Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యుద్ధానికి, రాచరికానికి వ్యతిరేకంగా జర్మన్ కమ్యూనిస్టులు చేసిన తిరుగుబాటు సరిగ్గా 100ఏండ్ల క్రితం 1918 నవంబరు 9న శిఖరాగ్రానికి చేరింది. దానితో పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదులలో ప్రకంపనలు చెలరేగాయి. 1918 ఆరంభం నుంచి అణచివేతలతోను, క్రూర సెన్సార్షిప్తోను, విప్లవ నేతలను నిర్బంధిచటంతోను యుద్ధానికి వ్యతిరేకంగా కార్మిక వర్గ ప్రతిఘటనను జర్మన్ ఇంపీరియల్ ప్రభుత్వం నిలువరించలేకపోయింది. పశ్చిమ సరిహద్దులో మూడున్నరేండ్ల పాటు సాగిన నరమేధం, సైనిక అపజయాలు ఒక విప్లవకర సంక్షోభానికి దారితీశాయి.
చాలా ప్రాంతాలలో ఆహార సరఫరా దాదాపు పతనం అయింది. 1914 నుంచి యుద్ధ ఉత్పాదనలు నాటకీయంగా పెరిగినప్పటికీ 1917 సంవత్సరాంతానికల్లా పారిశ్రామిక ఉత్పత్తి యుద్ధ పూర్వస్థితితో పోల్చినప్పుడు 47శాతం మాత్రమే ఉన్నది. వ్యవసాయోత్పత్తి 60శాతం పడిపోయింది. కరువు పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం చివరి నెలల్లో ప్రాణనష్టం విపరీతంగా జరిగింది. అంటువ్యాదులు వ్యాపించాయి. మొదటి ప్రపంచ యుద్ధం అప్పటికి నాలుగేండ్లుగా కొనసాగుతూ ఉంది. అంతిమంగా యుద్ధం 1918 నవంబరు నెలలో ముగిసింది. ప్రపంచ వ్యాప్తంగా ఒక కోటి మంది ప్రజలు యుద్ధంలో తమ ప్రాణాలు కోల్పోయారు. రెండు కోట్లమంది సైనికులు క్షతగాత్రులయ్యారు. అదనంగా 70లక్షలమంది పౌరులు సమిధలయ్యారు.
రష్యాలో బోల్షివిక్కుల నాయకత్వాన కార్మిక వర్గం 1917 అక్టోబరు నెలలలో అధికారంలోకి వచ్చింది. అక్టోబరు మహా విప్లవ విజయం సహజంగానే జర్మన్ కార్మిక వర్గాన్ని ఉత్తేజపరిచింది. ప్రపంచ యుద్ధ నరమేధం జరుగుతుండగానే పెట్టుబడిదారీ వ్యవస్థకు దోపిడీ, యుద్ధంలేని మరో ప్రపంచాన్ని స్థాపించటం సాధ్యమేనని రష్యన్ విప్లవం నిరూపించింది.
1918లో బెర్లిన్లో నాలుగు లక్షలమందితో ఒక ప్రదర్శన జరిగింది. అది విల్హెల్మ్ పాలన అంతానికి ఆరంభం అని '1918' పేరుతో రాసిన గ్రంధంలో జోచిమ్ కాప్పనర్ అన్నాడు. 1918 సంవత్సరం ఆగస్టు-అక్టోబర్ నెలల మధ్యకాలంలో పరిస్థితి మరింతగా క్షీణించింది. యుద్ధంలో చవిచూచిన ఓటమిని ఇతరులపై నెట్టే ప్రభుత్వ ప్రయత్నం పూర్తిగా విఫలమయింది. ఈ క్రమంలో ప్రభుత్వం అనేక పొరపాట్లు చేసింది. యుద్ధ ప్రభావం కారణంగా కకావికలయిన రాచరిక పాలన కార్మికవర్గ దాడితో పేకమేడలా కూలిపోయింది. కైజర్ విల్హెల్మ్-2 తన పదవి నుంచి వైదొలగినట్టు 1918 నవంబరు 9న ఉదయం అప్పటి జర్మన్ చాన్స్లర్ మాక్స్ వాన్ బాడెన్ ప్రకటించాడు. అదేరోజు మధ్యాహ్నంకల్లా ఆయన తన పదవిని సోషల్ డెమోక్రాట్ ఫ్రెడిరిక్ ఎబర్ట్కు బదిలీ చేశాడు. మధ్యాహ్నం తరువాత సమయంలో అనేక వేల ప్రజల సమక్షంలో ఎస్పీడీ సభ్యుడు ఫిలిఫ్ స్కైడ్మన్ బెర్లిన్ సిటీ ప్యాలస్ బాల్కనీ నుంచి డెమోక్రాటిక్ రిపబ్లిక్ను ప్రకటించాడు. ఆ తరువాత కొంచం సేపటికి వామపక్ష స్పార్టకస్ లీగ్ నాయకుడు కార్ల్ లీబ్నెక్ట్ పొరుగునున్న లస్ట్గార్టెన్లో సోషలిస్టు రిపబ్లిక్ను ప్రకటించాడు.
మరుసటి రోజు ఎస్పీడీ చైర్మన్ ఎబర్ట్ 'కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్' పేరుతో ఒక నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. యావత్ జర్మనీని కుదుపుతున్న విప్లవ కెరటాన్ని అణచివేసే పనిని ఈ ప్రభుత్వం చేపట్టింది. ఒకవైపు కార్మిక వర్గానికి, ఫ్రైకార్ప్స్ అనే విప్లవ ప్రతీఘాత శక్తులకు మధ్యన, మరోవైపు ఎబర్ట్ ప్రభుత్వానికి, కార్మిక వర్గానికి మధ్య జరుగుతున్న ఘర్షణలు బహిరంగ అంతర్యుద్ధంగా మారాయి. యుద్ధం ఆరంభం నుంచి ఎస్పీడీ చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా పనిచేసిన కార్ల్ లీబ్నెక్త్, రోజా లంక్జెంబర్గ్లు ముందుగా 'గ్రూప్పె ఇంటర్నేషనల్'ను, ఆ తరువాత 'స్పార్టకస్బున్ద్'ను స్థాపించారు. ఈ సంస్థల స్థాపన తరువాత మహత్తర విప్లవ పోరాటాల మధ్యన 1918-1919 ఆరంభంలో జర్మన్ కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. ఆ తరువాత రెండు వారాలకు 1919 జనవరి15న నోస్కె నాయకత్వంలోని ఫ్రైకార్ప్ విప్లవ ప్రతీఘాత శక్తులు రోజాలక్జెంబర్గ్, లీబ్నెక్త్లను బంధించి హత్య చేశారు. ఆవిధంగా ప్రతీఘాత విప్లవం విజయవంతం అయింది. బెర్లిన్, ఇతర పారిశ్రామిక ప్రాంతాలలో కార్మికులకు వ్యతిరేకంగా క్రూరమైన హింస జరిగింది. వేలాది విప్లవకారులు హత్యకు గురయ్యారు.
ఆవిధంగా ఒక కార్మికవర్గ విప్లవం సోషల్ డెమోక్రసీ చేత క్రూరంగా అణచబడింది. జర్మన్ విప్లవ పరాజయం వినాశకర పర్యవసానాలకు దారితీసింది. జర్మన్ విప్లవ పరాజయంతో సోవియట్ యూనియన్ ఒంటరి అయింది. అలాగే 1933లో కేపీడీ(జర్మన్ కమ్యూనిస్టు పార్టీ) ఐక్యసంఘటనకు మద్దతు ఇవ్వకపోవటంచేత హిట్లర్ అధికారంలోకి వచ్చాడు. 1918 నవంబర్ విప్లవం ఓటమిని చవిచూసిన తరువాత 100ఏండ్లకు జర్మనీలోను, అంతర్జాతీయంగాను కార్మిక వర్గం అవే సవాళ్ళను ఎదుర్కొంటున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థలో సుధీర్ఘకాలంపాటు నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో తీవ్రతరమౌతున్న సామాజిక అసమానతలు, వాణిజ్య యుద్ధం, యుద్ధంవంటి 20వ శతాబ్ద అపరిష్క ృత సమస్యలు తిరిగి పునరావృతం అయ్యాయి. సోషలిజంలో జీవించుటయా లేక ఆటవిక సమాజంగా కొనసాగుటయా అనే సమస్య తిరిగి మానవాళిముందుకు వచ్చింది!