Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టు ఉంది హెచ్ఎండీఏ కమిషనర్ బదిలీ వ్యవహారం. మాట వినకపోతే శంకరగిరి మాన్యాలే అన్న తరహాలో వేటు వేసింది సర్కారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం క్యాబినెట్ ఏర్పాటు చేయకుండానే పాలన సాగిస్తున్నారనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. తాజా పరిణామం తాము ఆడింది ఆటా పాడింది పాటగా సాగుతున్నదనడానికి ప్రత్యక్ష సాక్ష్యం. పార్టీ వ్యవహారమైనా, పరిపాలన సంగతైనా తమ కనుసన్నల్లో జరగాలని గులాబీ సర్కారు భావిస్తున్నది. తమకు సహకరించడం లేదనే నెపంతో బడా పారిశ్రామికవేత్త, ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి అఖిల భారత సర్వీస్ అధికారులతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారన్న అభిప్రాయాలూ ఉన్నాయి. మాట వినలేదనీ, తమకు అడ్డొచ్చాడనీ ప్రభుత్వ పెద్దల సహకారంతో హెచ్ఎండీఏ కమిషనర్ జనార్థన్రెడ్డిపై బదిలీ వేటు వేయించడం రాజ్యాంగపరంగా ఒక అధికారి నిర్వహిస్తున్న బాధ్యతలను భంగపరచడమే. సాధారణంగా టెండర్లు పిలిచినా, వేలం వేసినా తుది నిర్ణయం ప్రభుత్వ నిబంధనలకు లోబడే ఉంటుంది. ఏదైనా తేడా వస్తే సంబంధిత టెండర్లను గానీ, వేలాన్నయినా రద్దుచేసే అధికారం సర్కారుకు ఉంటుంది. ఆ మేరకు ఆయా శాఖలకు బాధ్యులుగా ఉండే ఉన్నతాధికారు (హెచ్వోడీ)లకు అధికారా లుంటాయి. ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నదని, సమస్యలు ఉత్పన్నమవుతాయని భావిస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయా పనులను లేదా టెండర్లను అనుమతించరాదు. హెచ్ఎండీఏ వ్యవహారంలో అదే జరిగింది.
సివిల్ సర్వీస్ అధికారులు ప్రజల కోసం పనిచేయాలి. నిరంతరం ప్రభుత్వ, సంక్షేమ కార్యక్రమాలను సమాజానికి చేరువ చేసేలా ప్రయత్నించాలి. అదే సందర్భంలో ప్రభుత్వ ఆస్తులు, భూములు, ప్రజాధనం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యతా వారిదే. అందుకే సివిల్ సర్వీస్ కమిషన్ వారికి విస్తృతాధికారాలు కట్టబెట్టింది. అయితే రాష్ట్రంలో గత ఐదేండ్లుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, అఖిల భారత సర్వీస్(ఐఏఎస్) అధికారులకు ఆందోళన కలిగిస్తున్నాయి. బాధ్యతలు లేదా విధుల నిర్వహణ సందర్భంగా నిబంధనలూ మార్గదర్శకాలూ పాటించాల్సిన, అమలుచేయాల్సిన ఉన్నతాధికారులను స్వార్థరాజకీయాలు, అవసరాల కోసం బదిలీ పేర బలి చేస్తుండటం ఈ సర్కారు హయాంలో తరచూ చూస్తూనే ఉన్నాం. నగర శివారు ప్రాంతాలైన కోకాపేటలోని 166 ఎకరాల భూమిని 2006-08 కాలపరిధిలో గోల్డ్మైన్ పేర హెచ్ఎండీఏ వేలం వేసింది. ఈ భూమికి అప్పట్లో ఎకరాకు రూ.5.50 కోట్ల నుంచి 13కోట్ల మేర ధర పలికింది. ఇప్పుడా భూములు ఎకరాకు రూ.30 కోట్లపైనే ఉందని అధికారుల అంచనా. ఐతే ఆ భూములు తమ వారసత్వమని ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో అసలు వివాదం మొదలైంది. వేలంలో కొనుగోలు చేసిన వారికి ఇంతవరకూ భూములను రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో తాము చెల్లించిన డబ్బులను తమకు వాపసివ్వాలని కొందరు కోరుతున్నారు. మరికొంతమంది 2006-08లో ఉన్న మార్కెట్ రేటుకే రిజిస్ట్రేషన్ చేయాలని పట్టుబడుతున్నారు. ఇందుకు కమిషనర్ జనార్థన్రెడ్డి అంగీకరించలేదు. చెల్లించిన డబ్బుల మేరకే ఆనాటి రేటుకు భూమి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడంతో సమస్య ముదిరింది. దీంతో సదరు ఐఏఎస్ను ఆ పెద్దమనిషి జోక్యంతోనే బదిలీ చేశారు. ఆపైన మరెక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన అడ్డుకున్నట్టు ఆరోపణలూ ఉన్నాయి. ఇది ఇటీవల కేంద్రంలో చోటు చేసుకున్న పరిణామాలను గుర్తుకు తెస్తున్నది. అదే బాటలో రాష్ట్రం నడుస్తున్నది. తాజాగా సీబీఐ డైరెక్టర్ అలోక్వర్మను ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఎంత అవమానకరంగా ఇంటికి పంపిందో అందరికీ తెలిసిందే. ఈ తరహా బదిలీలు ఇటీవల పరిపాటయ్యాయి. అనుకూలురకు మంచి పోస్టింగులివ్వడం, మాట వినని వారిని లూప్లైన్లో పెట్టడం గులాబీ ప్రభుత్వానికి కూడా రివాజైంది. బదిలీలతోపాటు అఖిల భారత సర్వీసు అధికారులపై అనవసర వ్యాఖ్యలు చేయడం, అసభ్యంగా ప్రవర్తిస్తుండటం తదితర సంఘటనలూ చోటుచేసుకున్నాయి. గతంలో మహబూబాబాద్ కలెక్టర్గా పనిచేసిన ప్రీతీమీనా పట్ల ఎమ్మెల్యే శంకర్నాయక్ ప్రవర్తన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయినా ఆయనపై ఎలాంటి చర్యా లేదు. రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న బీఆర్ మీనా ఆయా విషయాల్లో మాట వినలేదనే కారణంతో ఆయన్నూ పక్కన పెట్టేశారు. భూపాలపల్లిలో కలెక్టర్గా పనిచేసిన ఆకునూరు మురళిపైనా కొరడా ఝళిపించి పురావస్తుశాఖకు బదిలీ చేసారు. ముందస్తు ఎన్నికల్లో సూర్యాపేటలో ప్రతిపక్షాలకు సహకరించారనే ఆరోపణలతో అక్కడి కలెక్టర్ సురేంద్రమోహన్ను ఇటీవల తప్పించారు. ఈ విషయమై అఖిల భారత సర్వీస్ అధికారుల అసోసియేషన్ కినుక వహించింది. ఎప్పటికప్పుడు తన అభ్యంతరాలను సర్కారు దృష్టికి తెస్తున్నా, సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తమ అవసరాలను నెరవేర్చని అధికారులు, ఉన్నతాధికారులెవరినైనా అప్రధాన స్థానాలకు పంపడం ద్వారా అఖిల భారత సర్వీస్ అధికారులను దారికి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తుండటం ఆందోళనకరం.