Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎట్టకేలకు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 70రోజులకు కేసీఆర్ గిరిజన, మహిళారహిత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ప్రమాణం చేసిన 10మంది మంత్రులలో 6గురు కొత్తవారు, కాగా, కొడుకు తారకరామారావు, అల్లుడు హరీశ్లకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం విశేషం కాగా, అతి ప్రధానమైన ఆర్థిక, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, ఐటీ, విద్యుత్తు, పరిశ్రమల శాఖలను ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకోవడం మరో విశేషం. మొత్తానికి మంత్రివర్గ కూర్పుతో ఒక దశ ముగిసింది.
ఒక ముఖ్యమంత్రి తాను ప్రమాణం చేసిన తరువాత 70రోజులకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం భారతదేశ చరిత్రలోనే అతి అరుదైన సంఘటనగా నిలిచిపోతుంది. గత డిసెంబర్13న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కేసీఆర్ తనతో పాటు కేవలం మహమూద్ అలీని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకుని, ఆయనకు హౌం శాఖను కట్టబెట్టారు. ఈ ఇద్దరితోనే 70రోజుల పాటు రాష్ట్ర పాలన సాగింది. నిధుల లేమిని కప్పిపుచ్చుకోవడానికి పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటునే వాయిదా వేశారు. ఈ రాష్ట్రంలో తాను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధీమానే తప్ప మరొకటి కాదు. గత ప్రభుత్వ కాలంలోనూ కేసీఆర్ ఇదే ధోరణి ప్రదర్శించారు. తన సొంత ఫాంహౌస్నూ, లేదా ప్రగతి భవన్నే సచివాలయంగా మార్చుకుని పాలన సాగించారు తాను ఎక్కడ ఉంటే అదే సచివాలయం అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా తానేమీ మారలేదని, మారననీ, మారాలని ఆశించకండనీ తన చర్యల ద్వారా సెలవిచ్చారు.
నిన్నటి వరకూ ప్రజల సమస్యలను ఆలకించేందుకు మంత్రివర్గం లేదు. అన్ని శాఖలూ ముఖ్యమంత్రి ఆధీనంలో ఉండడంతో, సమస్యల పరిష్కారం అటుంచి, కనీసం తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చేందుకు రోడ్డెక్కాల్సి వచ్చింది. నిజామాబాద్జిల్లా పసుపు, మొక్కజొన్న రైతులే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇప్పుడు మంత్రివర్గం ఏర్పడింది. కానీ ప్రధాన శాఖలన్నీ ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. ముఖ్యమంత్రి అనుమతి లేనిదే తమ దృష్టికి వచ్చిన సమస్యలను మంత్రులూ అధికారులూ పరిష్కరించలేని పరిస్థితి. ముఖ్యమంత్రి వద్దకు సులభంగా వెళ్లి, విన్నవించే అవకాశం కూడా లేదు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వానికి కెప్టెన్లాగా ఉండాలి. తనకు నచ్చిన వారిని, వారు ప్రత్యక్ష ఎన్నికలలో నెగ్గకున్నా మంత్రివర్గంలో చేర్చుకునే అధికారం ముఖ్యమంత్రికి ఉంది కాబట్టి, సమర్థులతో తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని వారిని గైడ్ చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందించాలి. అధికారాన్ని వికేంద్రీకరించి ప్రజాస్వామ్యానికి వన్నె తేవాలి.
సమాజంలో సగభాగమైన మహిళలకు మంత్రివర్గంలో భాగస్వామ్యం లేకపోవడం ప్రజాస్వామ్యానికి క్షేమదాయకం కాదు. దేశ చరిత్రలో తెలంగాణ స్థాయి రాష్ట్రాలలో, అటు కేంద్రంలో మహిళలు లేకుండా బహుశా ఏ మంత్రివర్గమూ ఏర్పడలేదు. దాదాపు ఒక్క తెలంగాణలో తప్ప మిగిలిన దేశమంతటా ఇదే సాంప్రదాయం కొనసాగుతోంది. ఇది తెలంగాణ సమాజానికి గౌరవప్రదం కాదు. కాగా, మంత్రివర్గంలో మహిళలు కనిపించపోవడానికి కారణమేమిటన్న ఓ విలేకరి ప్రశ్నకు 'మహిళలు ఇంట్లో ఉన్నారు.. వారి బ్యాకింగ్ మాకు ఎప్పటికీ ఉంటుంది.. అది చాలు' అని ఓ మంత్రి సమాధానం ఇవ్వడం పుండుమీద కారం చల్లడం తప్ప మరొకటి కాదు. 'ఇంకా పూర్తి మంత్రివర్గం ఏర్పడలేదు. మరో విస్తరణలో మహిళలకు తప్పక స్థానం ఉంటుందని ఆశిద్దాం' అంటూ సున్నితంగా, గౌరవప్రదంగా సమాధానం ఇచ్చి ఉండవచ్చు. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు ప్రభుత్వానికి మచ్చ తెస్తాయే తప్ప మేలు చేయవు. అలాగే, రాష్ట్ర జనాభాలో 10శాతంగా ఉన్న గిరిజనులకు కూడా మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడం అన్యాయం. జనాభాకు అనుగుణంగా గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ సాధిస్తామని, ఇందుకోసం కేంద్రంపై తీవ్రస్థాయిలో వత్తిడి తెస్తామని పాలకులు ఉద్యమ సమయంలోను, గత ప్రభుత్వ హయాంలోనూ అనేకసార్లు వాగ్దానాలు చేశారు. అంతగా గిరిజనులను ఊరించిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు తమ చేతిలోని అధికారాన్ని ఉపయోగించి కనీసం ఒక్క గిరిజనుడికి మంత్రి వర్గంలో స్థానం కల్పించపోవడాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు?
ప్రజలు ప్రత్యక్ష తాత్కాలిక తాయిలాల పరిధిని దాటి ఆలోచించి ఓటు వేయనంత వరకూ పాలకులకు ప్రజాస్వామిక పాలన అందించాల్సిన అవసరం ఉండదు. ''ఎన్నికలలో మీకీయాల్సింది మీకిచ్చేశాం. మాకు కావాల్సిన ఓట్లు మేం తీసుకుని పాలకులమయ్యాం. ఇక ఎలా పాలించాలన్నది మా ఇష్టం. మా భావజాలానికి అనుగుణంగా, మా వర్గీయుల అనుచరుల ప్రయోజనాలే లక్ష్యంగా మాత్రమే మా పాలన సాగుతుంది. మీకేం కావాలో అడుక్కోండి. మా ప్రయోజనాలు దెబ్బతినకుండా అంతో ఇంతో విదిలిస్తాం. అంతేగానీ మా విధానాలను ప్రశ్నించే అర్హత మాత్రం మీకు లేదు. హద్దు మీరారో అసలుకే మోసమొస్తుంది మీ ఇష్టం'' అన్నట్టుగా పాలన సాగిస్తారు. ఇందుకు మన తెలంగాణ రాష్ట్ర పరిణామాలు కూడా మినహాయింపు కాదు.