Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శీతాకాలం చివరిలో చిక్కని ప్రభాతవేళ.. మంచుతెరల్ని చీల్చుకుంటూ తూరుపు రేఖలు నేలను ముద్దాడుతుంటే, పచ్చని చెట్టుమీద ఓ పక్షి గీతాలాపన. అబ్బ.. ఆ గాత్రం వింటుంటే మనస్సు ఉల్లాసంగా చిందులు వేసివేసి అంతటితో ఆగక రెక్కలు తెచ్చుకుని ఆకాశంలో రివ్వున ఎగరాలనిపించింది. 'అహఁ.. ఇప్పుడు కాదులే.. నడిరేయి నక్షత్రాలలో ఒకటిగా చేరిపోవచ్చు..! అమ్మో.. అంతపని చేయొద్దు. కిందపడిపోతే ఎలా?! పోనీ, అలా కాసేపు తోటలోకి వెళితేనో..!' ఆ పూలపరిమళం. చిత్రమైన రంగులు, మృదుమధుర సంగతులు చెపుతాయి. 'మెరిసే మేఘమాలికా ఉరుములు చాలు చాలిక.. చెలితో ఊసులాడనీ..' అని మనసు బాసలు వినిపిస్తాయి. మనం కనిపించగానే తెల్లని చల్లని పూబాలలు ముసిముసిగా వికసిస్తాయి. చూసేవారి మనసూ అంతే.. సరిసమానంగా ఆనందం విరబూస్తుంది. సరిగ్గా అప్పుడే నీలిరంగు మేలిముసుగులో ఓ సుందరి అటుగా వెళుతున్నట్టు చిత్రమైన భావన. ఎంతచూసినా మళ్లీ కనిపించదు. అస్సలు అగుపించదు. ఎందుకంటే అది ఒక ఆలాపన..! ఆ కాంతి తెరల వెనుక దృశ్యాదృశ్యంగా ఉన్న ఇంతటి బ్రహ్మానందాన్నీ.. ఆ గాఢమైనఅనుభూతినీ ఏకాంతంగా పొందటం ఎంత అబ్బురమో కదా! అంతలోనే నిరాశా మేఘాలు ఆవరించాయి. లోలోన మనసంతా చీకటి. ఒక్కసారిగా ఆకాశంలో నక్షత్రాలు కనిపించలేదు. బాబోరు.. మనిషికి ఇంత స్వార్థం పనికిరాదు. హృదయం గాయపడింది. విరబూసే ప్రకృతి ఏ ఒక్కరి సొంతం కాదు.. అందరిదీ.. ఇది ఒక విచిత్రమైన విజ్ఞాపన.
గాలి హోరులో అలలు అలలుగా.. ఎవరిదో పిలుపు. తలుపు తీయగానే ఉషస్సు..! లేలేత కిరణాలతో నులివెచ్చని కాంతి.. ఆ కాంతిలోకి సర్రున వెళ్లడమా? కొద్దిసేపు ఆ కిరణ సుమాలతో దోబూచులాడి అల్లిబిల్లి కబుర్లతో కాలక్షేపం చేయటమా? మనసులో మరో ఆశల హరివిల్లు. ప్రకృతితో మనిషి మమేకమైతే అంతేమరి.! జీవితమంటే స్వచ్ఛమైన సరస్సు వంటిది. నిశ్చలంగా ఉన్న ఆ తటాకంలో నీరసం ఆవహిస్తుంది. అలాంటి సరస్సుకు నీరు తేటగా కనిపించదు. తీయదనం అస్సలే ఉండదు. ఆ చెరువులోని జల పుష్పాలు కూడా ఆరోగ్యంగా ఉండవు. కానీ అదే చెరువులోని నీరు అలలెత్తి ఆ గట్టును ఈ గట్టును తాకుతుంటే నీటిలోని చేపపిల్లలు దుముకుడే దుముకుడు. చైతన్యం చెకచెకా.. లోకమంతా నిండుపున్నమి జాబిలిలా పరిమళిస్తుంది. మానవ సంబంధాలూ వారి నడుమ అనుబంధాలు కూడా అదే తీరున వికసిస్తాయి. వికసించాలి కూడాను!! నిర్మలమైన ప్రేమకోసం మనుషులం గనుక పరితపిస్తుంటాం! ఇది సహజ గుణం.
కాలం పరిభ్రమిస్తూ ఉంటుంది. ఆలోచనలూ అంతే. ఎదిగే మొక్క కొత్తచివుళ్లు తొడిగినట్టు ఆలోచనలు చిగురిస్తూనే ఉంటాయి. 'చిగురులు వేసిన కలలన్నీ మమతల తీరం చేరాలీ..!' అన్నట్టు అవెప్పుడూ వెలుగు దిశలో ప్రసరిస్తూనే ఉంటాయి. ఆ ఆలోచనలకు సరైన ఆచరణా అనుసరణా ఉంటే అది చక్కని సదృశ్యమే.. ఆ చిత్రం తెల్లని వెండిమబ్బులా ఆహ్లాదంగా కనిపిస్తుంది. అప్పుడే వికసించిన వెన్నెలపుష్పంగా అది విరాజిల్లుతుంది. అందుకే జీవన పురోగమనానికి ఆచరణ కీలకం. ఆలాపన అంటే మనసులోని ఊహా విభావరి. ఈ ఊహలు ఎన్ని ఎత్తులకైనా ఎంతెంతటి లోతులనైనా అలవోకగా అందుకోగలవు. నిజానికి మనిషి తాను కలలు కన్నట్టే జీవించటానికి మించిన సాహసం మరొకటి ఉండదు. అందుకే సరైన ఆలోచనలు రూపొందటానికి కూడా ఆచరణే అవసరం. ఆచరణ లేని ఆలోచన కాగితం పువ్వులాంటిది. అందుకని అన్నిటికీ ఆచరణే గీటురాయి. ఆలాపన ఓ అందమైన ఊహాజగత్తు మాత్రమే..
నిజ జీవితంలో పట్టిందల్లా బంగారం కావాలను కుంటాం. మనం అనుకున్నట్టే ఆ పని అయిపోవాలని భావిస్తాం. ఒక్కపట్టాన పాతను వదులుకోలేం. కొత్తను తొందరగా స్వీకరించలేం. ఇంకా ఇంకా ఏదో ఏదో కావాలని ఆరాటం. అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయం. తగిన శ్రమ చేయం. ఊహించినట్టు ఆచరణలో జరగనప్పుడు అసంతృప్తే మిగులుతుంది. అది పెరిగిపోయి గుండె భగ్గున మండిపోతుంది. పర్యవసానం ఆవేదన. ఈ ఆందోళనలో సాధ్యాసాధ్యాలను ఆలోచించం. వాస్తవాన్ని జీర్ణించుకోలేం. అంటే గట్టుమీద నిలబడి 'ఇలా చేస్తే బాగుంటుంది.. అలా చేసి ఉంటే బాగుండేది..' అని భావిస్తుంటాం. కానీ, 'గుండెనిండా నీటిలోకి దిగబడినప్పుడు అర్థమవుతుంది. ఆ నీటి లోతెంతో..' హృదయమెంతగానో తపిస్తేనే కదా కన్నీటి విలువ తెలిసేది. ఆలాపనా.. ఆజ్ఞాపనా.. అనిపిస్తే అనిపించనీ.. వాస్తవాల ఆస్కారంతో అడుగులు వేయడమే మన పని. శ్రీశ్రీ చెప్పినట్టు.. 'ఎవరో మేలు చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా..! నిజం మరిచి నిదురపోకుమా..!'