Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమ్మూ- కాశ్మీర్ చరిత్రలోనే కనీవినీ ఎరుగుని ఉగ్రదాడిలో 46మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోడం దేశ ప్రజలను దిగ్భ్రాంతిలో ముంచింది. జమ్మూ నుంచి గురువారం తెల్లవారుజామున బయలు దేరిన జవాన్ల 78వాహనశ్రేణిని అక్కడకు 241కిలోమీటర్ల దూరంలోని అవంతిపొరా పట్టణ సమీపంలో జేషే మహ్మద్ సంస్థకు చెందిన ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు 350కిలోల అత్యాధునిక పేలుడు పదార్థం (ఐఈడీ)తో నిండిన వాహనంతో ఢకొీట్టడంతో ఈ ఘోరం సంభవించింది. 2000సంవత్సరంలో ఇదే ఉగ్ర సంస్థ జరిపిన దాడిలో 29మంది చనిపోయిన తరువాత జమ్మూ- కాశ్మీర్లో జరిగిన అతిపెద్ద సంఘటన ఇది.
పెద్దనోట్ల రద్దుతో ఉగ్రవాదం పీకనొక్కేశామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రగల్భాలు పలికిన తరువాతే దేశంలో, ప్రధానంగా జమ్మూ-కాశ్మీర్లో ఉగ్రవాదం బలపడిందని ఆర్మీ అధికారులు ప్రకటించిన లెక్కలే చెబుతున్నాయి. మోడీ ప్రభుత్వానికి ఉగ్రవాదాన్ని అణచడంలో చిత్తశుద్ధి లేకపోవడమే ఇందుకు కారణం. కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అణచివేసి అక్కడ శాంతి నెలకొల్పానే చిత్తశుద్ధి మోడీ ప్రభుత్వానికి ఉండిఉంటే అక్కడ ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దుచేసి మరీ ఆ రాష్ట్రాన్ని మిలిటరీ చేతిలో పెట్టిఉండేది కాదు. అక్కడ పనిచేస్తున్న అనేక సంస్థలతోపాటు పాకిస్థాన్తో కూడా చర్చలు జరిపి ఉండేది. యువత అసంతృప్తికి కారణమైన నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు ప్రయత్నించి ఉండేది. కాశ్మీర్లో పర్యటించిన పార్లమెంటరీ కమిటీ సమస్యతో సంబంధమున్న అందరితో చర్చలు జరపాలన్న సూచనను పెడచెవిన పెట్టిన మోడీ ప్రభుత్వం కాశ్మీర్ కల్లోలాన్ని ఓట్ల కోణంలో మాత్రమే చూస్తోంది. అక్కడి హింసను చూపించి దేశవ్యాప్తంగా మత పరమైన విభజన సృష్టించి మెజారిటీ హిందువుల ఓట్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే పాకిస్థాన్ బూచిని చూపి జాతీయ భావనను రేకెత్తించడం ద్వారా తమ ఎన్నికల ప్రయోజనాలను నెరవేర్చుకోవాల నుకుంటోంది. దేశభక్తి పేరుతో దేశ సమగ్రతకే ముప్పు కలిగించే చర్యలకు వొడిగడుతోంది.
నిజానికి కాశ్మీర్లో పెద్ద ఎత్తున ఉగ్రదాడి జరిగే అవకాశం ఉన్నదని ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ కేంద్రానికి హెచ్చరిక చేసినా పట్టించుకోలేదు. ఇప్పటి దుర్ఘటనలో కూడా అధికార వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉన్నది. సహజంగా వేయిమందికి మించిన కాన్వాయిని ప్రయాణానికి అనుమతించరు. కానీ గురువారం ఏకంగా 2,547మంది సైనికులు ఒకే కాన్వాయిలో ప్రయాణించేందుకు అనుమతించారు. అలాగే కాన్వాయికి ముందు సెంట్రీదళం రోడ్డు పరిశీలన జరుపలేదు. కాన్వాయి కదలికలు ఎప్పటికప్పుడు ఉగ్రవాదులకు చేరడం, ఉగ్రవాదులు ఏకంగా 350కిలోల పేలుడు పదార్ధాన్ని సంఘటనా స్థలానికి చేరవేయగలగడం హౌంశాఖ వైఫల్యాన్నే సూచిస్తున్నది.
సంఘటన జరిగిన తరువాత కూడా మోడీ స్పందనలో ఎలాంటి నిజాయితీ కనిపించడం లేదు. శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకుండా రైలు ప్రారంభోత్సవానికి మోడీ హాజరయ్యారంటే ఆయన చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. పైపెచ్చు 'మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా. మీకు ఇష్టమొచ్చింది చేయండి. దెబ్బకు దెబ్బా తియ్యండి' అంటూ జవాన్లను రెచ్చగొడుతున్నారు. విజ్ఞతగల ఏ ప్రధానీ సైనికులను ఇలా రెచ్చగొట్టరు. మరిన్ని ప్రాణాలు గాలిలో కలవాలని, ఇంకింత నెత్తురుతో ఈ నేల తడవాలనీ కోరుకోరు. కానీ ప్రజల భావోద్వేగాలమీద ఆధారపడి రాజకీయాలు నడపాలనుకునే నరేంద్రమోడీ అందుకు అనుగుణంగానే మాట్లాడుతున్నారు. ఇదే బీజేపీకి చెందిన నాటి ప్రధాని వాజ్పాయి కనీసం పాక్ అధ్యక్షుడిని భారత్కు పిలిచి చర్చించారు. వివిధ సంస్థలలో సంభాషణలు జరిపారు. మోడీ హయాంలో అలాంటివేవీ జరుగలేదు సరికదా, ప్రజల గొంతుక అయిన శాసనసభనే రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించారు. కాశ్మీరీ సమాజంతో చర్చకే తావు లేకుండా చేశారు.
తూటాకు తూటా ఎన్నడూ సమాధానం కాదు. ఆ విధానం మరింత కల్లోలాన్నే సృష్టిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ విధానం మారాలి. ప్రజలపై యుద్ధం చేయడం మాని, భారత ప్రభుత్వం పట్ల కాశ్మీరీ ప్రజలలో విశ్వాసం కలిగే చర్యలు చేపట్టాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూడాలి. జమ్మూ-కాశ్మీర్కు చెందిన అనేక పౌర సంస్థలతో తక్షణం చర్చలు ప్రారంభించాలి. అలాగే, అంతర్జాతీయంగా పాకిస్థాన్ను ఒంటరి చేయాలి. పాక్పై ప్రపంచ దేశాల వత్తిడిపెంచి ఇతరులు ఎవరైనా... ఎంత రెచ్చగొట్టినా మన ప్రజలలో పాలకులపై అసంతృప్తి లేకుంటే ఉగ్రవాదం మనుగడ సాగించడం అసాధ్యం. ప్రజల ఆసరా లేని ఉగ్రవాదులు వొడ్డున పడ్డ చేపల్లా కొట్టుకు చస్తారు. ప్రజల అసంతృప్తే వారిని బతకనిస్తోంది. ఆ అసంతృప్తికి కారణాలేమిటో కనుగొని వాటిని పరిష్కరించేంతవరకూ హింస ఆగదన్నది సత్యం. ఇప్పటికైనా పాలకులు ఆ దిశగా ప్రయత్నాలు సాగించాలి.