Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అపారమైన యువ సంపత్తి ఈ దేశం సొంతం. ప్రపంచంలో మరే దేశానికీ ఇంతటి యువసంపత్తి లేదంటే అతిశయోక్తి కాదు. కానీ ఇంతటి అద్భుత సంపత్తి కలిగి ఉన్నందుకు గర్వపడాలో.. ఆ యువశక్తి ఉపాధి ఉద్యోగావకాశాలు కొరవడి నిరాశ నిస్పృహల్లో నిర్వీర్యం అవుతున్నందుకు బాధపడాలో అర్థకాని వింత పరిస్థితి దేశంలో నెలకొని ఉంది. ఇప్పటికే నిరుద్యోగితలో అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న ఇండియా ఈ నాలుగున్నరేండ్ల మోడీ విధానాల ఫలితంగా సమీప భవిష్యత్తులో కూడా మరే దేశం అందుకోలేనంత శిఖరాగ్రానికి ఎగబాకుతోంది. ఏడాదికి కోటి కొలువులు వాగ్దానం చేసి ఢిల్లీ పీఠంపై కొలువుదీరిన మోడీగారి ఎలుబడి కొత్త కొలువులు సృష్టించలేకపోగా ఉన్న కొలువులకే ఎసరు తెచ్చిందన్నది ఇప్పుడు వెలుగుచూస్తున్న సత్యం. 'సీఎంఐఈ' (భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ సంస్థ) తాజా నివేదికే ఇందుకు ఉదాహరణ. కేవలం గడిచిన 22 నెలల్లోనే కొత్త ఉద్యోగాల సృష్టి జరుగకపోగా కోటీ 12 లక్షలు ఉన్న ఉద్యోగాలే ఊడిపోయాయని ఈ నివేదిక వెల్లడిస్తున్నది.
సీఎంఐఈ క్రమం తప్పక ఎప్పటికప్పుడు శ్రామికశక్తిలోకి వస్తున్న యువకుల సంఖ్యను వారు పొందుతున్న ఉద్యోగాలను అంచనా కడుతుంది. విస్తృత యంత్రాంగం, విశేషానుభవం కలిగి ఉన్న ప్రఖ్యాత ఆర్థిక మేథోమధన సంస్థగా సీఎంఐఈ అధ్యయనాలు, అంచనాలు అత్యంత విశ్వసనీయమైనవని పేరు... అందుకే ఈ విషయమై మన ప్రభుత్వాలే కాకుండా బడా కార్పొరేట్ సంస్థలు కూడా సీఎంఐఈ నివేదికలపైనే ఆధారపడుతాయి. అటువంటి సంస్థ తన నివేదిక ద్వారా మోడీ ఇన్నాళ్లుగా ఊదరగొడుతున్న ఉపాధి, ఉద్యోగావకాశాలన్నీ వట్టి మాటలేనని కుండ బద్దలు కొడుతున్నది. గతంలో నిరుద్యోగం అత్యధికంగా నమోదవుతున్న దేశాలలో ఇండియాదే మొదటి స్థానమనీ 'ఐఎల్వో' (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) నివేదిక స్పష్టం చేయగా, ఇప్పుడు సీఎంఐఈ వెల్లడిస్తున్న నిజాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
నివేదిక వెల్లడిస్తున్న వివరాల ప్రకారం 2017 జనవరి నుంచి 2018 అక్టోబరు నాటికి.. అంటే ఈ 22 మాసాల కాలంలో కోటి 12 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అదే సందర్భంలో కొత్తగా ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారి సంఖ్య 2కోట్ల 10 లక్షల నుంచి 2 కోట్ల 95 లక్షలకు చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే ఉద్యోగార్థుల సంఖ్య 85లక్షలు అదనంగా పెరిగింది. దీనికి ఉద్యోగాలు కోల్పోయిన కోటి 12 లక్షల మందిని చేరిస్తే మన ఏలినవారి పాలనలో నిరుద్యోగ తీవ్రత మోతాదు తెలుస్తోంది. అంటే ఏడాదికి కోటి మందికి ఉపాధి అవకాశాల కల్పన కాస్తా ఏడాదికి కోటిన్నర ఉద్యోగాల ఉద్వాసనగా మారిందన్నమాట.!
భారత ఉపాధి రంగం గడిచన పదిహేనేండ్లలో ఎన్నడూ లేనంత దీనావస్థను ఈ రెండేండ్లుగా చవిచూస్తుండటం గమనార్హం. ఈ కాలంలో మోడీ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాలే ఇందుకు కారణమని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతుండగా ఈ రెండేండ్ల అనుభవం కూడా అదే నిరూపిస్తున్నది. ప్రధానంగా పెద్దనోట్ల రద్దు ప్రధాని చెపినట్టు అవినీతిని అరికట్టడం, నల్లధనాన్ని వెలికితీయడం, ఉగ్రవాదాన్ని అడ్డుకోవడం, నకిలీ కరెన్సీని రూపుమాపడం చేయలేకపోగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలను వ్యాపారాలను చావు దెబ్బకొట్టింది. దాని ఫలితంగానే కొత్త ఉద్యోగాలు ఉపాధి అవకాశాల సృష్టి జరుగకపోగా, ఉన్న ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కనుమరుగయ్యే దుస్థితి దాపురించింది. నోట్ల రద్దుకు తోడు జీఎస్టీని అమలులోకి తీసుకురావడంతో పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ఈ రెండు నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమించి చిన్న, మధ్య తరహా పారిశ్రామిక రంగాన్ని చిన్నాభిన్నం చేసాయి. ఆ ప్రభావం ఉపాధి రంగంపై ఎట్లా ఉంటుందో ఇప్పుడు రుజువవుతున్నది.
వ్యవసాయ రంగం కూడా తీవ్ర సంక్షోభానికి గురవుతున్నది. 2019 నాటికల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ఏలికలు కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేకపోయారు. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినా గిట్టుబాటు లభించక రైతాంగం దివాళా తీసి వ్యవసాయరంగాన్ని వదిలేస్తున్నది. దీంతో వ్యవసాయరంగంలో ఉపాధిని కోల్పోతున్నవారు, చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఉపాధి కోల్పోతున్నవారు, అసంఘటితరంగంలో ఉపాధిని కోల్పోతున్నవారికి కొత్తగా చదువులు పూర్తిచేసుకుని వస్తున్న యువతరం తోడవ్వటంతో ఉపాధి కోసం ఎదురు చూసేవారి సంఖ్య కనీవినీ ఎరుగని రీతిలో పెరిగి ఈ సంక్షోభం అంతకంతకూ తీవ్రమవుతోంది. ఈ అనుభవం దేశంనిండా కనిపిస్తున్నా కూడా తమ నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలు సాహసోపేతమైనవీ సముచితమైనవని ప్రభుత్వ పెద్దలు బుకాయించ చూడటం ముమ్మాటికీ దుస్సాహసమే..! ఈ దుస్సాహసాలకు తోడు గడిచిన నాలుగున్నరేండ్లుగా మోడీ అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలే ఈ విపత్తులకు విపరీతాలన్నిటికీ మూలమని జాతీయ అంతర్జాతీయ ఆర్థికవేత్తలు చెవినిల్లు కట్టుకుని చెపుతున్నా చెవికెక్కించుకోని సర్కారిది. ఆర్థిక పారిశ్రామిక వ్యవసాయ రంగాలు చితికిపోయినా పర్వాలేదు, అసంఖ్యాకులైన ప్రజల ఉపాధి అవకాశాలు ఊడ్చుకుపోయినా పర్వాలేదు తాము మాత్రం బడా కార్పొరేట్ల సేవలోనే తరిస్తామనే తీరున వ్యవహరిస్తున్న మోడీ సర్కారుకు ఇంకా అవకాశమిస్తే మిగిలేది ఉపాధి రహిత భారతమే..!