Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్లమెంటరీ విలువల్ని మోడీ సర్కార్ తుంగలో తొక్కింది. ఓట్ల కోసం దేనికైనా తెగించడానికి సిద్ధపడింది. కేవలం రెండు లేదా మూడు మాసాల కోసం ఓట్ ఆన్ ఎకౌంట్ ప్రవేశపెట్టవల్సిన పాలకులు మధ్యంతర బడ్జెట్ పేరుతో కోట్లాది భారత ప్రజానీకాన్ని మోసం చేసారు. ఏప్రిల్లో ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన పాలకులు రెగ్యులర్ బడ్జెట్ పెడతారు. కానీ మధ్యంతర బడ్జెట్ పేరుతో ఎన్నికల మ్యానిఫెస్టో స్థాయికి దిగజార్చింది. ప్రభుత్వం డబ్బుతో ఓట్లు కొనుక్కునేందుకు నిస్సిగ్గుగా వలవేసింది. సంక్షేమం పేరుతో ఓట్లకు బేరం పెట్టింది. అందుకే ఇది అభివృద్ధి బడ్జెట్ కాదు. సంక్షేమ బడ్జెట్ అసలే కాదు. కేవలం ఓట్ల కొనుగోలు బడ్జెట్.
అధికార పార్టీ తన నాలుగున్నరేండ్ల పాలనలో పనితనం చూపించి ఓట్లు అడగాలి. రాబోయే కాలంలో చేసేవి మ్యానిఫెస్టోలో చెప్పవచ్చు. కానీ గత కాలమంతా వైఫల్యాల పరంపర కావటంతో... పనితనం చూపి ఓట్లడిగే ధైర్యం లేదు. అందుకే ప్రభుత్వ ఖజానా నుంచి ఏప్రిల్ మాసంలోనే రైతుల ఎకౌంట్లో డబ్బువేసి ఓట్లు అడిగేందుకు ఓట్ల కొనుగోలు పథకాన్ని చట్టబద్ధం చేసే ప్రయత్నమే ఇది.
మూడేండ్లుగా రైతుల ఆత్మహత్యల సంఖ్య చెప్పకుండా దాచిపెట్టింది మోడీ సర్కార్. అంకెలు దాచవచ్చు. రైతుల ఆందోళన దాగదు కదా! గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో రైతులమీద కాల్పులు జరిపింది. ఢిల్లీ పొలిమేరలో నీటి ఫిరంగులు, టియర్ గ్యాస్, లాఠీచార్జీలు ప్రయోగించింది. రైతుల ప్రాణాలు బలిగొన్నది. ఇప్పుడు ఎన్నికల తరుణంలో రైతుకు ఏడాదికి ఆరువేలు నగదు సాయం ప్రతిపాదించింది. నిత్యజీవితావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రపంచ మార్కెట్లో అతితక్కువ ధరలున్న సమయంలో మనదేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు అత్యధికంగా పెంచింది. పేదల నుంచి మధ్యతరగతి వరకు అందరి జేబులకు చిల్లులు పెట్టింది. ఇప్పుడు మధ్యతరగతికి పన్ను రాయితీ, అసంఘటిత కార్మికుల పెన్షన్ పెంపు లాంటి పథకాలను ఎరగా వేసింది. ఘనంగా చెప్పుకున్న రైతు బీమావల్ల అన్నదాతలకు మేలు జరగలేదని పార్లమెంటరీ కమిటీ తేల్చింది. రైతులు రూ.42వేల కోట్లు ప్రీమియం చెల్లించగా కేవలం రూ.33వేల కోట్లు మాత్రమే పరిహారంగా చెల్లించారు. మిగిలిందంతా ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభంగా కట్టబెట్టారు. జన్ధన్ ఎకౌంట్లలో జనం జమచేసింది రూ.85వేల కోట్లు కాగా, వారికి ఓవర్డ్రాప్టు రూపంలో ఇచ్చింది కేవలం రూ.340కోట్లు. స్టార్ట్ అప్స్ ఒక డొల్ల అని తేలిపోయింది. 82శాతం మంది లబ్దిదారులకు బెనిఫిట్ అందలేదని గణాంకాలు వెక్కిరిస్తున్నాయి.
ప్రసంగమంతా అబద్ధాల కూర్పుగా సాగింది. మోడీ పాలనలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఈ ప్రభుత్వ గణాంకశాఖ లెక్కల ప్రకారమే పారిశ్రామికాభివృద్ధి దిగజారింది. తయారీరంగం స్తంభించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత భారతదేశం అభివృద్ధి వెనుకపట్టు పట్టిందని ప్రపంచబ్యాంకే తేల్చింది. విదేశీ పెట్టుబడులు బాగా పెరిగాయని చెప్పుకున్నారు. ఇందుకు భిన్నంగా ప్రభుత్వ, ప్రయివేటు పెట్టుబడులన్నీ కలిపితే 14ఏండ్ల కనిష్టానికి పడిపోయాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) స్పష్టం చేసింది. అభివృద్ధి అంటే కొత్త ఉద్యోగాలు సృష్టించటం అన్నారు బడ్జెట్ ప్రసంగంలో. కానీ జరిగిందేమిటి? నాలుగున్నర దశాబ్దాల కాలంలో ఇప్పుడే నిరుద్యోగం తారాస్థాయికి చేరిందని నేషనల్ శాంపుల్ సర్వే తేల్చింది. కేంద్ర ప్రభుత్వ లేబర్ బ్యూరో సర్వేలో కూడా ఇదే బట్టబయలైంది. అజీంప్రేమ్జీ యూనివర్సిటీ బృందం అధ్యయనంలో అనేక కొత్త కోణాలు బయటపడ్డాయి. మోడీ పాలనలోనే నిరుద్యోగం గరిష్ఠస్థాయికి పెరగటంతోపాటు పురుషులకన్నా మహిళల్లోనూ, అగ్రవర్ణాల యువతకన్నా ఎస్సీ, ఎస్టీ, బీసీలలోనూ నిరుద్యోగం ఎక్కువగా ఉన్నదని నిగ్గుదేలింది. ప్రయివేటీకరణ ఫలితంగా రిజర్వేషన్లు నిరుపయోగమైన ఫలితమిది. పెద్దనోట్ల రద్దు తర్వాత తొలి ఏడాదిలోనే నలభైలక్షల ఉద్యోగాలు ఊడిపోయాయని అఖిల భారత ఉత్పత్తిదారుల సంఘం నివేదిక చెబుతోంది. గతేడాది ఒక్క సంవత్సరంలోనే కోటీ పదిలక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయాయని సీఎంఐఈ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ముందుంచిన నివేదికల ప్రకారమే దేశంలో 60లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇక కొత్త ఉద్యోగాలు ఎక్కడిస్తున్నట్టు?
అవినీతి నిర్మూలించామని చెప్పుకున్నారు. రాఫెల్ కుంభకోణం, విజరుమాల్యా, లలిత్మోడీ, నీరవ్మోడీ లాంటి మోసగాళ్ళు పారిపోయిన తీరుచూస్తే నవ్విపోదురు గాక... అన్నట్టున్నది. బ్యాంకులను మోసగించిన కేసులు ఈ నాలుగేండ్లలో నాలుగురెట్లు పెరిగాయని రిజర్వు బ్యాంకు చెప్పింది. చందా కొచ్చర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి లాభం పొందారని జస్టిస్ శ్రీకృష్ణ కమిటి నిర్ధారించింది. ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ మాత్రం ''ఆమె గౌరవప్రదమైన వ్యక్తి... ఆమె మీద కేసునమోదు చేయటమేమిటి?'' అంటున్నారు. పెట్రోలు, డీజిల్, నిత్య జీవితావసర సరుకుల ధరలు పెంచిన పాలకులే ధరలను నియంత్రిం చామని నమ్మబలుకుతున్నారు. మొత్తం మీద బడ్జెట్ ప్రసంగం ఎన్నికల సభలాగా సాగింది. ప్రధాని సహా ఓట్ల పంట పండుతుందన్న ఆశతో చప్పట్లు చరిచారు. ఇక చైతన్యవంతంగా స్పందించవల్సింది ప్రజలే!