Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వందేండ్ల క్రితం1919 జనవరి15న బెర్లిన్లో ఇద్దరు కమ్యూ నిస్టు విప్లవ యోధులు హత్యకు గురయ్యారు. పర్యవసానంరీత్యా చూసినప్పుడు ప్రపంచ చరిత్రలో జరిగిన భయంకరమైన హత్యలలో అవి కూడా ఉంటాయి. ఆ రోజు సైనికులు అంతకు రెండు వారాల ముందే స్థాపించ బడిన జర్మన్ కమ్యూనిస్టు పార్టీ(కేపీడి) నాయకు లైన రోజా లక్సెంబర్గ్, కార్ల్ లీబ్నెక్ట్లను అరెస్టు చేశారు. 48సంవత్స రాల రోజా లక్సెంబర్గ్ ఆ శకంలో అత్యం త ప్రతిభా వంతురాలైన మార్క్సిస్టు విప్లవకారిణి. ఎడ్వర్డ్ బెర్న్స్టైన్ రివిజని జాన్ని, సోషల్ డెమోక్రాట్ల మొదటి ప్రపంచ యుద్ధ అనుకూల విధానాలను సైద్ధాంతికంగా ఆమె చీల్చిచెండాడిన తీరుతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టులకు ప్రీతిపాత్రమైంది. ఎస్పిడి విప్లవ విభాగానికి, ఆ తరువాత స్పార్టకస్ లీగ్ కి ఆమె తిరుగులేని సైద్ధాంతికవేత్త అయింది. జర్మన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఎస్పీడీ నిర్మాతయైన విల్హెల్మ్ లీబ్నెక్ట్ తనయుడే కార్ల్ లీబ్నెక్ట్. ఆయన, రోజా సమవయస్కులు. వీరిద్దరూ యుద్ధోన్మాదంమీదా, మిలిటరిజంమీదా రాజీలేని పోరాటం చేశారు. అత్యంత అణచివేత ఉన్నప్పటికీ ఎస్పీడీ పార్లమెంట్ సభ్యుడిగా యుద్ధాన్ని వ్యతిరేకించి, యుద్ధ పద్దులను తిరస్క రించటం ద్వారా తన పార్టీమీదనే కార్ల్ లీబ్నెక్ట్ నిశ్చయాత్మకమైన పోరాటం చేసి కోట్లాది కార్మికుల మన్ననలను పొందాడు. 1918లో జర్మనీలో సంభవించిన నవంబరు విప్లవంలో ఆయన పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయటానికి పోరాటం చేశాడు. నవంబరు 9వ తేదీన ఒక ప్రజా ప్రదర్శన ముందు ఆయన ఫ్రీ సోషలిస్టు రిపబ్లిక్ ఆఫ్ జర్మనీని ప్రకటించాడు. అరెస్టు అయిన తరువాత రోజాను సైనికులు హోటల్ ఈడెన్కు తీసికెళ్ళారు. ఆ హౌటల్ రిసెప్షన్ హాలులో రైఫిల్ మడిమతో మోదటంతో బక్కపలచగా ఉండే రోజా కుప్పకూలింది. అలా పడిపోయిన రోజా ను ఒక కారులోకి తీసుకొచ్చి కాల్చి చంపారు. ఆ తరు వాత ఆమె మృతదేహాన్ని లాండ్వేర్ కాలువలోకి విసిరి వేశారు. అలా విసిరివేయబడిన ఆ విప్లవకారిణి మృతదేహాన్ని నెలల తరువాత బయటకు తీయటం జరిగింది. అలాగే కార్ల్ లీబ్నెక్ట్ని టియర్గార్టెన్ పార్క్లో సమీపంలోనుంచి మూడుసార్లు కాల్చి చంపారు. పారిపోతున్న కార్ల్ లీబ్నెక్ట్ని కాల్చిచంపటం జరిగిందని, రోజాను కోపోద్రిక్తులైన ప్రజాసమూహం తొక్కి చంపిందని మీడియాలో వార్తలు వచ్చాయి. రోజా, లీబ్నెక్ట్ల కిరాతక హత్యలతో ప్రతీఘాత విప్లవ హింస ఒక నూతనదశకు చేరుకుంది. అంతకు ముందు 1871లో పారిస్ కమ్యూన్ పరాజయం తరువాత జరిగినట్టుగా బూర్జువా రాజ్యం సోషలిస్టులను, విప్లవకారులైన కార్మికులను సామూహికంగా హత్యలు చేసింది. అయితే ఒక విప్లవ పార్టీ నాయకులను ఎటువంటి విచారణ లేకుండా, కోర్టు తీర్పు లేకుండా రాజ్యాంగయంత్రాంగం హత్య చేయటం సరికొత్త విషయం. తరువాత ఇతరులు దీనిని ఉదాహరణగా తీసుకుని అనుసరించారు. రష్యాలో జారిస్టు నియంతలు కూడా సోషలిస్టులను సాధారణంగా సైబీరియాకు ప్రవాసం పంపేవారు. అయితే రష్యాలో విప్లవం విజయం సాధించటంలో కర్తృత్వ కారకాలయిన లెనిన్ పాత్ర, బోల్షివిక్ పార్టీ పటిమలు ప్రధాన పాత్రవహించాయని జర్మన్ పాలకవర్గం గ్రహించింది. రష్యాలోవలే పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయటానికి నవంబరులో జర్మనీ వ్యాప్తంగా చెలరేగిన విప్లవ జ్వాలలను ఆర్పటానికి రోజా, లీబ్రెక్ట్లను హతమార్చాలని జర్మన్ పాలకవర్గం భావించింది. విప్లవ ప్రభావంతో హౌహెన్జోల్లర్న్ పాలన అంతమైంది. అయితే ఆ పాలనకు సామాజిక పునాదిగా ఉన్న పారిశ్రామిక, ద్రవ్య పెట్టుబడిదారులు, బడా భూస్వాములు, మిలిటరీ, ప్రగతి నిరోధక న్యాయవ్యవస్థ, పోలీసు, పాలనా యంత్రాంగం అంతా తమ సామాజిక అంతస్తును రక్షించుకోవటానికి కృతనిశ్చయులై ఉన్నారు. అందుకోసం ఎస్పీడీ నాయకుడైన ఫ్రెడ్రిక్ ఎబర్ట్తో 1918వ సంవత్సరం నవంబరు 9వ తేదీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించారు. ఆ తరువాత విప్లవాన్ని అణచివేయటానికి ఎబర్ట్ సైన్యంతో మిలాఖత్ అయ్యాడు. ఆ విధంగా మొదటి విప్లవ కెరటం కౄరంగా అణచివేయబడింది. అయితే అది ఏ వర్గం పరిపాలించాలనే విషయాన్ని తేల్చలేకపోయింది. ఎస్పీడీ ద్రోహాన్ని అధిగమించటానికి 1919 ఆరంభంలో కేపిడీని స్థాపించటం జరిగింది. ఆ పార్టీ కార్యక్రమాన్ని రోజా లక్సెంబర్గ్ రూపొందించింది. బూర్జువావర్గ పాలనను అంతమొం దించటమే కార్యక్రమంగా కేపీడీని నిర్మించటం జరిగింది. మనముందున్న ప్రత్యామ్నాయం సంస్కరణా లేక విప్లవమా అన్నది కాదు. మనం తేల్చుకోవలసింది సోషలిజమా లేక ఆటవిక పాలనా అనేదేనని కేపీడీ కార్యక్రమం ప్రకటించింది. 14ఏండ్ల తరువాత జర్మనీలో ఫాసిజం అధికారంలోకి రావటంతో 1945వ సంవత్సరం దాకా పెట్టుబడిదారీ వ్యవస్థలోగల వైరుధ్యాల వల్ల ప్రపంచ చరిత్రలో ఎన్నడూ జరగని హింస జరిగింది. అలా రోజా చేసిన హెచ్చరిక నిజమైంది. రోజా లక్జెంబర్గ్, కార్ల్ లీబ్నెక్ట్లు హతులైన తరువాత వందేండ్లకు కూడా అంతర్జాతీయ సంబంధాలలో జాతీయవాదం, వాణిజ్య యుద్ధాలు, యుద్ధాల రూపంలో హింస ఎక్కువ అయింది. అనేక దేశాలలో మితవాద, ఫాసిస్టు శక్తులు విజృంభిస్తున్నాయి. ఇది రోజా, లీబ్నెక్ట్ల త్యాగమయ జీవితాల ప్రాసంగితను తెలియజేస్తుంది. 1918లో రోజా అన్నట్టుగా నేడు ప్రపంచం తేల్చుకోవలసింది సోషలిజమా లేక ఆటవిక పాలనా అనేదే.