Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అభివృద్ధి, అవినీతి రహిత సమాజం' అన్న మోడీ నినాదాలు అబద్ధమని తేలిపోయాక రాజకీయాలన్నీ రాముని చుట్టూ నడిపే ప్రయత్నాలు తిరిగి ఊపందుకుంటున్నాయి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్భగవత్ నుంచి బీజేపీ చీఫ్ అమిత్షా దాకా మంత్రులు, మఠాధిపతులు సమస్త కాషాయ పరివారమంతా అయోధ్యలో ఆలయ నిర్మాణమనే పేర రామనామ స్మరణలో మునిగితేలుతున్నారు. ఈ వివాదాస్పద అంశంపై సుప్రీం కోర్టు తీర్పును వాయిదా వేసిన నేపథ్యంలో ''రాముని జన్మస్థలంలో అద్భుత ఆలయ నిర్మాణం కోటానుకోట్ల హిందువుల ఆకాంక్ష. ఈ ఆకాంక్షను ఆలస్యం చేయకుండా నిజం చేయడానికి అవసరమైతే ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలి.'' అని ఆర్ఎస్ఎస్ చీఫ్ స్పష్టం చేయడంతో సంఫ్ు శ్రేణులు తమ దూకుడు పెంచాయి.
శుక్రవారం బీజేపీ చీఫ్ అమిత్షా ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్తో బేటీ అయి మందిర నిర్మాణంపై సంప్రదింపులు నెరుపగా.. తాజాగా శని ఆదివారాల్లో ఢిల్లీలో పెద్ద సంఖ్యలో సాధువులు, సన్యాసులు సమావేశమై సమాలోచనలు జరిపారు. మరోవైపు కాషాయ నేతగణమంతా కట్టగట్టుకుని ఆలయ నిర్మాణాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదని వరుసగా వాగ్భాణాలు విసురుతున్నారు. వెంట వెంటనే చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలన్నీ.. త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు రానున్న సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ రాజకీయ వ్యూహాన్ని సూచిస్తున్నాయి.
ఇక మందిర నిర్మాణం కోసం వేచిచూసే ఓపిక తమకు లేదనీ, అవసరమైతే 1992 తరహాలో భారీ ఆందోళనలకు సైతం వెనుకాడబోమనీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషీ హెచ్చరిస్తుండగా.. ఎవరూ వేచి చూడాల్సిన అవసరం లేదనీ, రామ భక్తులంతా త్వరలోనే ఓ శుభవార్త వింటారనీ యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ సెలవిస్తున్నారు. ఇంకోవైపు ఆలయ నిర్మాణానికి వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని బాబా రాందేవ్ ఆదేశిస్తుండగా, డిసెంబర్ 6న ఈ మందిర నిర్మాణానికి పునాదిరాయి వేసి తీరుతానని సాధ్వి ప్రాచి సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు తనకు ఎవరి ఉద్దేశాలతో, ఎవరి తీర్పులతో పనిలేదని తేల్చి చెపుతున్నారు. ఈ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి ఉమాభారతి మరింత ఆజ్యం పోశారు. హిందువులు అత్యంత సహనశీలురనీ, కానీ అయోధ్యలో మందిరం పక్కనే మసీదును ఏమాత్రం సహించరని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు.. ఇది న్యాయస్థానాలకు వెలుపలే పరిష్కరించుకోవాల్సిన సమస్య అంటూ పరోక్షంగా కోర్టు తీర్పుతో పనిలేదని కూడా ఆమె చెప్పకనే చెప్పారు. ఇవన్నీ మత ఉద్రిక్తతలను సృష్టించి, భావోద్వేగాలను రెచ్చగొట్టి మరోసారి గద్దెనెక్కాలనే సంఫ్ు కుతంత్రాల్లో భాగమేననడంలో సందేహమేమీలేదు.
మరో కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్ త్వరలో మందిర నిర్మాణంపై పార్లమెంటుకు రాబోతున్న ప్రయివేటు బిల్లుపై కాంగ్రెస్ వైఖరేమిటో చెప్పాలని డిమాండ్ చేస్తుండగా బీజేపీ రాజ్యసభ సభ్యులు రాకేష్ సిన్హా మరో అడుగు ముందుకేసి తానే ఈ ప్రయివేటు మెంబరు బిల్లు పెట్టబోతున్నాననీ.. మద్దతిస్తారో లేదో తేల్చి చెప్పండి అంటూ రాహుల్గాంధీతో పాటు లాలూప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్ వంటి నేతలను ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. ఒక అధికార పార్టీ సభ్యుడు ప్రయివేటు మెంబరు బిల్లు పెట్టడం మరీ విడ్డూరం. అదీగాక తమకు ప్రత్యామ్నాయ కూటమికి ప్రయత్నిస్తున్న నేతలను మాత్రమే ప్రశ్నించడంలోని పరమార్థమేమిటి..!? మందిర నిర్మాణానికి అనుకూలురు, ప్రతికూలురు అనే విభజన చేసి హిందూ ఓట్లను గంపగుత్తగా సొమ్ము చేసుకోవాలన్న కుతంత్రమే ఇదంతా.
బీజేపీకి కేంద్రంలో సంపూర్ణ మెజారిటీ ఉంది. దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలున్నాయి. అన్నిటికీ మించి వివాదానికి కేంద్రమైన ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. మరి ఆలయ నిర్మాణానికున్న ఆటంకాలేమిటి? నిజానికి రాముడికి ఆలయం నిర్మించడం పట్ల ఎవరికీ ఏ అభ్యంతరమూ లేదు.. కాకపోతే బాబ్రీ మసీదు కూల్చివేసిన స్థలంలోనే నిర్మించాలనటం... రాముడి పేరుతో రాజకీయాలు చేయడం, తమ రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాలు, విద్వేషాలు సృష్టించడం పట్ల మాత్రమే అభ్యంతరాలున్నాయి. కానీ బీజేపీ అసలు ఉద్దేశం రాముడి పేరుతో రాజకీయాధికారాన్ని సాధించడం. కనుకనే సమస్య అత్యున్నత న్యాయస్థానం ముందుండగా అవసరమైనప్పుడల్లా మందిరం పేరుతో మంటలు రాజేస్తోంది. ''రామ మందిర నిర్మాణానికి సేకరించిన ఇటుకలు మందిరం కోసం కాదు.. బీజేపీ అధికారం కొరకు..'' అన్న శివసేన అధినేత ఉద్దవ్థాక్రే వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
మోడీ గ్రాఫ్ అంతకంతకూ పడిపోతూ ఎదురుగాలులు వీస్తున్న వేళ... తిరిగి అధికారపీఠమెక్కడానికి రాముడే దిక్కని బీజేపీ భావిస్తోంది. కనుకనే మళ్లీ రాముడిపేరుతో రాజకీయాలకు తెరలేపుతున్నది. ఇప్పుడిక పరిష్కారానికి నోచని తమ దైనందిన సమస్యలన్నిటినీ ప్రజలు మరిచిపోవాలన్నమాట..! గడిచిన నాలుగున్నరేండ్లుగా సాగిన మోడీ అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్నీ, తమ ఆర్థిక సామాజిక జీవన విధ్వంసాన్నీ, వ్యవస్థల విధ్వంసాన్నీ మరిచి ప్రజలంతా బీజేపీ మందిర నిర్మాణం గురించి ఆలోచించాలన్న మాట..! వీరి కుతంత్రాలపట్ల అప్రమత్తం కాకపోతే ఈ దేశ నిర్మాణానికి మూలాధారాలైన ప్రజాస్వామ్యం, లౌకికవిలువలను మూల్యంగా చెల్లించాల్సి ఉంటుంది...