Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణలో రైతన్నల ఆందోళనల పర్వం మళ్లీ మొదలయ్యింది. కోటి ఆశలతో తాము ఎన్నుకున్న సర్కారు ఉన్నదోలేదో తెలియని స్థితిలో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక వేలాది పసుపు, మొక్క జోన్న రైతులు రోడ్డెక్కారు. మంగళవారం ఆర్మూరులో 63వ నంబరు జాతీయ రహదారి రైతన్నల ఆందోళనతో స్తంభించి పోయింది. పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి, ఎన్ని ఆటంకాలు సృష్టించినా వేలాది రైతులు 6గంటల పాటు రాస్తారోకో చేయడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది.
నిజామాబాద్జిల్లా ఆర్మూరు, నిజామాబాద్ డివిజన్లలో రైతులు ప్రధానంగా పసుపు, ఎర్రజొన్నలు పండిస్తారు. సుమారు 35వేల మంది రైతులు, 60వేల ఎకరాలలో పండించే పంటకు నాణ్యమైన పంటగా పేరుంది. అయితే ప్రభుత్వ అలసత్వం వల్ల గిట్టుబాటు ధరలేక రైతులు దివాళా తీస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత సమస్య మరింత తీవ్రమయింది. ఇప్పటికీ పూర్తి మంత్రివర్గం ఏర్పడి జవాబుదారీతనం లేకపోవడంతో అధికారులు, దళారులు కలిసి రైతులను దోచుకుతింటున్నారు. పక్కనున్న మహారాష్ట్రలోని సాంగ్లీలో క్వింటాల్ పసుపు రూ.8వేలు పలుకుతుండగా, నిజాబాబాద్ మార్కెట్లో కేవలం రూ.4200-4500 మాత్రమే చెల్లిస్తున్నా రంటే రైతులు ఎంతగా దోపిడీ చేయబడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
నిజామాబాద్జిల్లా మొదటి నుంచీ పాలకపార్టీకి కంచుకోట. ఇక్కడినుంచే సాక్షాత్తూ ముఖ్యమంత్రి తనయ ఎంపీగా ప్రాతినిద్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా అధికార పార్టీకి చెందినవారే. అయినా గత రెండు నెలల నుంచి రైతుల గోడువినే నాధుడులేదు. రాష్ట్రంలో మంత్రివర్గం ఏర్పడకపోవడంతో అంతా అధికారుల ఇష్టానుసారంగా మారింది. ఉన్నతాధికారులకు విన్నవించుకుందామన్నా సంబంధిత మంత్రి లేకపోవడంతో సొంతంగా వారు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితి. నేరుగా ముఖ్యమంత్రిని కలిసి సమస్యకొక పరిష్కారం కనుగొనడం ఏ అధికారికైనా ఈ రాష్ట్రంలో అసాధ్యం. ప్రజలకు ముఖ్యమంత్రి అందుబాటులో ఉండరు. దీంతో సమస్య మరింతగా జఠిలమై పోలీసుల చేతిలోకి వెళ్లిపోయింది. పోలీసులపని నిర్భంధం ప్రయోగించడమే కదా! వాళ్లు అదే పని చేస్తున్నారు. మొత్తం 13మండలాలలో 144 సెక్షన్ విధించారు. నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. ధర్నాకు వెళితే అరెస్టు చేస్తామని గ్రామాలలో దండోరా వేయించారు. అయినా లెక్కచేయక ధర్నా స్థలికి చేరుకున్న రైతులను అరెస్టుచేసి తమ కర్తవ్యం నిర్వహించారు. టీఆర్ఎస్ నాయకులు గత ప్రభుత్వంలో రైతులకు ఎన్నో హామీలు ఇచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ ఇస్తామనీ ఇవ్వని ఇన్పుట్ సబ్సీడీ తాము చెల్లించామని గొప్పలు చెప్పుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గట్టి హామీ ఇచ్చారు. ఇక రైతుబంధు ఎలాగూ ఉంది. కానీ, ఇవేవీ రైతులను ఆదుకోలేకపోతున్నాయి. దళారులు, అవినీతి అధికారుల చేతివాటం గిట్టుబాటు ధరను దూరం చేస్తుండటంతో రైతు బతుకులు ఎడారి పాలవుతున్నాయి.
స్వయంగా తాను గొప్ప రైతునని చాటుకునే ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతుల అసలు సమస్యమీద అవగాహన లేదనుకోవడం పోరపాటే అవుతుంది. రైతు అసలు సమస్య గిట్టుబాటు ధరే అన్నది ఆయనకు తెలుసు. వినియోగదారులు చెల్లించే ధరలో 25శాతం కూడా రైతులకు అందడం లేదని మిగిలినదంతా దళారుల పాలై రైతన్నలు దివాళా తీస్తున్నారని స్వామినాథన్ లాంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పష్టం చేసిన విషయమూ ఆయన దృష్టికి రాలేదనుకోలేము. నిజానికి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా దళారులకు తప్ప ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. మరి దళారుల నష్టాన్ని తమ కష్టంగా పాలకులు భావిస్తున్నారా? సమా ధానం ఇక్కడే ఉంది. తమ వారైన దళారులు, వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేందుకే పాలకులు ప్రయత్నిస్తున్నారు. తమవారి ప్రయోజనాలకోసం రైతులను కడగండ్లపాలే చేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఏవో కొన్ని తాయిళాలు చూపి ఓట్లు దండుకున్న తరువాత ఏట్లోకి తోసేస్తున్నారు.
అయితే ఈ పరిస్థితి ఎక్కువ రోజులు సాగదన్నది పాలకులు గుర్తించాలి. మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడుతో సహా దేశ వ్యాప్తంగా రైతులు ఎక్కడికక్కడ రోడ్లెక్కుతున్న వాస్తవాన్ని గమనించాలి. రైతు ఉనికిని, అవసరాన్ని గుర్తించక తప్పని స్థితిని రైతులే తమ సంఘటిత శక్తితో పాలకులకు కల్పిస్తున్నారు. కాబట్టే మునుపెన్నడూ రైతుల ఊసెత్తని నరేంద్రమోడీ లాంటి రైతు వ్యతిరేకి సైతం ఓట్ల కోసం ఇప్పుడు రైతు జపం చేస్తూ, తలరాతలు మార్చని వరాలు కురిపిస్తున్నారు. దేశమంతా ఇప్పుడు ఇదే పరిస్థితి అలముకుని ఉంది. రాజకీయాలకు అతీతంగా ఎక్కడికక్కడ రైతులు సంఘటితమై ఆందోళనలకు దిగడంతోనే ఇది సాధ్యమయ్యింది. ఈ అనుకూల వాతావరణాన్ని రైతాంగం మరింతగా తమకు అనుకూలం చేసుకునేందుకు ముందుకు రావాలి. చైతన్యంతో, సంఘటితంగా పాలకుల చేత తమకు అనుకూల నిర్ణయాలు చేయించే స్థితినుంచి, తమకు అనుకూల పాలకులనే ఎన్నుకునే స్థితికి చేరుకోవాలి. అప్పుడే రైతన్నల మౌలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం.!