Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధనురాశి నుంచి మకరరాశిలోకి సూర్యుడి ప్రయాణంతో హేమంతం వికసిస్తుంది. ఈ ప్రక్రియలో మేనుపై నులివెచ్చని కిరణాలు పడి ఒంటికి నూతన సత్తువ వస్తుంది. ఆ సూర్యరశ్మితో శరీరమూ పులకరిస్తుంది. ప్రకృతిలో కలిగే ఈ మార్పుల వలే జీవిత గమనంలో కూడా చీకటి నుంచి వెలుగులోకి, ఓటమి నుంచి గెలుపులోకి, బాల్యం నుంచి యవ్వనంలోకి ప్రయా ణం అనివార్యమవుతుంది. అందుకే 'ఉప్పెనలో తలవొగ్గక నిలువుగ ఉబి కొచ్చేదే జీవితం.. ఓటమిలో నిట్టూర్చక రివ్వున ఉరికొచ్చేదే జీవితం' అంటారు సినారే. విద్యార్థులైనా, ఉద్యోగులైనా, వ్యాపా రులైనా ఎవ్వరైనా తను నివసించే ప్రాంతం నుంచి చేరవల్సిన చోటుకి రోజూ ప్రయాణించాల్సిందే. ఉరుకులు పరుగులే వారి నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. రైళ్లల్లో, బస్సుల్లో, ఇతర వాహనాల్లో అత్యధిక సమయం గడిపేస్తున్న పరిస్థితి. ఈ వేగంలో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చివరకు గమ్యం చేరుకుంటారు. అందుకే ప్రయాణం ఒక్కోసారి శ్రమతో కూడుకున్నదే. శ్రమలేకుండా అది సాధ్యపడదు. అయితే అందులో అవసరమైన ప్రయాణాలెన్ని? అక్కరకు రానివెన్ని? అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. నేడు ప్రతి మనిషికి ప్రయాణం ఓ అనివార్యమైన అవసరం. ఎందుకంటే ప్రతి ప్రయాణానికీ ఓ ప్రయోజనం ఉంటుంది. అనవసరపు ప్రయాణాలు మన ఆలోచనాశక్తిని తగ్గిస్తాయి. తరచూ అలా ప్రయాణించడం వల్ల మనోశరీరాలూ త్వరగా అలసిపోతాయి. యాదృశ్చికంగానే అతిగా నిద్రించేందుకు ప్రేరేపిస్తాయి. దీంతో ఆ వ్యక్తిలో సృజనాత్మకత, విశ్లేషణాత్మకత, ఆలోచనాశక్తి, నైపుణ్యత సన్నగిల్లుతుంది. మరోవైపు సామాన్యులకు ప్రయాణాలు అదనపు భారం. అందుకే వీలైనంత తక్కువగా ప్రయాణాలుండాలి. మనసుతో చెలిమి చేస్తే ప్రయాణాలను కొంతమేర తగ్గించుకోగలం. అలా ఆదా చేసిన సమయాన్నీ ఇతర కార్యాచరణకు వినియోగించుకోగలం. అవకాశమే ఉంటే పనిచేసే ప్రాంతానికైనా, విద్యాలయానికైనా సమీపంలో నివసిస్తూ ఈ ప్రయాణ ప్రహసనానికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. కానీ ఆధునిక మనిషికి ప్రతి నిమిషం పరుగెడితేనే ప్రాణం నిలుస్తుంది. ఆ పరుగుకూ, ప్రయాణానికీ ఓ ప్రయోజనం ఉంటుంది. ఉండాలి కూడా. ఇది గ్రహించగల్గితే ప్రతి ప్రయాణం లక్ష్యాలను సాధించడమే కాదు.. బతుకునూ పండిస్తుంది.
ఎవరైనా తన ప్రయాణ సమయంలో సౌహార్ధం ఉండాలనుకుంటారు. గంటలకొద్దీ ప్రయాణంలో కాస్తయినా కాలక్షేపం కోరుకుంటారు. లేదా తనతో మనసు విప్పి మాట్లాడేవారు ఉంటే బాగుండనుకుని ఉబలాటపడుతుంటారు. అందుకే ప్రయాణ సమయంలో ఎదురయ్యే వ్యక్తులు చిరకాలం మంచి మిత్రులుగా ఉండిపోతుంటారు. తనతో ప్రయాణిం చేది కొన్నిగంటలే అయినా జీవితాంతం అది గుర్తుండిపోతుంది. 'ప్రయాణం అంటేనే అదో వింత సరదా. మనసులోన పొంగిపొరలే జ్ఞాపకాల వరద' అని ఓ కవి నిర్వచిస్తాడు. ఈ ప్రయాణంలో ఏవేవో జ్ఞాపకాలు మనసును అలా తాకి గాలి స్పర్శకి అలా జారిపోతుంటాయి. ఎదుటివారి స్నేహపూర్వక సంభాషణలు, రకరకాల మనస్తత్వాలూ, మంచీచెడూ ఎన్నో పరస్పర విరుద్ధ లక్షణాలు అనుభవంలోకి వస్తుంటాయి. దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వాలపై ప్రజల అభిప్రాయాలు వగైరా అమూల్య ప్రశ్నలకు ప్రయాణం సమాధానమివ్వగలదు. ఇలా ప్రయాణికుల మధ్య జరిగే చర్చోపచర్చలు ఇద్దరి మధ్య అనూహ్య పరిచయానికి బాటలు వేస్తుంది. తీరా గమ్యం చేరాక చెరోదారిన వెళ్లిపోయినా ఆ స్నేహబంధం సామాజిక మాధ్యమాల్లోనో, ఫోన్ల ద్వారానో కొనసాగుతూ ఉంటుంది. ఆ జర్నీలో మిగిలే జ్ఞాపకాల దొంతరలు సదా వారిని పలకరిస్తూనే ఉంటాయి. స్నేహాన్నీ, గతానుభవాన్నీ తట్టిలేపుతుంటాయి. ఒకవిధంగా మనతో కదిలే దృశ్యం మనకు తెలీకుండానే ప్రయాణాన్ని అలంకరిస్తుంది. పల్లెలు, పట్టణాలు, స్టేషన్లు గుర్తుండకపోయినా ప్రయాణం ఇచ్చిన అనుభూతి మాత్రమే నిలిచిపోతుంది. అందుకే ప్రయాణానికి అనుభూతే ప్రాణం. అయితే ప్రయాణ లక్ష్యం గమ్యం ఒక్కటే కాదు ఓ ఆశయం కూడా అయ్యుండాలి.
కొన్ని ప్రయాణాలు జీవితంలో మరువలేని మధురానుభూతులను పంచుతాయి. మరికొన్ని దు:ఖాన్నీ, ఇంకొన్ని విషాదాన్నీ మిగులు స్తాయి. అందుకే జీవిత ప్రయాణం సుదూరం. సులువైంది కాదు. ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. పోతుంటాయి. కానీ ఒంటరి ప్రయాణంలోనే మనల్ని మనం బాగా అర్థం చేసుకోగలం. ఆ ప్రయాణంలో రేకెత్తే ఆలోచనలు, గత జ్ఞాపకాలు భవిష్యత్కు దిక్సూచిగా మారుతాయి. మనకు తోడెవ్వరూ లేరనీ, ఇక ఈ ప్రయాణంలో ఎంత అలుపోననీ మదనపడకుండా లక్ష్యంవైపే ఆలోచించాలి. సైనికుడు తన యుద్ధ ప్రయాణంలో ఎటువైపు నుంచి ప్రమాదం పొంచి ఉంటుందోనని తుపాకీతో సిద్ధంగా ఉంటాడు. ఎప్పటికప్పుడు తన దృష్టిని శత్రు సంహారంపైనే సారిస్తుంటాడు. గగనతలంలో ఉన్న పైలెట్ వాతా వరణ పరిస్థితులు మారుతున్నా మేఘాలను చీల్చుకుంటూ విమానాన్ని ముందుకు నడుపుతుంటాడు. వందల మంది ప్రాణాలను సురక్షితంగా గమ్యాలకు చేరవేస్తాడు. అలాగే నిజజీవితంలో ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు, సంఘర్షణలు ఎదురవుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు ఎత్తుపల్లాలను సరిచేసుకుంటూ జీవన ప్రయాణ పద్ధతి మార్చుకుని.. నూతన సంవత్సరాన ఉత్సాహభరితంగా.. ఎంతో ఉల్లాసంగా ప్రయాణిద్దాం. అలా ముందుకు కదులుదాం..!