Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ద్విచక్రవాహనం మీద ముగ్గురు ప్రయాణించినా, హెల్మెట్ ధరించకున్నా జరిమానాలు వేసే ట్రాఫిక్ సిబ్బంది.. పరిమితికి మించి బస్సులో వందమందిపైగా ప్రయాణిస్తున్నా సంబంధింత వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు'' ఇది కొండగట్టులో ఘోరప్రమాదం అనంతరం సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల నుండి వచ్చిన ప్రశ్న. మంగళవారం జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ఘోర ప్రమాదం మాటలకందనిది. నిమిషాల వ్యవధిలో 57మంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఆప్తులను కోల్పోయిన సమాచారాన్ని ఆకస్మికంగా, అనూహ్యంగా అందుకున్న కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తల్లులను కోల్పోయిన బిడ్డలు, బిడ్డలను కోల్పోయిన తల్లులు, జీవిత భాగస్వాములను కోల్పోయి జీవచ్ఛవాలుగా మారిన వారు ఎందరో. వీరి కన్నీళ్లను కొలవడానికి కొలబద్దేముంది? ఏ మాటలు, సాయం వీరికి ఓదార్పునిస్తాయి? కండ్ల ముందు బస్సు కనిపించినప్పుడల్లా శాశ్వతంగా కనుమరుగైన తమ సన్నిహితులు గుర్తుకు వస్తుంటే ఆ క్షోభను జీవితాంతం భరించాల్సిరావడం ఎంతటి భయానకం! ఇంతమంది జీవితాలు ఒక్కసారిగా ఛిద్రం చేసిందెవరు? ఆర్టీసీ చరిత్రలోనే ఈ స్థాయి ప్రమాదం జరగడానికి బాధ్యులెవరు? మరో బస్సు వస్తుందో రాదోనన్న ఆందోళనతో ఎక్కిన ప్రయాణీకులదా? ప్రతిరోజూ తీసుకెళ్లినట్టుగానే సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకెళ్తానని ఎక్కించుకున్న డ్రైవర్దా? రద్దీ సమయాల్లో బస్సులను అందుబాటులో ఉంచని ప్రభుత్వానిదా?
కొండగట్టు ఘాట్ రోడ్డు ఇప్పటికిప్పుడు ప్రమాదకరంగా మారింది కాదు. ఆ రోడ్డుపై తీవ్ర ప్రమాదాలు జరిగిన చరిత్ర గతంలోనూ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే అప్పటి కలెక్టర్ ఆ రోడ్డుపై రాకపోకలు పూర్తిగా నిషేధించారు. ఆ రోడ్డు ఎంత ప్రమాదకరమో, రాకపోకలను ఎందుకు నిషేధించాల్సి వచ్చిందో, రోడ్డును ఎలా నిర్మిస్తే బాగుంటుందో వివరిస్తూ ప్రభుత్వానికి సవివరమైన నివేదికనూ సమర్పించారు. ఆ నివేదిక ప్రస్తుతం ఎక్కడ మూలుగుతుందో ఏలినవారే సెలవియ్యాలి. ప్రమాదానికి రెండు మూడు రోజులు ముందు ఆ దారిలో భారీ వాహనాలను నడపొద్దని స్థానికులు చేసిన విజ్ఞప్తిని అధికార యంత్రాంగం పట్టించుకోలేదంటే ఏమనాలి? నిషేధం ఇప్పటికీ అమలులో ఉండివుంటే భారీ వాహనాలకు అనుమతి లేదన్న బోర్డులు ఏమయ్యాయి? నిషేధం లేదనుకుంటే ఆ రోడ్డు నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఘాట్ల నిబంధనల ప్రకారం ఆ రోడ్డు ఉందా? స్పీడ్ బ్రేకర్ను గుర్తించడానికి వీలుగా రంగులు వేసి ఉండాలని, వాహనం నిదానంగా వెళ్లడానికి వీలుగా ఏటవాలుగా ఉండాలని సర్కారీ మాన్యువల్లో ఉంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో చెబితే కాని గుర్తించలేని విధంగా స్పీడ్బ్రేకర్ ఉంది. మూల మలుపుల వద్ద ప్రమాద హెచ్చరికలను సూచిస్తూ బోర్డులు పెట్టారా అంటే అదీ లేదు. గతంలో భారీ ప్రమాదాలు జరిగినా అటువంటి బోర్డులు ఏర్పాటు చేయాలన్న ఆలోచన రాలేదంటే ప్రజల ప్రాణాలను ప్రభుత్వం పూచిక పుల్లతో సమానంగా భావించడమే. ఈ కనీస చర్యలను కూడా తీసుకోలేని పాలకులు అట్టహాసంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించడం, ప్రమాదాలన్నింటికీ డ్రైవర్లనే బాధ్యులుగా చేస్తూ మోటారు వాహనాల చట్టాన్ని సవరించడానికి ప్రయత్నాలు చేయడంలో అర్థమేమిటి? ఆ చట్టంలోని లొసుగులను ఎత్తి చూపే కార్మిక సంఘాలపై ఒంటికాలిపై లేవడం షరా మామూలే. ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన ప్రమాదానికి డ్రైవరే కారణమంటూ ఎత్తిచూపడం హేయమైనది. ఓ మంత్రి కోసం రాత్రికిరాత్రే రోడ్డేసిన అధికారులు, బస్సు ప్రమాదం జరిగిన చోట రోడ్డు ఎంత అధ్యాన్నంగా ఉందన్న విషయాన్ని గుర్తించకపోవడం దారుణం.
కొండగట్టు ప్రమాదం జరిగిన బస్సు 20 లక్షల కిలోమీటర్లు తిరిగింది. ఆర్టీసీ పరిభాషలో చెప్పాలంటే అది తుక్కు కిందే లెక్క. కొంచెం, అటు ఇటూ లెక్కలు తేడా ఉన్నా బస్సు పరిస్థితిలో పెద్దగా మార్పు రాదు. పాత ఇనుప సామాన్లపక్కన ఉండాల్సిన తుక్కు రోడ్డు మీదకు ఎలా వచ్చింది? ఆరు నూరైనా ఆదాయాన్ని పెంచి తీరాలన్న సర్కారీ విధానాల్లో భాగంగానే కదా! చాలీ చాలని సిబ్బంది, ఓవర్ డ్యూటీల భారం చెబుతున్నదేమిటి? జూన్ నెలలో జరిగిన వేజ్ రివిజన్ సమావేశంలో ఆదాయం పెంచకుంటే అధోగతే అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించిన విషయం నిజం కాదా? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? ఇంతటి భారీ ప్రమాదానికి డిపో మేనేజర్ కారణమంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది. డిపోను అధిక ఆదాయంలో నింపినందుకు గతంలో ఆయన్ను ముఖ్యమంత్రి అభినందించారు. నిజానికి ఆయన్ను తక్షణమే అరెస్ట్ చేసి, ప్రాసిక్యూట్ చేయాలి.
పల్లెవెలుగు బస్సు సామర్థ్యం 51 మంది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవరు, కండక్టర్తో కలిపి 105 మంది ఉన్నారు. అందుబాటులో చాలినన్ని బస్సులు ఉంటే ఈ కిక్కిరిసిన ప్రయాణాలు దేనికి? గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడపడం ఆర్థికంగా లాభదాయకం కాదన్న సాకుతో వాటి సంఖ్యను తగ్గించుకుంటూ వస్తున్నది నిజం కాదా? ప్రజా సేవా రంగంలో అత్యంత కీలకమైన ఆర్టీసీని లాభాలు సంపాదించే వ్యవస్థలా చూస్తున్న ప్రభుత్వ విధానాలు కారణం కావా? నయా ఉదారవాద ఆర్థిక విధానాల్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బతీసి, వాటి మనుగడను నాశనం చేసే ప్రభుత్వ వ్యూహాల్లో భాగమే ఈ జన విధ్వంసం! ఇవి కచ్చితంగా సర్కారీ హత్యలే! ప్రజలను పీల్చి, ప్రాణాలను తోడేసే ఆ విధానాలను తిప్పికొడితేనే సామాన్యులకు మనుగడ!