Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్వేషం ఎప్పుడూ రగులుతూనే ఉండాలి. విధ్వంసం ఎప్పుడూ జరుగుతూనే ఉండాలి. లేకుంటే హిందూత్వవాదుల హృదయాలు శాంతించవు. ప్రజలలో నిత్యం విధ్వంసం, విద్వేషాలను రగిలించడం ద్వారా ఓట్లు దండుకునే పన్నాగాలను అవపోసన పట్టిన కమలనాథులు ఆ పనిలో అనుక్షణం నిమగమయ్యే ఉంటారు. ఇందుకు తాజా ఉదాహరణ కేరళ. శబరిమలను దక్షిణాది అయోధ్యగా మార్చి మతచిచ్చు రగల్చడం ద్వారా కేరళలో రాజకీయ లబ్ది పొందాలన్న తమ కుట్రను కేరళ సమాజం తిప్పికొట్టడంతో కంగుతిన్న కమలదళం ఇప్పుడు కొత్త కుట్రకు తెరలేపింది. ఇందుకు ఈసారి విద్యాలయాలను ఎంచుకున్నది.
కొచ్చిన్లోని సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు హిందూత్వ అనుకూల విద్యార్థులు భోజనంలో తమకు బీఫ్ వడ్డించారని ఆరోపిస్తూ, అందుకు బాధ్యుడైన కళాశాల ప్రిన్సిపల్ ఎన్. సునీల్ కుమార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత నెల 25న ఒక నిరసన ప్రదర్శన చేశారు. ఇందుకు కొనసాగింపుగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తమకు సరస్వతీ పూజకు అనుమతించాలని ఉప కులపతిని డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన విద్యార్థుల పథకాన్ని గమనించిన ఉపకులపతి ఆర్. శశిధర్ అందుకు నిరాకరించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణం ఒక లౌకిక ప్రాంగణమని, ఇక్కడ మతపరమైన కార్యక్రమాలను అనుమతించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. బహిరంగ సరస్వతీ పూజకు డిమాండ్ చేసిన వారు ఉత్తర భారతానికి చెందిన హిందూత్వ అనుకూల విద్యార్ధులు కావడం గమనార్హం. కేరళ సమాజ సంస్కృతి వేరు. హిందూ, ముస్లీం, క్రైస్తవ సంస్కృతుల సమాహారం అది. కేరళ సమాజంలోని కనీసం 60శాతంమంది ప్రజలకు బీఫ్ భుజించడం నిషేధం కాదు. ఎలాంటి చిన్నచూపునకు, విమర్శలకు గురికాకుండానే స్వేచ్ఛగా బీఫ్ ఆరగించే అవకాశం అక్కడి ప్రజలకు ఉంది. కాబట్టి మాంసపుశాలలో మేక మాంసంతోపాటు బీఫ్ కూడా విక్రయిస్తారు. ఏ మాంసం ఎంత ధరో వివరించే బోర్డులు ఉంటాయి. ప్రజలు ఎవరికి నచ్చిన మాంసాన్ని వారు కొనుగోలు చేసి తీసుకుపోతుంటారు. నాన్వెజ్ హోటళ్ల మెనూలో కూడా బీఫ్ ఒక ఐటమ్గా చేర్చి ఉంటుంది. ఎవరికి ఇష్టమున్న వాళ్లు అది తినిపోతుంటారు. ఇంతటి స్వేచ్ఛాయుత సాంస్కృతిక వాతావరణం ఉన్న కేరళకు చెందిన ప్రజలు బీఫ్ తినడాన్ని గురించిన వివాదాలలోకి వెళ్లరు. హిందూత్వవాదుల పట్టు అధికంగా ఉన్న ఉత్తరభారత పరిస్థితులు వేరు కాబట్టి ఆ ప్రాంతానికి చెందిన విద్యార్థులను హిందూత్వవాదులు రెచ్చగొడుతున్నారు. అయినప్పటికీ బీఫ్ను వివాదంగా మార్చేందుకు ఇతర విద్యార్థులు ముందుకు రాలేదు. నిజానికి విశ్వవిద్యాలయంలో భోజనంలో బీఫ్ వడ్డించారనడం పచ్చి అబద్ధం. కొందరు హిందూత్వవాద అనుకూల విద్యార్థులు తప్ప మిగిలిన మెజారిటీ విద్యార్థులు ఈ ఆరోపణ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. ఈ ఆరోపణలతో విద్యార్థులను రెచ్చగొట్టాలన్న కుతంత్రాన్ని కేరళ విద్యార్థులు తిప్పి కొట్టడంతో వెంటనే సరస్వతీమాతను ముందుకు తెచ్చారు.
శబరిమల చిచ్చు రగిలించి కేరళలో, దక్షిణ భారతంలో రాజకీయలబ్ది పొందాలనుకున్న కమలనాథులు ఆ విషయంలో తమ కుట్ర పారకున్నా తమ విద్వేష రాజకీయ ఆచరణను మాత్రం వొదలదలచుకోలేదు. దాన్ని కొనసాగించేందుకే నిర్ణయించుకున్నారు. అందులో భాగమే ఇప్పుడు కొచ్చిన్ విశ్వవిద్యాలయంలో సంభవిస్తున్న పరిణామాలు. విశ్వవిద్యాలయాలను కాషాయీకరణ చేసే కార్యక్రమం ఈనాటిది కాదు. భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలనే లక్ష్యంతో ఏర్పడిన సంఫ్పరివార్ అందుకు విద్యార్థులనే బలమైన సాధనంగా భావించి పసిప్రాయం నుంచే వారిలో హిందూత్వ విషబీజాన్ని నాటే కార్యక్రమం ప్రారంభించింది. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో అనేక పేర్లతో ప్రాథమిక పాఠశాలలను నడుపుతోంది. పసిప్రాయం నుంచే వారిలో పరమత ద్వేషాన్ని నూరిపోస్తూ ఉంది. ఆ భావజాలంతో ఎదిగినవారిని కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో ప్రయోగిస్తూ ఉంది. జేఎన్యూ, ఢిల్లీ, బెనారస్, హెచ్సీయూ లాంటి విశ్వ విద్యాలయాల్లో హిందూత్వవాద విద్యాసంస్థలు సృష్టిస్తున్న భయోత్పాతాన్ని మనం చూస్తూనే ఉన్నాం. వీరి ఆగడాలకు రోహిత్ వేముల లాంటి దళిత విద్యార్థులు ఎందరో బలైపోతూ ఉన్నారు. అయినా, విశ్వవిద్యాలయాల్లో వెలివాడల సంస్కృతిని వ్యాప్తిచేసే లక్ష్యంతో వారి ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతూనే ఉన్నాయి. ఇందుకు కొనసాగింపే ఇప్పుడు కొచ్చిన్ విశ్వవిద్యాలయంలో సంభవిస్తున్న పరిణామాలు.
దశాబ్దాలుగా తాము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కేరళ సమాజం తమ గుప్పెట బందీ కాకపోగా, తమ బద్ధ వ్యతిరేకులైన కమ్యూనిస్టులను ఆదరిస్తుండడాన్ని హిందూత్వవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏమైనా చేసి, ఎంతకైనా తెగించి కేరళను కబళించేందుకు కుట్రల మీద కుట్రలు పన్నుతూనే ఉన్నారు. అయినా హిందూ మతోన్మాదులు అక్కడ విజయం సాధించడం అసాధ్యం. కర్మసిద్ధాంతాన్ని అంగీకరించక, సోదరత్వాన్ని ప్రేమించే కమ్యూనిస్టు భావజాలంతో కేరళ సమాజం పెనవేసుకు పోవడమే అందుకు కారణం!