Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి బతకడానికి డబ్బు అవసరం. కానీ బతుకుల్నే శాసించే స్థితిలో డబ్బు చెలామణీ కావడం విషాదవైచిత్రి. మనుషుల కోసం డబ్బు కాకుండా, డబ్బు కోసమే మనుషులు ప్రదక్షిణ చేయడం చేదు నిజం. సకల రంగాల్లో ధనం పాత్ర విచ్చలవిడిగా పెరుగుతున్న తీరుకు విస్తుపోయే పెద్దల్ని చూస్తున్నాం. ధనం మూలం మిదం జగత్ అన్నది ఒక నానుడి. ఈ జగత్తుకు మూలం ధనం అన్నది భావం. కానీ మూలమే కాదు, సర్వమూ, సర్వస్వమూ కావడం ఎల్లెడలా కనిపించే వాస్తవం. మరీ ముఖ్యంగా ఎన్నికల్లో ధనం పాత్ర బెంబేలెత్తిస్తున్నది. ఎక్కడికక్కడ డబ్బు మూటలు పట్టుకుంటున్న వైనం వింటున్నాం. అనేకరూపాల్లో డబ్బును పంచుతున్నారు. ఖర్చు పెడుతున్నారు. వందల, వేల కోట్ల రూపాయాల ధనవ్యయం మన ప్రజాస్వామ్యం నేతిబీరకాయ చందమని చెప్పకనే చెబుతున్నది.
డబ్బులు ఖర్చు పెట్టలేనివారు ఎన్నికల్లో నిలబడలేరు. ఆశయబలం కన్నా ఆర్థికబలం ప్రధానమై పోయింది. నిబద్ధత కన్నా నీళ్ళ మాదిరిగా డబ్బు వెచ్చించగలవారికే ప్రాధాన్యం హెచ్చింది. సేవ కన్నా కైంకర్యపు తెలివితేటలు గలవారే అంతటా దర్శనమిస్తున్నారు. పోటీ చేయడానికి డబ్బు కావాలి. గెలిచాక తిరిగి ఆ డబ్బును రాబట్టుకోవాలి. మరల ఎన్నికల్లో నిలబడటానికి కోట్లు కోట్లు పోగేసుకోవాలి. ఇదంతా ఒక చట్రం. ఈ చట్రంలో అవినీతి, ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుతంత్రాలదే పైచేయి. ఒకసారి ఎన్నికయ్యాక సంపదలు పోగేసుకోవడమే నేతల పరమావధి. ఎన్నికల సంస్కరణలు ఎన్ని వచ్చినా, ఎంతటి కట్టుదిట్టపు నిబంధనలు అమలవుతున్నా ఎన్నికల్లో డబ్బు పాత్ర అనేకరెట్లు పెరుగుతూనేవున్నది.
ఓటు విలువ గురించి ఎన్నో సూక్తులు చెబుతున్నారు. ఓటును అమ్ముకోవద్దని చెప్పే ప్రచారాలకు అంతులేదు. కానీ ఓట్లను కొనుగోలు చేయగల డబ్బు చెలామణీకి ఆస్కారం ఎక్కడిదో ప్రశ్నించాలి. కోట్లు ఖర్చుపెట్టే ధనం ఎక్కణ్నించి పోగుపడిందో యోచించాలి. అడ్డదారుల్లో సంపాదించడానికి అధికారాన్ని దుర్వినియోగం చేసే దుర్మార్గాలకు మూలం ఎక్కడో చూడాలి. అవినీతి, అక్రమ సంపాదన ఎన్నికల అంశాలు కావని, వాటిని జనం పట్టించుకోరనే మాటలు చెలామణీలో ఉన్నాయి. అవినీతిపై సమాజ నిర్లిప్తతకీ, ఉపేక్షభావానికీ ఈ వాదనలే ఓ దాఖలా. కిందిస్థాయి నుంచి అత్యున్నతస్థాయి వరకు అవినీతికి అంతులేదు. ఒక ఇంజనీరు, ఒక సబ్ రిజిస్ట్రార్, ఒక ఆర్టిఏ అధికారి కోట్లకు కోట్లు సంపాదించడానికి దారితీసే వెసులుబాటు వ్యవస్థలోనే ఉంది. అలాగే ఒకసారి ఎన్నికల్లో గెలిచిన నాయకుడు అనేక విధాల ప్రజాధనాన్ని కొల్లగొడుతూ, వందల కోట్లు పోగేయడాన్ని ప్రశ్నించేవారు అరుదయ్యారు. బడా కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు ఎన్నికల కోసం వందల కోట్లు అందిస్తున్నారు. ఈరకంగా బూర్జువా పార్టీలని పోషిస్తూ వేల కోట్లు సంపాదిస్తున్నారు. ప్రపంచీకరణ అనుకూల విధానాల ఫలితంగా బడా కార్పోరేట్లు లాభపడటమే కాదు, ఎన్నికల వ్యవస్థనే శాసించే స్థాయికి ఎదగడం వైపరీత్యం.
ఈ విపరీత పరిణామాలపై ఆగ్రహావేశాలతో స్పందించే స్థితి లేకపోవడం సమాజంలో పేరుకుపోయిన చైతన్యరాహిత్యానికి నిదర్శనం. ప్రజల వలన ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నికయిన ప్రతినిధులతో కొనసాగాల్సిన పాలన ప్రజాస్వామ్యానికి శుభకరం. దీనికి విరుద్ధంగా సాగే విధివిధానాల వ్యవహారసరళి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తున్నది. దబ్బున్నవాడిదే రాజ్యమనే దుర్మార్గానికి దారితీస్తున్నది. ఎన్నికలంటే డబ్బున్న మారాజుల మధ్య పోటీగా పరిణమించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం. చట్టం, న్యాయం డబ్బుసంచుల ముందు మూగబోవడం వ్యవస్థల విశ్వసనీయతకు శరాఘాతం.
ఎన్నికయిన ప్రభుత్వాలు కూడా ప్రాధాన్యాల్ని మరిచి ఓట్ల కోసం కుటిల పన్నాగాలతో ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నాయి. ఒకవైపున వరదలు వెల్లువెత్తి జనం నానా కష్టాల్లో కునారిల్లుతుంటే వారికి సహాయం అందించడానికి చేతులు రావు. కానీ ఒక విగ్రహం కోసం వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చిస్తారు. ఓట్ల కోసం విగ్రహాలకు, దేవాలయాలకు, జాతర్లకు ఇష్టానుసారంగా కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల సమయంలోనే కాదు, అధికారంలో ఉంటూ కూడా జనం డబ్బును నీళ్ళలా ఖర్చు పెట్టే కౌటిల్యం అత్యంత హేయమైనది. నిత్యమూ, నిరంతరమూ జనాన్ని మభ్యపుచ్చుతూ పబ్బం గడుపుకోవాలనే పాలకుల దుర్నీతి ప్రశ్నార్థకం.
ఈ ప్రశ్నల్ని సంధించాల్సిన బాధ్యత ఎన్నికల రంగంలో నిలబడిన ప్రజాస్వామ్య వాదులపై, కమ్యూనిస్టులపైన మరింతగా ఉన్నది. మూడు సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ సొంత ఇల్లు లేని ఉప్పల మల్సూరు లాంటి వారి నిరాడంబరత, ఇరవయ్యేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినా కారు కూడా లేని మాణిక్ సర్కార్ లాంటివారి ఆదర్శం ఇవాళ ప్రచారంలో ముందుకు రావాలి. ప్రజల కోసం పనిచేయడానికి డబ్బు అక్కర్లేదు. జనం మధ్య నిలబడి జనం కోసం పనిచేసేవారే నిజమైన ప్రజా ప్రతినిధులు. వెల్లువెత్తే ధనప్రవాహపు తాకిడికి ఎదురునిలిచి వారు నెగ్గుకు రాగలగడం సందేహాస్పదం కావడం విషాదం. ఈ సందేహాల్ని పటాపంచలు చేసే చైతన్యం పరివ్యాప్తం కావడం తక్షణావసరం.