Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్త పంచాయతీలు అధికారికంగా కొలువుదీరాయి. నూతన సర్పంచులకు ప్రభుత్వం, అధికారాలు, విధులకు సంబంధించిన శిక్షణా ప్రక్రియ ప్రారంభించడం ఆహ్వానించ దగింది. జిల్లాకొక సర్పంచితోపాటు మాస్టర్ ట్రైనర్లకు, ఇతర ముఖ్యులకు ప్రగతిభవన్ వేదికగా ఒక దఫా శిక్షణ పూర్తి చేశారు. స్వయంగా సీఎం కేసీఆర్ పాల్గొనడం విశేషం. ఇదంతా ఒక భాగం. గ్రామసీమలను అభివృద్ధి చేయాలని చెబుతూనే పన్నులు కచ్చితంగా వసూలు చేయాలని సీఎం నొక్కి వక్కాణించడం గమనార్హం. ప్రగతిభవన్లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నియోజక అభివృద్ధి పథకం ద్వారా నిధులు వస్తాయని సెలవిచ్చారు. దాదాపు ఏటా రూ.7236 కోట్లు సమకూరుతాయని చెప్పారు. నిజంగా ఈ నిధులతో పల్లెలు పచ్చతోరణాలవుతాయా అన్నదే అసలు సమస్య. ఆ మాత్రం నిధులు కూడా అందలేదన్నది నిజం.
పంచాయతీల గోస అర్థం చేసుకోకుండా సీఎం ప్రసంగ పాఠం నివ్వెరపోయేలా చేస్తున్నది. హైకోర్టు ఆదేశిస్తే గానీ, ఎన్నికలు నిర్వహించని రాష్ట్ర ప్రభుత్వం, ప్రగతిభవన్లో మార్గదర్శకాలు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. కరెంటు బకాయిలు ఉండరాదని, నూరుశాతం పన్నులు వసూలుచేయని సర్పంచులూ కార్యదర్శుల్ని సస్పెండ్ చేస్తామని హెచ్చరించడం ఆందోళనకు గురిచేస్తున్నది. ఇప్పుడు ఇదే సంగతి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. శాసనసభ ఎన్నికలు పూర్తికాగానే ప్రజల నుంచి పన్నులు రాబట్టాలని యోచించడం ఆందోళనకరమైన పరిణామమే. 14వ ఆర్థిక సంఘం నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత ఐదేండ్లుగా పంచాయతీలకు పైసా అందలేదు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కనీసం గౌరవ వేతనాలు సైతం క్రమం తప్పకుండా చెల్లించని స్థితిలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. పంచాయతీలు, మున్సిపాల్టీలకు 72, 73వ రాజ్యాంగ సవరణల ద్వారా సంక్రమించిన 29 అధికారాలకు తూట్లు పొడిచింది. రాజ్యాంగం హక్కుగా కల్పించిన అధికారాల్లో కోత పెట్టి 18 మాత్రమే అమలుచేస్తున్నారు. వాటిపై కూడా ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలతోపాటు తెలంగాణ ఏర్పడిన అనంతర టీఆర్ఎస్ ప్రభుత్వమూ దృష్టిపెట్టలేదు. ఇందుకు చట్టసభల ప్రతినిధులే అడ్డంకిగా ఉన్నారనే, ఆటంకాలు సృష్టిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. కొత్త రాష్ట్రంలోనూ పంచాయతీల గోస తీరనే లేదు. కొత్తగా 4500 పంచాయతీలను ఏర్పాటు చేసిన గులాబీ ప్రభుత్వం, 'తాంబూలాలిచ్చాం తన్నుకు చావండీ..' అన్న రీతిన వ్యవహరిస్తున్నది. వాటి ఉనికి కోసం ప్రత్యేకంగా నిధులిస్తామని చెప్పాల్సిందిపోయి, పన్నులు వసూలు చేసుకోవాలని ఉచిత సలహాలు, సూచనలు ఇవ్వడం విడ్డూరం. వామపక్షాల చొరవతో వచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద గ్రామసీమల్లో పనులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన 10శాతం మ్యాచింగ్ గ్రాంటు నిధులను సైతం ఇవ్వకుండా ఆలస్యం చేసింది. గ్రామజ్యోతి ప్రారంభమయ్యాక పంచాయతీలకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులిస్తామన్న బాస గురించిన ఊసే లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఖర్చు పెట్టాల్సిన సబ్ప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్నది. మిషన్ కాకతీయ, భగీరథ, ఇతర ప్రాజెక్టుకు ఖర్చుపెడుతున్నదనే విమర్శలు ఉండనే ఉన్నాయి. సర్పంచులకు చెక్పవర్ సైతం అధికారంలోకి వచ్చిన మూడేండ్ల తర్వాతగానీ కట్టబెట్టలేదు. కొత్త పంచాయతీరాజ్ చట్టం పేర ఉన్న నామమాత్ర అధికారాలను సైతం చట్టసభలకు దఖలు పరిచింది. తద్వారా పంచాయతీల స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేసింది. గ్రామాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే నిరభ్యంతర పత్రం పంచాయతీల నుంచి తీసుకోవాలనే అధికారం ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ అధికారానికి కత్తెరేసింది.
గ్రామ అభివృద్ధి కమిటీ(వీడీసీ)ల పేర పల్లెల్లో జరుగుతున్న అకృత్యాలు ఎన్నెన్నో. ప్రజాప్రతినిధులకు కనీస విలువ లేకుండా పోయింది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాల్లేక పట్టణాలు, నగరాలకు వలసపోతున్న నేపథ్యంలో పన్నులు వసూలు చేయాలనీ లేకపోతే కార్యదర్శుల్ని సస్పెండ్ చేస్తామని స్వయంగా సీఎం మాట్లాడటం ఏమాత్రం సహేతుకం కాదు. కరువుకాటకాలకు నిలయమైన పంచాయతీల ఆర్థిక దుస్థితిని అర్థం చేసుకుని, ఆర్థికంగా ఆదుకోవడం, అన్ని విధాలా బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. హైదరాబాద్ మినహా 30గ్రామీణ జిల్లాల్లో 2.02కోట్ల జనాభా ఉంది. వీటికి యేటా 14వ ఆర్థిక సంఘం కింద రూ.1628కోట్లు వస్తాయని సర్కారు చెబుతున్నది. అలాగే తమ తోడ్పాటుతో మొత్తం రూ.3256కోట్లు అందుతాయని అంటున్నది. నిజంగా అందినా సీఎం చెప్పిన ప్రకారమే 500 జనాభాగల పంచాయితీకి కేవలం రూ.16లక్షలు కేటాయిస్తారు. ఏడాదికి రూ.16లక్షలతో ఏమి అభివృద్ధి చేయగలరు? ఆయన మాటల్లోనే ప్రస్తుతం గ్రామ పంచాయతీలు కరెంటు బిల్లులు కూడా కట్టుకోగల స్థితిలో లేవు. వాటి ఆదాయ మార్గాలు కత్తిరించి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో వేసుకున్నారు. రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్లో తగిన వాటా పంచాయతీలకు కేటాయించకుండా మాటలతో సాధించేది శూన్యం కదా!