Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నోట్ల రద్దు' అనే చీకటి రోజుకు రెండేండ్లు గడిచినా అది చేసిన గాయం ఇంకా సలుపుతూనే ఉంది. కాలం అన్ని రకాల గాయాలను మాన్పుతుందంటారు. కానీ మోడీ చేసిన గాయం మానకపోగా కాలం గడిచేకొద్దీ రెచ్చుతోంది. సరిగ్గా రెండేండ్ల క్రితం 2016 నవంబర్ 8న పెద్దనోట్లను రద్దుచేసి ఈ గాయాన్ని కేవలం 50 రోజులు భరిస్తే చాలు.. ఆపైన అంతా అద్భుతమేనన్నారు. ఈ గాయాన్ని భరించడం దేశ భక్తులైన ప్రజలందరి కర్తవ్యం అన్నారు. నమ్మిన ప్రజలు తమ దేశభక్తి నిరూపించుకోవడానికి పంటి బిగువున ఆ గాయాన్ని భరించారు. రోజులు తరబడి ఏటీఎంల ముందు పడిగాపులు గాచారు. ఆ పడిగాపుల్లోనే వందలమంది ప్రాణాలు వదిలారు. వైద్యానికి డబ్బుల్లేక విలవిలలాడిన ప్రాణాలకు, ఖర్చులకు డబ్బుల్లేక ఆగిపోయిన పెండ్లిండ్లకు నిలిచిపోయిన శుభకార్యాలకు లెక్కేలేదు..! ప్రధాని మాటకోసం ప్రజలు లెక్కకు మించిన కష్టాలననుభవించారు. అనుభవిస్తూనే ఉన్నారు..!
ఈ గాయానికి బలవుతున్న సామాన్యుల పట్ల కనీస సానుభూతి చూపే తీరికలేని ఏలికలు ఇప్పటికీ ఇది సాహసోపేతమైన, సముచితమైన నిర్ణయమేనని బుకాయించడం విస్తుగొలుపుతోంది. ఈ నిర్ణయం వల్ల లక్షల కోట్ల నల్లధనం బయటికొస్తుందీ, అవినీతి అంతమవుతుందీ, ఉగ్రవాదానికి అడ్డుకట్ట పడుతుందీ, నకిలీ కరెన్సీ నశించిపోతుందీ అన్న ప్రధాని పలుకులన్నీ బూటకమని తేటతెల్లమవుతుంటే... ఇది సాహసమో దుస్సాహసమో అయితే కావచ్చు కానీ, సముచిత నిర్ణయం ఎలా అవుతుంది..!? అనాలోచితం అని భావించడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ప్రధాని ఏం ఆలోచించి ఇందుకు పూనుకున్నారో... ఏ లక్ష్యాలను సాధించదలిచారో ఎవరికి తెలుసు..!! ఎందుకంటే ఆయన 'మన్కీ బాత్' అంటూ నిరంతరం మాట్లాడుతూనే ఉన్నా ఇప్పటి వరకూ మనసులో మాట చెప్పిందీ లేదు, చెప్పింది చేసిందీ లేదు. కాబట్టి ఆచరణను బట్టే ఆయన అసలు ఉద్దేశ్యాలను పసిగట్టాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఆచరణలో కనిపిస్తున్నదేమిటి? పాలకపక్షాలు, ప్రతిపక్షాలు ఎవరేమి చెపుతున్నారన్నది పక్కన పెడితే.. మోడీ ఒక్క నిర్ణయంతో అసంఖ్యాకులైన ప్రజల బతుకులను అతలాకుతలం చేశారు. ఒంటి చేత్తో దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు... కాకుల్ని కొట్టి గద్దలకు వేసిన చందంగా రెక్కలు ముక్కలు చేసుకుని న్యాయబద్ధంగా సంపాదించుకునే సామాన్యులను చావుదెబ్బతీసి, నల్లకుబేరుల అక్రమ సంపాదన చట్టబద్ధం చేశారు. ఇదే కదా ఆచరణలో కనబడుతున్న నిజం. మోడీ ఈ నిర్ణయం వెనుక అసలు ఉద్దేశం ఇదే అయితే ఆయన నూటికి నూరుపాళ్లు జయప్రదమయ్యారు. కానీ ప్రజలే భంగపడ్డారు. కాదు ఇది అబద్ధమనుకుంటే మరి ప్రధాని ప్రజలకు వాగ్దానం చేసిన లక్ష్యాలను సాధించారా..?
అక్రమంగా దాచుకున్న నల్ల డబ్బును ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చేందుకే నోట్ల రద్దును చేపట్టామని మోడీ పదేపదే తెలిపారు. ఇప్పటికి ఎంత డబ్బు తెచ్చారు. మూడు నుంచి నాలుగు లక్షల కోట్లయినా నల్లడబ్బు పట్టుబడుతుందని ప్రభుత్వం లెక్కలు కట్టింది. రద్దయిన పెద్దనోట్ల విలువ 16.41 లక్షలకోట్లు. అందులో 16.31 లక్షల కోట్లు వెనక్కి వచ్చాయి. అంటే సుమారు రద్దయిన నోట్లలో 99.30శాతం తిరిగి వ్యవస్థలోకి వచ్చాయి. అక్రమ సంపాదనాపరులు తమ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారనడానికి ఇంతకంటే రుజువేముంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగిరాని పాతనోట్ల మొత్తం కేవలం పదివేల కోట్లు మాత్రమే కాగా కొత్తగా నోట్ల ముద్రణకు చేసిన ఖర్చు రూ.7965కోట్లు. ఇది కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేని తీరుకు అద్దం పడుతోంది. ఇక కొత్త కరెన్సీ అందరికంటే ముందే ఉగ్రవాదుల చేతుల్లో మెరిసింది. ఉగ్రవాదుల దాడులు గతానికి రెండింతలు పెరిగాయని అధికారిక లెక్కలే చెపుతున్నాయి. పాతనోట్లు రద్దు చేస్తే నకిలీ మకిలి వదులుతుందని చెప్పారు. కాని కొత్తనోట్ల వెన్నంటే వాటి నకలు నోట్లూ వెలుగుచూసాయి. మరి అవినీతి ఆగిందెక్కడీ నల్లధనం కట్టడయిందెక్కడీ ఏకంగా 2వేలనోటు అందుబాటులోకి రావడంతో నల్లకుబేరుల పని మరింత సులువైంది.
చివరికి ప్రధాని చెప్పిన లక్ష్యాలేవీ నెరవేరకపోగా, ఈ నోట్ల రద్దు అనేక దుష్ప్రభావాలను చూపుతూ భారత ఆర్థిక వ్యవస్థకు పెను విపత్తుగా మారింది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 7.1శాతం నుంచి 5.7శాతానికి పడిపోయింది. అంటే కొన్ని లక్షల కోట్ల ప్రజా సంపద ఆవిరైపోయింది. మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలైన చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపారాలన్నీ చిన్నాభిన్నమయ్యాయి. అసంఘటితరంగం కుదేలయింది. ఫలితంగా ఉపాధి ఉద్యోగావకాశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. కొన్ని లక్షల కుటుంబాలను రోడ్డున పడేసిన నోట్లరద్దు ప్రభావం ఇంకా వెన్నాడుతూనే ఉంది. అంతిమంగా మన బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్నే వమ్ము చేసింది. నోట్లరద్దు ప్రధాని చెప్పిన ఏ ఒక్క లక్ష్యాన్నీ సాధించకపోగా భారత ఆర్థిక వ్యవస్థనే భారీ దెబ్బతీసిందని ఈ వాస్తవాలన్నీ రుజువు చేస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని ముందే ఊహించిన జాతీయ అంతర్జాతీయ ఆర్థిక నిపుణులెందరో హెచ్చరించినా లెక్కచేయని మోడీ అంతరంగమేమిటో ఈ రెండేండ్ల అనుభవాలు అవగతం చేస్తున్నాయి. ఇప్పటికైనా తప్పుదిద్దుకోవాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకపోగా ఇంకా మోసం చేయాలని చూస్తే తగిన పాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.