Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'స్వచ్ఛతే సేవ' అంటూ ప్రధాని మోడీ కొత్తపాట ఎత్తుకుంటుండగానే, దేశం వెలుపల విజరుమాల్యా బీజేపీ అవినీతి గీతం ఆలపిస్తున్నారు. బుధవారం లండన్లో ఈ లిక్కర్ కింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాను ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీని కలిశాకే దేశాన్ని వీడాననీ, ఆయనతో అన్ని అంశాలు వివరంగా చర్చించాననీ, ఇది నిజమని మాల్యా చెబుతుండటం బీజేపీ పాలనలోని చీకటి కోణాలను ఎత్తిచూపుతోంది. బ్యాంకు రుణాల ఎగవేత, మోసం, మనీలాండరింగ్లలో నిందితుడైన మాల్యాను తిరిగి అప్పగించాలని భారత్ వేసిన కేసుపై లండన్లోని వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ సాగుతోంది. ఈ విచారణ కోసం కోర్టుకు వచ్చిన విజరుమాల్యా అక్కడి మీడియా ప్రతినిధులకు ఈ విషయాన్ని వెల్లడించడం దేశంలో రాజకీయ చర్చను వేడెక్కించింది. ప్రభుత్వ తెరచాటు అనుమతులతోనే దోషులంతా దేశం దాటుతున్నారని ఇప్పటికే కొనసాగుతున్న అనుమానాలకు, ఆరోపణలకు మరింత ఆజ్యం పోసింది.
ఈ పరిస్థితుల్లో సహజంగానే ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మాల్యా మాటలు నిజం కాదని మంత్రి జైట్లీ కొట్టిపారేస్తున్నారు. తాను 2014 నుంచీ ఆయనతో ఎటువంటి అధికారిక భేటీకి అనుమతి ఇవ్వలేదనీ, పార్లమెంట్ ప్రాంగణంలో కలసి మాట్లాడే ప్రయత్నం చేసినా తాను అందుకు ఎక్కువ అవకాశం ఇవ్వలేదనీ అరుణ్జైట్లీ ఫేస్బుక్ వేదికగా స్పందించడం.., ఆ తరువాత మాల్యా కూడా మాట మార్చి తాను జైట్లీతో అధికారికంగా సమావేశమవలేదనీ, యా దృచ్ఛికంగానే కలిశానని పేర్కొంటూనే లండన్ పోతున్నట్టు మాత్రం ఆయనకు చెప్పానని స్పష్టం చేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దీంతో మాల్యా జైట్లీ ఏం మాట్లాడుకున్నారో బహిర్గతం చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ఇది చాలా తీవ్రమైన అంశమనీ, ప్రధాని మోడీ స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలనీ, దర్యాప్తు సజావుగా కొనసాగేందుకు వీలుగా ఆర్థికమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుండగా, అసలు మాల్యాకు దేశం దాటిపోయేందుకు ఎందుకు అనుమతించారో, అనుమతి ఇవ్వకుంటే ఎలా పారిపోగలిగారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని మిగిలిన రాజకీయ పక్షాలు అడుగుతున్నాయి. విజరుమాల్యాతో పాటు లలిత్మోడీ, నీరవ్మోడీ, మెహుల్ఛోక్సీ వంటి ఆర్థిక నేరగాళ్ళంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నలలోనే పలాయనం చిత్తగించారన్న అనుమానాలను ఈ ఉదంతం రుజువు చేస్తోందని మేధోవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన నివేదిక కూడా ఈ అభిప్రాయాలను బలపరుస్తోంది. బ్యాంకుల మొండి బకాయిలకు మూలాలు ప్రభుత్వ విధానాల్లోనే ఉన్నాయని ఆ నివేదికలో ఆయన సూటిగా చెప్పారు. అంతే కాదు దేశాన్ని ముంచడానికి ఆస్కారమున్న ఎగవేతదారుల జాబితాను ముందే పీఎంఓ (ప్రధానమంత్రి కార్యాలయం)కు పంపానని కూడా ఆయన చెప్పడం, అయినా ప్రభుత్వం పట్టనట్టు ఉండటం దేనిని సూచిస్తోంది..!? ఆ జాబితా పట్ల అప్రమత్తంగా ఉంటే ఈ పరిస్థితి దాపురించేదా..? నిజంగా సర్కారు తలచుకుంటే మోసగాళ్లందరూ పారిపోగలిగేవారా..? సామాన్య ప్రజలు రుణమడిగితే సవాలక్ష సందేహాలు, రకరకాల హామీలు కోరే బ్యాంకులు, కాలం కలసిరాక అప్పు చెల్లింపు ఆలస్యమైతే ఆస్తులు జప్తులు చేసి అవమానాలపాలు చేసే అధికార గణాలు ఈ బడా వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలకు మాత్రం సాగిలబడుతున్నాయి. రుణం అడుగుతున్న సంస్థల పనితీరు, వాటి పూర్వాపరాలు, ప్రతిపాదిత ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, మార్కెట్లో ఆ ప్రాజెక్టులకున్న విజయావకాశాలు ఇవేవీ పరిశీలించకుండానే వేలు, లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఈ పరాన్నభుక్కులపాల్జేస్తున్నాయి.
దీనికి కేవలం బ్యాంకుల అసమర్ధత, అధికారుల అవినీతే కారణమని చెప్పడం అర్ధసత్యమే అవుతుంది. ప్రభుత్వాల అసంబద్ధ నిర్ణయాలు, బోర్డులు పటిష్టంగా లేకపోవడం, మితిమీరిన రాజకీయ జోక్యం, ప్రభుత్వాల అండదండలూ లేకుండా ఇంత పెద్ద ఆర్థిక నేరాలకు ఆస్కారముంటుందా..!? రాజకీయ నాయకుల పరిచయాలు, మద్దతు లేకుండా వీరికి ఇంత సులభంగా రుణాలు లభిస్తాయా..?అపరాధ భావం ఆవగింజంతైనా లేకుండా, దిలాసాగా సిగార్ పొగ వదులుతూ భారత ప్రభుత్వం పంపిన ముంబైలోని ఆర్ధర్రోడ్ జైలు వీడియో 'చాలా బాగుంది' అంటున్న విజరుమాల్యా ఎగతాళి వెనుకున్న ధైర్యం ఎవరు..!? 9వేల కోట్ల దేశ సంపదను దోచుకు తిన్న ఓ అవినీతి తిమింగలం దేశం వీడేముందు సాక్షాత్తు భారత ఆర్థిక మంత్రిని కలిశానంటుంటే, దేశం దాటి పారిపోతున్నానని చెప్పే వచ్చానంటుంటే, రాజకీయ పార్టీలే తనను బలిపశువును చేశాయంటుంటే ఎందుకని ప్రధాని మౌనముద్ర వీడటం లేదు? నీరవ్మోడీ దేశం నుంచి ఉఢాయించే ముందు ప్రధానమంత్రిని కలుసుకుంటారు... విజరుమాల్యా దేశం వదిలి పారిపోయే ముందు ఆర్థిక మంత్రితో భేటీ అవుతారు. ఈ కలయికలు, భేటీల వెనుక నిజానిజాలేమిటో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి. ప్రధాని మోడీ కోరుకునే 'స్వచ్ఛత' కేవలం పరిసరాల్లోనే కాదు ఆలోచనలూ ఆచరణల్లోనూ ఉండాలి. అది పాలనలోనూ ప్రతిబింబించాలి. లేని పక్షంలో ప్రజలే శుద్ధి చేస్తారు.