Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత 17ఏండ్లుగా అప్ఘానిస్తాన్లో అమెరికా పోరాడుతున్న తాలిబన్లతో శాంతి ఒప్పందం కొరకు అవసరమైన డ్రాఫ్ట్ తయారయిందని ట్రంప్ ప్రత్యేక దూత జల్మే ఖలీల్జాద్ ప్రకటించాడు. సోవియట్ల మద్దతుగల ప్రభుత్వాన్ని కూలదోయటానికి అమెరికా నేతృత్వంలో ఇస్లామిక్ మిలీషియాలకు కోట్లాది డాలర్ల ధన, ఆయుధ సహాయాన్ని అందించటంలో ఈ దూత కీలక పాత్రను పోషించాడు. ఈయన 1979లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్కు జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరించిన బ్రెజెన్స్కీకి సహాయకుడిగా పనిచేశాడు. అలా అమెరికా సహకారంతో పుట్టిన వికృతి శిశువులే ఈ తాలిబన్, అల్ ఖాయిదాలు.
ఖతార్లో తాలిబన్ల ప్రతినిధుల తో ఖలీల్జాద్ జరిపిన చర్చల ఫలితంగా అప్ఘానిస్తాన్లో తిష్టవేసిన 14వేలమంది అమెరికా సైనికులను ఉపసంహరించటం జరుగుతుంది. అయితే 17ఏండ్ల సుధీర్ఘ కాలంపాటు అప్ఘానిస్తాన్ను ఆక్రమించిన తరువాత అమెరికా సైనిక, భౌగోళిక వ్యూహంలో మార్పు వచ్చింది. మారిన వ్యూహం ప్రకారం చైనా, రష్యావంటి అణ్వస్త్ర దేశాలతో అమెరికా సైనికంగా తలపడనుందనే విషయం తేటతెల్లమైంది. ఖతార్లో చర్చించిన ఒప్పందం ప్రకారం అమెరికా సైనిక దళాలను ఉపసంహరించు కునేందుకు ఉద్దేశింపబడిన 18నెలల కాలంలో తాలిబన్లు అంతర్జాతీయ టెర్రరిస్టు గ్రూపులకు ఆశ్రయం ఇవ్వకూడదు. ఈలోపు తాలిబన్లు అమెరికా మద్దతుతో నడుస్తున్న అప్ఘానిస్తాన్ ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవలసి ఉంటుంది.
ఇటువంటి పరిస్థితులలో గత 17ఏండ్లుగా అప్ఘానిస్తాన్ను దురాక్రమించి అమెరికా చేసిందేమిటి? అనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. అమెరికా చేసిన యుద్ధం కారణంగా 175000మంది చనిపోయారు. పరోక్ష మరణాలను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య దాదాపు పది లక్షలదాకా ఉంటుంది. ఒక పది లక్షలమంది తమ ఆవాసాలను విడిచి పారిపోవలసి వచ్చింది. అప్ఘాన్ ప్రజలేకాకుండా 2300మంది అమెరికా సైనికులు, 1100మంది ఇతర దేశాల సైనికులు, అనేకమంది ప్రయివేటు కాంట్రాక్టర్లు కూడా ఈ యుద్ధంలో చనిపోయారు. అలాగే ఈ యుద్ధంలో గాయపడిన వారి సంఖ్య పైన వివరించిన అంకెలకు పది రెట్లు ఉంటుంది.
అలాగే అప్ఘానిస్తాన్లో అమెరికా దురాక్రమణకు అయిన వ్యయం 1ట్రిల్లియన్ డాలర్లు(ఇది 70లక్షల కోట్ల రూపాయలకు సమానం). 'టెర్రరిజంపై యుద్ధం' అనే సాకుతో అమెరికన్ ప్రభుత్వం ప్రజల ప్రజాస్వామిక హక్కులపై దాడి చేస్తున్నది. 2001లో పాట్రియాట్ చట్టం చేసి పౌరులపై అడ్డూ అదుపులేని గూఢచర్యానికి పాల్పడుతోంది. అలాగే పౌరులను నిర్బంధించటం, హింసించటం, పోలీసు ఏజన్సీలను మిలిటరీకరించి ముస్లింలపైనా, వలస వచ్చినవారిపైనా జులుం చేస్తోంది. ఇతర దేశాలు కూడా అమెరికాను అనుకరిస్తూ ప్రజల హక్కులపై దాడి చేస్తున్నాయి.
క్షీణిస్తున్న అమెరికా సామ్రాజ్యవాద ప్రాభవాన్ని అరికట్టటానికి చమురు నిల్వలున్న ప్రాంతంలో మొదలు పెట్టిన ఈ యుద్ధం ఏ లక్ష్యాల కోసమైతే ప్రారంభించబడిందో ఆ లక్ష్యాలను సాధించటంలో విఫలమైంది. నియంతృత్వ ఆప్ఘాన్ ప్రభుత్వాన్ని ప్రజలు ద్వేషించారు. 2001 తరువాత అప్ఘానిస్తాన్లో తాలిబన్ల నియంత్రణలోనే ఎక్కువ భూభాగం ఉంది. మధ్య ఆసియాలో వ్యూహాత్మక చమురు, సహజవాయు వనరులకు సంబంధించి రష్యా, చైనాల ఆధిపత్యం రోజురోజుకూ పెరుగుతోంది. తన సైన్యాన్ని ఉపసంహరించుకున్న తరువాత కూడా అప్ఘానిస్తాన్లో అమెరికా సామ్రాజ్యవాదం తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు నిస్సందేహంగా ప్రయత్నిస్తుంది. అందుకోసం బాగ్రామ్లోని వ్యూహాత్మక స్థావరాన్ని అమెరికా తన ఆధీనంలోనే ఉంచుకునే అవకాశం ఉంది.
అప్ఘానిస్తాన్ నుంచి సైనిక దళాల ఉపసంహరణ రష్యా, చైనాలతో సైనికంగా తలపడాలనే వ్యూహాత్మక మార్పుతో ముడిపడి ఉంది. దీనికి సంబంధించిన 'జాతీయ భద్రతావ్యూహం' డాక్యుమెంటును ప్రకటించి ఒక ఏడాది దాటింది. 'టెర్రరిజంపై యుద్ధం' స్థానంలో రష్యా, చైనాలతో తలపడటం అమెరికా వ్యూహంగా మారబోతున్నదని ఆ డాక్యుమెంట్ తెలియజేస్తున్నది. ప్రపంచ యుద్ధం దిశగా అమెరికా పయనించటాన్ని అమెరికా పాలక వర్గాలు వ్యతిరేకించటం లేదు. పైగా అందుకోసం పట్టుపడుతున్నాయి. రష్యాతో ట్రంప్ 'కుమ్మక్కు' అయ్యాడనీ, సిరియా, అప్ఘానిస్తాన్లలో అమెరికా తగినంత సైనిక శక్తిని వాడటంలేదని డెమోక్రాట్లు చేస్తున్న ఆరోపణలు దీనిలో భాగమే.
అయితే శత్రువు షరతులపై అప్ఘానిస్తాన్లో అమెరికా యుద్ధ విరమణ చేయటమంటే అమెరికా పరిపూర్ణంగా ఓటమి పాలయినట్టే. 17ఏండ్ల సుధీర్ఘ కాలంపాటు తన సాయుధ సంపత్తినంతా కూడదీసుకుని చేసిన యుద్ధంలో తాలిబాన్ సాయుధ దళాలను అమెరికా ఓడించలేకపోయింది. వియత్నాం యుద్ధం తరువాత అమెరికా ఇంత పరాజయాన్ని ఎక్కడా ఎదుర్కోలేదు. అయితే ఈ పరాజయాన్ని తాలిబన్లతో రాజీ పడటంద్వారా అమెరికా కప్పిపుచ్చుకుంటోంది. అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్న ఎడతెగని యుద్ధాలకు ముగింపు పలకాలంటే, వాటికి కారణమైన పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా అమెరికాలోను, అంతర్జాతీయంగాను కార్మికవర్గ రాజకీయ పోరాటాలు తీవ్రతరం కావాలి. అందుకు కావలసిన పరిస్థితులు వేగంగా ఆవిర్బవిస్తున్నాయని ఫ్రాన్స్లో జరుగుతున్న పోరాటాలు తెలియజేస్తున్నాయి.