Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో నేడు విభజన రాజకీయాలు విజృంభిస్తున్నాయి. కుల మతాలకు, ఆచారాలు ఆహార అలవాట్లకూ మధ్య ఉన్న సంబంధాలను అడ్డుపెట్టుకుని ప్రజలను నిలువునా చీల్చే కుట్రలు మిన్నంటుతున్నాయి. ఈ విషపుటెత్తుగడలకు ఉత్తరప్రదేశ్ వేదికయ్యింది. మఠం నుంచి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన యోగి ఆధిత్యనాధ్ ఎంతో చారిత్రిక, సాంస్కృతిక వారసత్వం ఉన్న అలహాబాద్జిల్లా పేరును ప్రయాగ రాజ్గా, ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్యగా మార్చేశారు. అంతటితో ఆగకుండా ప్రయాగ్రాజ్, అయోధ్యలలో మద్యం, మాంసాలను నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ 'అయోధ్యలో మద్య మాంసాలను భుజించడం రామునికి అవమానం' అని మంత్రి శ్రీకాంత్ శర్మ శెలవిచ్చారు. ఇప్పటికే మధురలో మద్య మాంస నిషేధం ఉంది. ఇప్పుడు మరింతగా విస్తృత పరిచేందుకు యోగి ప్రభుత్వం సిద్ధమయ్యింది.
మన దేశంలో ఆహారపు అలవాట్లు కుల - ప్రాంత ఆధారితాలు. మాంసాన్ని భుజించడం అన్నది ఆయా కుల-ప్రాంతాల సంస్క ృతిలో భాగమై ఉంటుంది. దేశంలోని ఒకటి, రెండు కులాలు తప్ప మిగిలిన అన్ని కులాలు, మతాలకు సంబంధించిన ప్రజలు మాంసాన్ని భుజిస్తారు. అలాగే కొన్ని ప్రాంతాలలో మాంసాన్ని భుజించని కులస్తులు మరికొన్ని ప్రాంతాలలో భుజిస్తారు. అలాగే, అన్ని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు చెందిన వ్యక్తులందరు కూడా అన్ని రకాల మాంసాన్ని భుజించరు. కాగా, హిందూ సాంప్రదాయంలో కూడా రాముడు, కృష్ణుడికి చెందిన కులస్తులుగా చెప్పుకునేవారు కూడా మాంసాన్ని భుజిస్తారు. కానీ, ఆ ఆలయాలలోని పూజారులు మాత్రం మాంసాన్ని భుజించరు! మరి, మాంసాహారాన్ని భుజించే కులాలలో పుట్టిన రాముడు, కృష్ణుడి జన్మస్థానాలలో మాంసాన్ని భుజించడం వారిని అవమానపరచడం ఎలా అవుతుంది? అలా నిర్భంధిస్తే, మాంసాహారాన్ని భుజించే కులాలు, మతాలకు చెందిన ప్రజలకు ఆ ప్రాంతాలలో నివాసయోగ్యత ఎలా ఉంటుంది? నూటికి కనీసం 95శాతం మాంసాహారులు, వేల కొలది పవిత్ర స్థలాలూ ఉన్న మనదేశంలో అక్కడ మాంసాహారాన్ని నిషేధిస్తే ప్రజలకు నివాస స్థలమెక్కడీ
భౌతిక సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు భావోద్వేగ సమస్యలను సృష్టించడం తప్ప ఈ నిర్ణయాల వెనుక మరొకటి లేదు. తిండిలేక అల్లాడుతున్న ప్రజలపై ఏ తిండి తినాలన్న సమస్య రుద్ధడం అంటే, ఇది తమ ఆర్ధిక, ఆధ్యాత్మిక దోపిడీని నిరాటంకంగా కొనసాగించే దుర్భుద్ధి తప్ప మరొకటి కాదు. దేశంలో ఆర్థిక - ఆధ్యాత్మిక దోపిడీ దారులు ఒక్క శాతంకన్నా అధికంగా ఉండరు. ఈ ఒక్క శాతం దోపిడీ దారులను శాశ్వతంగా కాపాడేందుకు 99శాతం ప్రజలను విభజించే విద్వేష రాజకీయాలు ఇప్పుడు యధేచ్ఛగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో సాగుతున్న ఈ విద్వేష రాజకీయాలను విపక్షాలు అటుంచి, అధికార పార్టీ, మిత్రపక్షాలు సైతం భరించలేకపోతున్నాయి. ముస్లీం పేర్లతో ఉన్న అలహాబాద్, ఫైజాబాద్ల పేర్లు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాక్ష్యాత్తూ యోగి మంత్రి వర్గంలోని మిత్రపక్షం ఎస్బీఎస్పీకి చెందిన ఓమ్ ప్రకాష్ రాజ్బర్ 'మీ పార్టీలో ఉన్న ముస్లీం నేతల పేర్లు కూడా మార్చుతారా?' అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు.
సెక్యులర్ పార్టీలుగా చెప్పుకుంటున్న పార్టీల నేతల చర్యలు సైతం మతతత్వ పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ నేతల చర్యలకు భిన్నంగా లేకపోవడం భీతిగలిగిస్తోంది. తాము సిసలైన సెక్యులర్గా చెప్పుకునే కాంగ్రెస్ అధినేత రాహూల్ గాంధీ గుళ్ళు గోపురాలు తిరగడం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాళికాదేవి పూజాకార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించి, దాన్ని ప్రభుత్వ టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయడం, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో స్వామీజీకి సాష్టాంగ ప్రణామం చేయడమే కాకుండా, ముఖ్యమంత్రి కుర్చీపై మొదట స్వామిజీని కూర్చోబెట్టి తరువాత తాను కూర్చోవడం లాంటి చర్యలు హిందూ మతోన్మాద దుశ్చర్యలకు మరింతగా ఆజ్యం పోస్తున్నాయి. 'ఏ మతాన్నీ ప్రోత్సహించకు - ఏ మతంపై వివక్ష చూపకు' అన్న మన రాజ్యాంగానికి ప్రాణప్రదమైన లౌకిక సూత్రానికి సమాధికడు తున్నాయి. అధికారం పార్టీల చేతులు మారినా ఈ లౌకిక వ్యతిరేక చర్యలు మాత్రం ఆగవన్న సందేహాలకు తావిస్తున్నాయి. అలాగే, మత సంబంధిత విషయాలలో మీడియా, పోలీసుల తీరుతెన్నులు కూడా అనేక సందర్భాలలో లౌకికరాజ్య భావనకు పూచీపడేలా లేకపోవడం మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
కేంద్ర పాలకులు 'మతం-ప్రభుత్వం-ఆర్థికం' ఈ మూడింటిని కలాగాపులగం చేస్తున్నారు. గుప్పెడు మంది ఆర్థిక, ఆధ్యాత్మిక దోపిడీ దారుల కోసం కోట్లాది ప్రజలను ఆర్థికంగా కొల్లగొడుతూ ఆధ్యాత్మిక బానిసత్వంలోకి నెడుతున్నారు. ఈ నేపథ్యంలో పేదల పక్షపాత, కర్మ సిద్ధాంత రహిత భావజాలం మాత్రమే ప్రజలను రక్షించగలదు. అలాంటి భావజాలం కలిగిన శక్తులను బలోపేతం చేసుకోవడంలోనే దేశ భవిష్యత్ దాగి ఉంది.