Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవినీతిలో బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే. ఆ పార్టీల నేతలు ఎవరికి ఎవరూ తక్కువ కాదు. అవినీతి పరులతో అంటకాగడం, వత్తాసు పలకడంలోనూ ఎవరికెవరూ తీసిపోరు. కార్పొరేట్లకు దోచిపెట్టడానికి వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తుంటారు. మళ్లీ వాళ్లే అవినీతి గురించి గురివింద మాదిరి నైతిక విలువలను బోధిస్తూ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడంలోనూ ఘనాపాఠీలు. అవినీతికి కాంగ్రెస్ ప్రభుత్వం గేట్లు తెరిస్తే, దానికి కొనసాగింపుగా మోడీ ప్రభుత్వం పూర్తిగా వాటిని ఎత్తేసింది. దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంకుగా పేరు గడించిన ఐసీఐసీఐ బ్యాంకులో వందలాది కోట్ల క్విడ్ప్రోకో కుంభకోణం వెలుగులోకొస్తే దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి మూసేయడానికి బీజేపీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుండటం దారుణం. 2016లో తెరపైకి వచ్చిన ఈ కేసులో ఐసీఐసీఐ మాజీ సారథి చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూపు ఎండీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుల ద్వారానైనా కార్పొరేట్ రంగం అసలు రూపం బహిర్గతమైతే కార్పొరేట్ మోసాల నుంచి ప్రజలకు కొంతవరకైనా ఉపశమనం దక్కేది. చిన్నచిన్న అవినీతిపరులను బయటకు చూపుతున్న ప్రభుత్వపెద్దలు, పెద్ద తలకాయలపై కేసు నమోదైతే విచారణ జరిపించడానికి ఉన్నతస్థాయి వ్యక్తులంటూ తొక్కిపెట్టడానికి సిద్ధమైంది. కేసులు పెట్టడం ద్వారా ఉన్నత వ్యక్తుల గౌరవానికి భంగం కలిగిస్తున్నారని కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ ట్విట్టర్లో పోస్టులు పెట్టడం దారుణం. అంతేగాకుండా ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసిన అధికారిని మోడీ ప్రభుత్వం బదిలీచేయడం విచారకరం. ఇలాంటి ఈ నిర్ణయాలతో సమర్ధవంతంగా పనిచేసే అధికారులకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంది. అవినీతిని లేకుండా చేస్తానంటూ అధికారంలోకొచ్చిన మోడీ అవినీతిపరులను వెనుకేసుకురావడం నీతిమాలిన రాజకీయం గాక మరేంటి? కుంభకోణానికి సంబంధించి ఆధారాలతో సహా నివేదిక సిద్ధం చేసిన సీబీఐని అభినందించాల్సిన కేంద్రం అడ్డుకుందంటే.. మరిన్ని అనుమానాలకు ఆస్కారం ఇచ్చినట్టే. ఎక్కడో అమెరికాలో చికిత్స పొందుతూ విధులకు దూరంగా ఉంటున్న జైట్లీ ఈ కేసులో కలుగజేసుకోవడం వెనుక మర్మమేంటి? కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత చిదంబరం కూడా బ్యాంకులను ఇబ్బంది పెడుతున్నారని తప్పుపట్టడం ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంలో పాలకపార్టీల తీరు ఒకటేనన్నది స్పష్టం! దేశంలో కార్పొరేట్ సంస్థలు మునిగిపోయి బ్యాంకులను, ఇతర రుణదాతలను దారుణంగా దెబ్బ తీసిన ఉదంతాలు కొత్త కాదు. సరళీకరణ ఆర్థిక విధానాల తొలిరోజుల్లోనే 1992లో రూ.4వేల కోట్ల హర్షద్ మెహతా స్టాక్మార్కెట్ కుంభకోణం వెలుగులోకొచ్చింది. 1996లో హవాలా కుంభకోణం, వెయ్యికోట్ల కేతన్ పరేఖ్ కుంభకోణం, 1995లో సిఆర్ బన్సాలీ మ్యూచువల్ ఫండ్స్ స్కామ్ బయటపడ్డాయి. సత్యం రామలింగరాజు అంకెల గారడీ కుంభకోణం, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పార్టీకి నిధులు సమకూర్చిన శారదా చిట్ఫండ్ కంపెనీ డిపాజిట్ల కుంభకోణం, సహారా ఇండియా పరివార్ రూ.24వేల కోట్ల గోల్మాల్ బాగోతం, కేంద్ర ఆర్థికశాఖ మాజీమంత్రి చిదంబరం ప్రమేయమున్నట్టు ఆరోపణలున్న ఎయిర్సెల్ మాక్సిస్ కుంభకోణం, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం, ఇలా ఎన్నెన్నో కార్పొరేట్ అవినీతీ అక్రమాలకు ఆకాశమే హద్దు. మోడీ వచ్చాక కేంద్రంలోనూ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కుంభకోణాలకు కొదవలేదు. బ్యాంకులకు వేల కోట్ల రూపాయల టోకరా పెట్టిన విజరు మాల్యా, నీరవ్ మోడీ వంటి మోసగాళ్లకు కేంద్రమంత్రులే సహకరించడం రోత పుట్టించేవి. వేల కోట్ల రూపాయలకు సంబంధించిన 26స్కామ్లు బీజేపీ పాలనలో చోటు చేసుకున్నాయి. తాజాగా ఐసీఐసీఐ కుంభకోణంతో పాటు జీటీవీ సంస్థ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర నష్టాల్లో కూరుకుపోయినట్టు స్వయంగా అంగీకరించారు. కుటుంబ విలాసాల కోసం ప్రజల సొమ్మును నీళ్లలా ఖర్చు చేసి నష్టాలొచ్చినట్టుగా చెప్పడమంటే తప్పించుకోవడమే. జైట్లీ మాదిరి కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన కపిల్ సిబల్, రాజా కార్పొరేట్లకు అనుకూలంగా మాట్లాడారు. అవినీతి గురించి ఈ రెండు పార్టీలు చెప్పేవన్నీ నీటిమీద రాతలే.
కార్పొరేట్ రంగంలో వెల్లువలా వెలుగుచూస్తున్న ఈ కుంభకోణాలు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ పతానవస్థకు చేరువలో చేరిందనడానికి ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కార్పొరేట్ దిగ్గజాలు అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోవడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలే మూలం. కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకు సామాన్యులపై పన్నుల రూపంలో పెనుభారాలు మోపుతున్న ఫ్రాన్సు లాంటి దేశాల్లో ప్రజలు పాలకులపై తిరగబడుతున్నారు. అమెరికాలో సంక్షోభ ప్రారంభ సమయంలోనే 'ఒక్క శాతం పెట్టుబడిదారుల కోసం 99 శాతం ప్రజలు బలి కావాలా?' అని నిలదీస్తూ ఏడాదిపాటు ప్రజా ఉద్యమం సాగింది. మనదేశంలోనూ ఆర్థికపోరాటాల ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. వినాశకరమైన ఈ సరళీకరణ ఆర్థిక విధానాలను తరిమికొట్టి ప్రక తి వనరులను, ప్రజల సంపదను పరిరక్షించే దిశగా ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాల కోసం ప్రజలు కొట్లాడాలి.