Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలకత్తా వీధుల్లో సరికొత్త రాజకీయ క్రీడకు తెరలేచింది, మోడీ, దీదీల ఆధిపత్యపోరు రోడ్డెక్కడంతో ఈ ఆదివారం భారత రాజకీయాల్లో మున్నెన్నడూ కనీ వినీ ఎరుగని విపరీత పోకడలకు వేదికయింది. కేంద్ర సీబీఐ, రాష్ట్ర పోలీసు బాహాబాహీకి దిగజారడంతో కోల్కతా నడిబజారులో ప్రజాస్వామ్యం బేలగా మారింది. కేంద్రానికీ రాష్ట్రానికీ మధ్య పోరు పతాకస్థాయికి చేరడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రోజ్ వ్యాలీ, శారదా పోంజీ కుంభకోణాల్లో విచారణ పేరుతో కోల్కతా పోలీస్ కమిషనర్ను అదుపులోకి తీసుకునేందుకు 40మంది సీబీఐ అధికారులు ఢిల్లీ నుంచి తరలివెళ్లగా, కమిషనర్ నివాసానికి వెలుపలే ఆ రాష్ట్ర పోలీసులు సీబీఐ బృందాన్ని నిలిపేయడమేగాక నిర్బంధించి ఠాణాకు ఈడ్చుకెళ్లారు. సీబీఐ కార్యాలయంపైకి రాష్ట్ర పోలీసులు కదం తొక్కగా, అందుకు ప్రతిగా కేంద్ర భద్రతా దళాలు కవాతుకు దిగాయి. ఇరు పక్షాల ఎత్తులు పైఎత్తులతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడంతో బెంగాల్ ముఖ్యమంత్రి ఆకస్మిక దీక్షకు దిగారు. ఈ దీక్షకు మద్దతు పేరుతో ఒకవైపు తృణమూల్ మూకలు కోల్కతాను ముంచెత్తుతుండగా, మరోవైపు సీబీఐ బలగాలు కోర్టు మెట్లెక్కుతున్నాయి. దీనికితోడు నేతల దూషణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఇంతకీ వీధిపోరాటాలు ఎవరికోసం? ఎందుకోసం? అన్నదే అసలు ప్రశ్న. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగడుతున్నందునే ప్రతీకారేచ్ఛతో మోడీ ప్రభుత్వం ఈ దాడికి తెగబడుతోందని తృణమూల్ ఆరోపిస్తుండగా, ఈ కేసుల నుంచి దోషులను కాపాడుకునేందుకే మమతాబెనర్జీ తాపత్రయపడుతోందని బీజేపీ ఆరోపిస్తున్నది. ఇందులో ఏది నిజమో తెలుసుకోవాలంటే ఈ రాజకీయ విన్యాసాలకు మూలమైన రోజ్ వ్యాలీ, శారదా స్కీంల వివరాల్లోకి వెళ్లాల్సిందే. అధిక వడ్డీల ఆశ చూపడం, కోట్లకు కోట్లు పోగేసుకోవడం, చివరికి దుకాణం ఎత్తేయడమే ఈ 'పోంజీ' స్కామ్ల సారాంశం! రోజ్వ్యాలీ పేరిట రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, హౌటల్స్, రిసార్ట్స్, వినోద వ్యాపారాలను ప్రారంభించి 'గోరంత పెట్టుబడి పెట్టండి కొండంత లాభాలు పొందండి' అనే మోసపూరిత ప్రచారంతో చట్ట విరుద్ధంగా రూ.15వేల కోట్లు ప్రజలనుంచి దోచుకున్నారు. ఇక 'శారద' పేరుతో రెండేండ్లలోనే రెట్టింపు సొమ్మని ఊదరగొట్టి దాదాపు రూ.2500 కోట్లు కొల్లగొట్టారు. ఈ రెండు కుంభకోణాల్లోనూ నిందితులంతా తృణమూల్ నేతలే కావడం ఇక్కడ విశేషం! ఆ పార్టీ ముఖ్య నేతలైన తపన్సేన్, సుదీప్ బంధోపాధ్యాయలే వీటికి మూల విరాట్లు కావడం గమనార్హం! కాబట్టే మొదటినుంచీ నిందితులను కాపాడేందుకే మమత సర్కార్ ప్రయత్నిస్తుందన్నది జగమెరిగిన సత్యమే. ఇన్నాళ్లూ మిన్నకుండిన మోడీ సర్కార్ ఇప్పుడే కొరడా ఝులిపించడం వెనుక ఉద్దేశమూ ఊహకందనిదేమీ కాదు. అయితే ఇరుపక్షాలకూ ఈ విషయమై న్యాయాన్యాయాలకంటే రాజకీయాలే ప్రాధాన్యతాంశాలు కావడం విచారకరం!
వేలకోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన ఈ భారీ కుంభకోణాల్లో తృణమూల్ నేతలు పీకల్లోతు మునిగి ఉన్నారన్నది ఇప్పటికే తేలిపోయిన పచ్చినిజం. ఇంకా చెప్పాలంటే మమతా దీదీ ఆశీస్సులు లేకుండా ఆ పార్టీ నేతలు ఇంత సాహసం చేయలేరనే అభిప్రాయాలూ సత్య దూరమేమీ కావు. ప్రస్తుత వివాదానికి కేంద్రబిందువైన పోలీస్ కమిషనర్ రాజీవ్కుమారే ఈ స్కామ్లపై బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) నేతృత్వం వహిస్తుండటం, ఆయన అధికార పార్టీ నేతలను ఈ స్కామ్ల నుంచి తప్పించేందుకే లభించిన ఆధారాలన్నిటినీ ధ్వంసం చేశారని సీబీఐ ఆరోపిస్తుండటం, ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికే మద్దతుగా మన దీదీ రంగంలోకి దిగి ఇంతటి హైడ్రామాకు తెరతీయడం దేనికి సంకేతం!? మమతాబెనర్జీ చెపుతున్నట్టు గత నవంబర్లో బెంగాల్ ప్రభుత్వం సీబీఐకిచ్చిన జనరల్ కన్సెంటును ఉపసంహరించుకున్న నేపథ్యంలో.. సీబీఐకి కోర్టు ఆదేశిస్తే తప్ప ఆ రాష్ట్రంలోని కేసుల్లో జోక్యం చేసుకునే అధికారం లేదు. చేసుకోవాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కానీ మమతాబెనర్జీ ఏర్పాటు చేసిన 'సిట్' దర్యాప్తుపై నమ్మకంలేని బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో 2014లోనే కోర్టు దీనిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. కాబట్టి సీబీఐ జోక్యాన్ని తప్పుపట్టలేం.
కానీ 2014లో కోర్టు ఆదేశిస్తే.. ఈ నాలుగున్నరేండ్లుగా మోడీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఈ స్కాంలోని నిందితులు కొందరిని ఇప్పటికే తమ పార్టీలో కలిపేసుకున్నందున మిన్నకుండిపోయారా? లేక తృణమూల్ కాంగ్రెస్ తమ మిత్రపక్షంగా మారకపోతుందా అని ఉపేక్షించారా? ఎప్పటికైనా మమతాబెనర్జీ ఎన్డీఏలో కలవకపోతుందా అని ఎదురుచూశారా? ఇక మమత తమతో కలసిరాదనీ, ఆమె కూడా ప్రధాని కుర్చీపై కన్నేసారని తేలిపోయాకగానీ మోడీకి మోసపోయిన బాధితుల గోడు వినిపించలేదా? తీరా ఎన్నికల వేళ ఇది దేనిని సూచిస్తోంది! వేలకోట్ల ఈ కుంభకోణాల్లో నిండా మునిగిన తన సహచరులను రక్షించుకోవడానికే మమతాబెనర్జీ అప్రజాస్వామికంగా సీబీఐ దర్యాప్తును అడ్డుకుంటున్నారనే బీజేపీ ఆరోపణలు ఎంత నిజమో... కేవలం ప్రతీకారేచ్ఛతో తన రాజకీయ ప్రయోజనాల కోసమే మోడీ ఈ సీబీఐ దాడులకు పూనుకుంటున్నారన్న తృణమూల్ ఆరోపణలూ అంతే నిజం! అయితే ఈ రాజకీయ చదరంగంలో తమ రెక్కల కష్టాన్ని కోల్పోయిన లక్షలాదిమంది బాధితులే దిక్కులేనివారు కావడం వీటన్నిటినీ మించిన నిజం...!!