Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత వారాంతం జర్మనీలో ముగిసిన మ్యూనిక్ భద్రతా సమావేశం పెట్టుబడిదారీ ప్రపంచ క్రమంలో నెలకొన్న సంక్షోభానికి అద్దం పట్టింది. సామ్రాజ్యవాదుల మధ్య నెలకొన్న ఘర్షణ 20వ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలలోకంటే మరింత వినాశకరంగా మారనున్నది. ఈ సమావేశంలో పాల్గొన్నవారు, సమావేశాన్ని కవర్ చేసిన మీడియా ఈ వాస్తవాన్ని దాచటానికి పెద్దగా ప్రయత్నం చేయలేదు. 30ఏండ్ల క్రితం ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినప్పుడు 'స్థిరంగా కొనసాగే ఒక నూతన శకం' ఆవిర్భవిస్తుందని చాలామంది ఆశించారు. ఫ్రాన్సిస్ ఫుకుయామా 'ముగిసిన చరిత్ర' గురించి మాట్లాడాడు.
2019లో నేడు ఈ విషయం మరో శకానికి చెందిన నివేదికగా అనిపిస్తోందని జర్మన్ క్రిష్టియన్ సోషల్ యూనియన్ పార్టీ ప్రధాన కార్యదర్శి మార్కస్ బ్లూమ్ అన్నట్టుగా ఫ్రాంక్ఫర్టర్ అల్లెజెమైనే జైటంగ్ పత్రిక ఉటంకించింది. 'ప్రపంచవ్యాప్తంగా గతంలో కనీవినీ ఎరుగని, వేగంగాను, రాడికల్గాను సంభవిస్తున్న నాటకీయ ఘటనలను మనం చూస్తున్నాం. మన ప్రపంచ క్రమం ఈ మౌలిక మార్పులకు సంసిద్ధంగా లేదు' అని కూడా బ్లూమ్ పేర్కొన్నారు. 'సమస్యలను సమర్థవంతంగా విశ్లేషించటం, వాటి పరిష్కారాలకు తెలివైన మార్గాలను చూపలేక పోవటమనేది ఈ కాలపు లక్షణంగా ఉంది' అని సూద్దెవుట్సే జైటంగ్ పత్రిక రాసింది.
రష్యాతో నాటో ఘర్షణకు దిగటం, అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంతోపాటుగా నాటో కూటమిలో నెలకొన్న ఘర్షణలపై కూడా ఈ మూడు రోజుల సమావేశం చర్చించింది. ప్రభుత్వాధినేతలు, మంత్రులు, రక్షణరంగ నిష్ణాతులు, రాజకీయ నాయకులు వందలాదిగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమెరికా ఉపాధ్యక్షుడైన మైక్ పెన్స్ చేసిన ఉపన్యాసం ఒక వైపు అమెరికాకు, మరోవైపు జర్మనీ, ఇతర ఐరోపా దేశాల మధ్యగల తీవ్ర విభేదాలను బహిర్గతం చేసింది. పెన్స్ పోలెండ్ రాజధాని వార్సా నుంచి నేరుగా మ్యూనిక్ వచ్చారు. వార్సాలో ఆయన ఇరాన్పై యుద్ధం చేయటానికి ఇజ్రాయిల్, పోలండ్లతోపాటుగా అనేక అరబ్ దేశాలను సమీకరించారు. ఇజ్రాయిల్ను ఇరాన్ అంతం చేయాలని చూస్తుందని, ఈ దేశాన్ని నిలువరించాలంటే అక్కడి ప్రభుత్వాన్ని మార్చాలనే దిశగా అమెరికా ప్రయత్నిస్తున్నట్టు ఆయన ప్రసంగం సాగింది.
అలానే ఇరాన్తో అమెరికా దాని ఐరోపా మిత్రదేశాలు చేసుకున్న అణ్వస్త్ర ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కూడా ఆయన అన్నారు. అమెరికా ఐరోపా మిత్రులను తమవైపు నిలవాలని ఆయన ఆదేశించారు. అలా చేయటానికి వారు సంసిద్ధులు కాకపోతే అది నాటో కూటమి విచ్చిత్తికి దారితీస్తుందని ఆయన పరోక్షంగా బెదిరించారు. అదే క్రమంలో రష్యా, జర్మనీల మధ్య బాల్టిక్ సముద్రం గుండా నిర్మితమౌతున్న నోర్డ్ స్ట్రీమ్2 పైప్లైన్పై పెన్స్ తీవ్రమైన దాడిచేశారు. 'మా మిత్రులు రష్యాపై ఆధారపడటం పెరుగుతుంటే మేము పశ్చిమ దేశాల రక్షణకు గ్యారంటీ ఇవ్వజాలం' అని కూడా అన్నారు. నాటో సభ్యదేశాలు తమ స్థూల జాతీయోత్పత్తిలో 2శాతాన్ని సైనిక వ్యయంపై హెచ్చించాలని ఆయన పునరుద్ఘాటించారు. అలా సాగిన ఉపన్యాసం ముగియ గానే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, ఇతరుల ఉపన్యాసాలు వినకుండా వేదిక నుంచి ఆయన నిష్క్రమించారు.
అమెరికా ఉపాధ్యక్షుడి బెదిరింపు ధోరణికి వ్యతిరేకంగా జర్మనీ, ఇతర ఐరోపా దేశాలు తీవ్రస్థాయిలో ప్రతిస్పందించాయి. ఉపాధ్యక్షుడి నాయకత్వంలో అమెరికా ప్రతినిధివర్గం ఆరోపణలను తిప్పికొడుతూ 'నేడు కావలసింది బహుళపక్ష విధానం' అని జర్మన్ చాన్సలర్ యన్జెలా మెర్కెల్ అన్నారు. జర్మనీ, ఐరోపా దేశాలు తమ ఆర్థిక, భౌగోళిక వ్యూహ ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను బహుళపక్ష విధానం కోసం మెర్కెల్ చేసిన విజ్ఞప్తి దాచలేకపోయింది. నేటి అంతర్జాతీయ పరిస్థితుల వాస్తవ దృశ్యాన్ని జర్మన్ రక్షణ మంత్రి ఉర్సులా వాన్ డర్ లెయెన్ మరింత స్పష్టంగా ఆవిష్కరించింది. 'తమ తమ ప్రయోజనాల కోసం ప్రధాన దేశాలు పోటీపడటం తిరిగి మొదలు కావటం నూతన భద్రతా దృశ్యంలోగల ప్రధాన లక్షణం. ఇష్టంవున్నా లేకపోయినా జాతీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో జర్మనీ, ఇతర ఐరోపా దేశాలు భాగస్వాములే. మనం తటస్థులం కాదు' అని ఆమె స్పష్టం చేసారు. రెండు ప్రపంచ యుద్ధాలలో తలపడిన అమెరికా, జర్మనీలమధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. అంతే కాకుండా వీటితోపాటుగా ఐరోపా దేశాల మధ్య కూడా ఘర్షణలు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఫ్రాన్స్, ఇటలీల మధ్య, జర్మనీ ఫ్రాన్స్ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. మానవాళికి 20వ శతాబ్దం ఆరంభంలో ఏ ఆర్థిక, సామాజిక, రాజకీయ వైరుధ్యాలు ఎదురయ్యాయో అవే వైరుధ్యాలు 21వ శతాబ్దంలో కూడా కొనసాగుతున్నాయి. నేటికీ ఆ వైరుధ్యాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. నాటో భాగస్వాముల మధ్య తీవ్రమైన ఘర్షణలు ఏర్పడటం దీనినే సూచిస్తున్నది. అదే సమయంలో ఈ సామ్రాజ్యవాద దేశాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు మానవాళి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేయగల మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. కేవలం అంతర్జాతీయ కార్మివర్గ ఉద్యమం మాత్రమే మానవాళిని ఈ వినాశకర యుద్ధ ప్రమాదం నుంచి రక్షించగలదు.