Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవినీతి నిర్మూలనపై ప్రధాని మోడీ మాటలు ఉత్తుత్తి గాండ్రింపులేనని తేలిపోయింది. గత ఎన్నికల్లో తనకు అధికారం కల్పిస్తే లోక్పాల్ (పౌర విచారణాధికారి) వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేస్తానన్నారు మోడీ. మళ్లీ ఎన్నికలొస్తున్నా ఇప్పటివరకు అతీగతీ లేదు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప కేంద్రప్రభుత్వం కండ్లు తెరవని దుస్థితి. ఇకనైనా లోక్పాల్ వ్యవస్థ ఏర్పాటుకు ఫిబ్రవరి ఆఖరులోగా సెలక్షన్ కమిటీకి పేర్ల జాబితా సమర్పించాలని గతవారం మోడీ సర్కార్కు సుప్రీంకోర్టు ఫైనల్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతున్న జాప్యానికి నిదర్శనం. లోక్పాల్ అధ్యక్ష, సభ్యుల పదవులకు వడపోసిన పేర్ల జాబితా ఎంపికల సంఘానికి సమర్పించాలని సెర్చ్ కమిటీని ఆదేశించింది. గతేడాది ఫిబ్రవరి నుంచీ లోక్పాల్ గురించి న్యాయస్థానం అడుగుతున్నా కేంద్రం పట్టించుకుంటే కదా! సెర్చ్ కమిటీ కూడా జోక్యం చేసుకోవాల్సి రావడం విచారకరం. అవినీతి నిర్మూలనలో మోడీ సర్కార్కు ఎంత నిబద్ధత ఉందో ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు! తన పాలనలో కోట్ల రూపాయల సొమ్మును దగ్గరుండి అవినీతిపరులకు పంచేసి మళ్లీ అధికారమిస్తే దేశాన్ని అభివృద్ధిపథాన పరుగెత్తిస్తానని కాకమ్మ కబుర్లు చెప్పడం ఎవరిని నమ్మించడానికి? రాఫెల్ వంటి కుంభకోణాలు బయటపడతాయన్న భయంతోనే లోక్పాల్ నియామకానికి చొరవ చూపలేదన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడే కాదు..గుజరాత్ సీఎంగా ఉన్నకాలంలోనూ కోర్టు ఆగ్రహిస్తే తప్ప లోకాయుక్త ఏర్పాటుకు మోడీ నడుం బిగించలేదు.
లోక్పాల్ కోసం వామపక్షాలు, అన్నాహజారే, కేజ్రీవాల్, తదితర మేధావులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. 40 ఏండ్ల పోరాట ఫలితంగా 2011 డిసెంబర్ 27న లోక్పాల్ బిల్లు లోక్సభ ఆమోదం పొందింది. 2013 డిసెంబర్ 17న రాజ్యసభ ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదముద్రతో 2014 జనవరి ఒకటో తేదీన లోక్పాల్, లోకాయుక్త చట్టంగా ఏర్పడినా అమలులోకి రాలేదు. ప్రధాని సహా దేశంలోని అత్యున్నత స్థానాలలో గలవారిపై అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేయడానికి ఉద్దేశించిన లోక్పాల్ వ్యవస్థకు ఇంతవరకు నియామకాలు జరగకపోవడం పాలకుల అవకాశవాదాన్నే ఎత్తి చూపుతున్నది. దేశభద్రతకు సంబంధించిన ఇంతటి ముఖ్యమైన పనికి సమయం లేదనుకోవాలా? సీబీఐ, ఆర్బీఐ వంటి స్వతంత్ర సంస్థలను పనిచేయనీయకుండా అడ్డుకుంటున్న కాషాయ ప్రభుత్వానికి లోక్పాల్ను నియమిస్తే తన పప్పులుడక వనే వెనుకడుగు వేసిందనుకోవాలా? గతం కంటే అనేక కుంభకోణాల్లో కూరుకున్న కాషాయ ప్రభుత్వానికి ఆ ధ్యాస ఉంటుందను కోవడం అత్యాశే!
తాను అవినీతికి పాల్పడనని అలాగే ఎవరు పాల్పడినా సహించననీ 2014 ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన మోడీ ఆ తర్వాత అందుకోసం ఆయన చేసిందేమీ లేకపోగా అందుకు భిన్నంగా అవినీతి పరులకు కొమ్ముగాయటం అందరం చూసాం. అంతేకాదు, ఈ కాలంలో లోక్పాల్ కోసం కృషి చేయకుండా అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలను, ఉన్న చట్టాలను నీరుగార్చడంలో మాత్రం ముందున్నారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానమైన నీకిది..నాకది (క్విడ్ప్రొకో) వికత విన్యాస ప్రదర్శనలో గత పాలకులను ప్రస్తుత ప్రభుత్వం మించిపోయింది. అవినీతికి వ్యతిరేకంగా ఉన్న మూడు కీలక బిల్లుల స్వరూపాన్ని మార్చడానికి ఏ మాత్రం సంశయించని ప్రభుత్వం ప్రజాధనం పరులపాలు గాకుండా ఉండేందుకు రక్షణగా నిలిచే లోక్పాల్ వ్యవస్థను మాత్రం ఇంతకాలం ఏర్పాటు చేయలేదు.
నిబంధనల ప్రకారం లోక్పాల్ చైర్ పర్సన్ పదవికి కనీసం ఐదుగురిని, ఒక్కో సభ్యత్వ ఖాళీకి తక్కువతక్కువగా ముగ్గురేసి మందిని సెర్చ్ కమిటీ గుర్తించి ఎంపికల సంఘానికి సిఫారసు చేయాలి. సెలక్షన్ కమిటీలో లోక్సభ స్పీకర్, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో జడ్జి సభ్యులుగా ఉంటారు. వేలు వంకరంటే. ముక్కు వంకర అన్న రీతిలో లోక్పాల్ ఏర్పాటుకు కేంద్రం అనేక సాకులు చూపడం నీతిమాలిన రాజకీయాల ఫలితమే! ప్రతిపక్ష నాయకుడి హౌదాలో లోక్సభలో ఎవరూ లేరు కనుక కమిటీ సమావేశాలు సవ్యంగా జరగడం లేదనీ, సెర్చ్ కమిటీకి ప్రాథమిక సౌకర్యాలు లేవనీ కోర్టుకు చూపడం సాకు గాక మరేంటి? కాంగ్రెస్పార్టీ తరపున నియమించిన వ్యక్తిని ప్రతిపక్ష నాయకుడిగా పరిగణించవచ్చు. ప్రతిపక్ష నేత లేని కారణంగా లోక్పాల్ నియామకం వాయిదా పడకూడదని 2017లో కోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్నా మోడీ సర్కార్ మీన మేషాలే లెక్కిస్తూ వచ్చింది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిం చిందెక్కడీ కోర్టే చెప్పినందున నెలన్నర రోజుల్లో ఈ అన్వేషణ పూర్తయి జాబితా సిద్ధం చేస్తుందా? చెత్తబుట్టలో వేస్తుందా? అన్నది చూడాలి. ఇప్పటికే అనేక రాజ్యాంగ సంస్థలను ఆర్ఎస్ఎస్ వారితో నింపేసి కలుషితం చేసిన కేంద్రం నిజాయితీపరులైన సమర్థులను లోక్పాల్గా నియమిస్తుందా...? ఒకవేళ నియమించినా వారిని పనిచేయనిస్తుందా..? అంటే అదీ అనుమానమే. అందుకోసం అవినీతి వ్యతిరేక పోరాట స్ఫూర్తిని బతికించుకోవాలంటే ప్రజా పోరాటాలే మార్గం!