Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలూ మనం సముద్రం ఒడ్డుకు వెళితే కెరటాల వల్ల వచ్చే శబ్దాలు మనకి భయం పుట్టిస్తాయి. అయితే సముద్ర ఉపరితలంతో పోలిస్తే సముద్రం లోపల శబ్దాలు అధికంగా ఉంటాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తెలిసింది. సముద్రాల్లో అతి లోతైన ప్రదేశం మారియానా ట్రెంచ్. ఇది సముద్ర ఉపరితలం కింద నుంచి ఏడు మైళ్ల లోతుగా ఉంటుంది. సూర్యకాంతి ఇందులోకి ప్రసరించలేదు. ఇలాంటి ప్రదేశాల్లో నిశ్శబ్దంగా ఉంటుందని మొదట శాస్త్రవేత్తలు భావించారు. అయితే నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఎఎ) పరిశోధనలో అది వాస్తవం కాదని తేలింది. సముద్రంలో శబ్దాలను లెక్కించడానికి ఎన్ఓఏఏ, ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఒక పరిశోధనను చేపట్టాయి. ఇందులో మొదటగా మహా అగాథంలో ఒక హైడ్రోఫోన్ను అమర్చారు. దీనిద్వారా సముద్రంలో వచ్చే శబ్దాలను గుర్తించవచ్చు. ఈ హైడ్రోఫోన్ను టైటానియం వంటి దృఢమైన లోహంతో తయారుచేశారు. ఇది 16 వేల పౌండ్ల ఒత్తిడినైనా తట్టుకునే విధంగా రూపొందించారు.దీనిని సముద్రం అడుగున అమర్చి యు.ఎస్. నావికాదళానికి అనుసంధానం చేశారు. కొన్ని నెలల తరువాత రికార్డర్ను వెలికితీసి పరిశీలించేసరికి ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది. 'మహా అగాథాల్లో కూడా శబ్దాలు ఉంటాయని' పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త రాబర్ట్ డిజైక్ పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాల నుంచి మానవుడు సహజ వనరుల కోసం సముద్ర అడుగు భాగాన్ని గాలిస్తున్నాడు. నౌకల ద్వారా రవాణా, సముద్ర గర్భంలో ఉన్న సహజ వాయువులను శోధించడం వల్ల ధ్వనులు ఎక్కువవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే ఒక రకమైన రొయ్యలు, నీలి తిమింగలాలు, నీటి జంతువులు, అదేవిధంగా భూకంపాలు, తుపానులు, సునామీల వల్ల ఈ శబ్దాలు ఏర్పడుతుంటాయి.