఎత్తున గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు కోడై కూశాయి. అనుకూల కంపెనీలకే గ్రామీణ నీటి సరఫరా టెండర్లు దక్కేలా ట్యాంపరింగ్ జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. హైదరాబాద్, ముంబయిలకు చెందిన కంపెనీలకు టెండర్లు దక్కడంపై అనుమానంతో ఒక అధికారి ట్యాంపరింగ్ జరిగినట్టు గుర్తించారు. ఈ స్కామ్ విలువ మూడు వేల కోట్లు ఉండడంతో అధికారులు నోరెళ్లబెట్టాల్సి వచ్చింది. దర్యాప్తు బాధ్యత ఆర్థికనేరాల విభాగానికి అప్పగించినా ఈ కుంభకోణాన్ని బయటకు తీసిన అధికారిని మాత్రం బీజేపీ నేతలు వేరేచోటుకు బదిలీ చేయించడం దారుణం. సీబీఐ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు కోరినా కేంద్రం చేతులెత్తేసింది. ఇదేవిధంగా ఎన్నికలు జరగబోతున్న రాజస్థాన్లో గనులు, ఛత్తీస్ఘడ్లో పీడీఎస్ కుంభకోణాలు వెలుగుచూశాయి. అయితే వీటన్నిటినీ కావాలని పనిగట్టుకుని ప్రతిపక్షాలు చేసే ఆరోపణలుగా బీజేపీ ప్రభుత్వం కొట్టిపారేయడం తప్ప విచారణలకు సిద్ధపడకపోవడమే వీరి బండారాన్ని బయటపెడుతోంది. తన ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలను కేంద్రంలో ప్రధానే పట్టించుకోనప్పుడు, ఆ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుంటాయనుకోవడం అత్యాశే అవుతుంది. చివరికి రుజవయ్యిందేమిటంటే బీజేపీ సచ్ఛీలత కేవలం మాటల్లోనే... చేతల్లో పీకలదాకా అవినీతి ఊబిలో కూరుకుపోయింది.