Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరిగ్గా పదేండ్ల క్రితం ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ 1930వ దశకంనాటి మహామాంద్యం తరువాత ఒక పెను సంక్షోభంలోకి ప్రవేశించింది. ఒక దశాబ్దం తరువాత కూడా ఆ సంక్షోభానికి కారణమైన వైరుధ్యాలను అధిగమించటం అటుంచి కనీసం వాటి తీవ్రతను కూడా తగ్గించలేకపోయారు. అంతేకాకుండా ద్రవ్య వ్యవస్థ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోకుండా ఉండటానికి ఏ విధానాలతోనైతే లక్షల కోట్ల డాలర్లను వినియోగించారో అవే విధానాలు మరింత తీవ్రతతో కూడిన మరో పెను సంక్షోభం ఆవిర్బవించ టానికి కావలసిన పరిస్థితులను సృష్టించాయి.
ఒకటిన్నర శతాబ్దాల చరిత్రగల 'లేమన్ బ్రదర్స్' బ్యాంకుకు ఉద్దీపనను అందించి, అనివార్య దివాళాను అడ్డుకోవటానికి అమెరికా ప్రభుత్వం తిరస్కరించటంతో 2008లో అమెరికాలో ఒక పెను ఆర్థిక సంక్షోభం చెలరేగింది. 'లేమన్ బ్రదర్స్' దివాళా సంక్షోభాన్ని బహిర్గతం చేసినప్పటికీ అసలు విషయం రెండు రోజుల తరువాత ఏఐజీ అనే కంపెనీ దివాళాకు సిద్దంగా ఉన్నదన్న విషయం బయటపడింది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో కేంద్రకంగావుండే కంపెనీలలో ఏఐజీ ఒకటి. ఈ కంపెనీ దివాళాతీస్తే లక్షల కోట్ల విలువైన ఫైనాన్షియల్ ఉత్పత్తులు దెబ్బతింటాయి. దానితో విషయం ఏవో కొన్ని బ్యాంకులను ఉద్దీపనలతో బయటపడేయటం కాదనీ, యావత్తు ఫైనాన్షియల్ వ్యవస్థనే పెద్ద ఎత్తును ఉద్దీపనలను అందించి రక్షించవలసిన పరిస్థితి ఏర్పడిందని అమెరికా ప్రభుత్వానికి అర్థమయింది.
ప్రపంచ ఫైనాన్షియల్ వ్యవస్థలో అంతఃసంబంధాలు బలంగా ఉండటం చేత సంక్షోభం ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లకు ముఖ్యంగా ఐరోపాకు వేగంగా పాకింది. ఐరోపా బ్యాంకులు అమెరికా గృహ తనఖా మార్కెట్కు చెందిన ఫైనాన్షియల్ సాధనాలలో బాగా పెట్టుబడులు పెట్టాయి. ఈ సాధనాల పతనమే సంక్షోభానికి తక్షణ కారణంగా ఉంది. సాధారణ పరిస్థితులలో కనపడని రాజకీయ, సామాజిక-ఆర్థిక సంబంధాల అసలు స్వరూపాన్ని సంక్షోభాలే బయటపెడతాయి. అందుకు 2008లో సంభవించిన సంక్షోభం మినహాయింపు కాదు. ఈ సంక్షోభానికి 20ఏండ్ల ముందు ఆ తరువాత ముఖ్యంగా 1991లో సోవియట్ యూనియన్ పతనం తరువాత పెట్టుబడిదారీ 'స్వేచ్ఛా మార్కెట్' ఒక్కటే శ్రేష్టమైన సామాజిక-ఆర్థిక వ్యవస్థగా మనగలుగుతుందని బూర్జువా వర్గం, ఆ వర్గ అనుబంధ మేధావులు ప్రకటించారు. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోగల పరిష్కారంలేని మౌలిక వైరుధ్యాల గురించి మార్క్స్ విశ్లేషణ తప్పని తేలిందనీ, సోవియట్ పతనంతో మార్క్సిజం శాశ్వతంగా సమాధి అయిందనీ వారు చెప్పారు.
బూర్జువా సైద్ధాంతిక విశ్లేషణగా చెప్పుకోబడుతున్న 'సమర్థ మార్కెట్ల పరికల్పన'ను అనుసరించి అధునాతన సాంకేతి పరిజ్ఞానం అందుబాటులో ఉండటంవలన సమగ్ర సమాచారంతో నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఆర్థిక సంక్షోభం రావటం దుస్సాధ్యం. అయితే ఇదంతా అందుబాటులో ఉన్నప్పటికీ సంభవించిన ఆర్థిక సంక్షోభం బూర్జువా అర్థశాస్త్రాన్ని ఒక చిత్తు కాగితంగా మార్చివేసింది. అంతేకాకుండా బూర్జువా భావజాలం ప్రవచించే ప్రధాన బూటకాలలో ఒకటైన 'రాజ్యం తటస్థమైనది, సామాజిక, ఆర్థిక విషయాలను నిర్వహించే స్వతంత్ర వ్యవస్థ' అనే ముసుగును ఈ సంక్షోభం తొలగించింది. 'ఆధునిక రాజ్యానికి చెందిన కార్యనిర్వాహక వర్గం బూర్జువా వ్యవహారాలను నిర్వహించే కమిటీ మాత్రమే' అని 170ఏండ్ల క్రితం మార్క్స్ చేసిన సూత్రీకరణ మరోమారు నిర్దారణ అయింది. ఎవరి నేరపూరిత చట్ట కార్యకలాపాలు సంక్షోభానికి కారణభూతమయ్యాయో అటువంటి ద్రవ్య పెట్టుబడిదారీ వర్గాన్ని నష్టాలనుంచి గట్టెక్కించటానికి కావలసిన ప్రణాళికలను అమెరికా ప్రభుత్వం రచించి, అమలు చేసింది.
సంక్షోభం అమెరికా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్న సంవత్సరంలోనే అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలో బారక్ ఒబామా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా నిలుచున్నాడు. ఆయనను 'ఆశ'ను పునఃస్థాపించే అభ్యర్థిఅనీ, 'నమ్మకంగా మార్పును తెచ్చే అభ్యర్థి'అనీ మీడియా కీర్తించింది. గెలిచిన తరువాత ఎటువంటి చర్చలేకుండానే 700బిలియన్ డాలర్లను ఉద్దీపనల కోసం కేటాయించాడు. ఆ ధనంతో క్రిస్లర్, జనరల్ మోటార్స్ వంటి అనేక కంపెనీలకు ఉద్దీపనలను అందజేశాడు. దానితో దేశం అప్పు గణనీయంగా పెరిగింది.
ఈ ఉద్దీపనలకు మరోపార్శం కూడావుంది. అదేమంటే వర్గ సంబంధాలను పూర్తిగా పునఃనిర్మించటం. సంక్షోభం ప్రారంభంలో ఎదురయిన ప్రభావాన్ని అధిగమించిన తరువాత బూర్జువా వర్గం మితవ్యయ విధానాన్ని ప్రవేశపెట్టి నిరుద్యోగాన్ని రికార్డ్ స్థాయికి పెంచింది. గతంలో ఎన్నడూ లేనంతగా కార్మికుల నిజవేతనాలు తగ్గాయి. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ల జీతభత్యాలు ఎన్నో రెట్లు పెరిగాయి. ఆవిధంగా బూర్జువా ప్రజాస్వామ్య వాస్తవ వర్గ స్వభావాన్ని ఈ సంక్షోభం బట్టబయలు చేసింది.
అమెరికాలో 2008లో పెల్లుబికిన ఆర్థిక సంక్షోభం ప్రపంచ స్థాయి సంక్షోభంగామారి నేటికీ కొనసాగుతున్నది. దీని ప్రభావం కారణంగా కార్మికవర్గ జీవన స్థితిగతులు మరింతగా దిగజారాయి. కాబట్టి ఈ సంక్షోభ పరిష్కారం కూడా ప్రపంచ స్థాయిలోనే జరగాలి. అందుకోసం అవసరమైతే దేశాల సరిహద్దులనుదాటి కార్మిక వర్గం సమీకృతం కావటమే ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం అవుతుంది.