Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహారాష్ట్రలో అన్నదాతల లాంగ్ మార్చ్ డిమాండ్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు. గత సంవత్సరం మార్చి 6నుంచి 12 వరకు యావత్ దేశ దృష్టిని ఆకర్షిస్తూ సాగిన 180 కిలోమీటర్ల లాంగ్మార్చ్ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు నెరవేర లేదు. ఆగ్రహించిన రైతులు గురువారం నాసిక్ నుంచి మళ్ళీ కదిలారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెరవకుండా 50వేల మంది రైతన్నలు చీమలదండులా కదిలి శుక్రవారం విజయం సాధించారు. ఇంతకూ దేశానికి తిండిపెడుతున్న అన్నదాతలు కోరుకుంటున్నదేమిటి? ఆస్తీ ఐశ్యర్యాలూ కాదు.. కనీస అవసరాలు. ఆరుగాలం ఇంటిల్లిపాదీ పొలంలో చెమటలు చిందించిన రైతన్నలు తమను ఆకలిచావులనుంచి, ఆత్మహత్యలనుంచీ కాపాడాలని మాత్రమే పాలకులను వేడుకుంటున్నారు. అయినా ససేమిరా అంటున్నారు సర్కారు పెద్దలు!
నిజానికి పాలకులు ఎలాంటి సంక్షోభం సృష్టించకుంటే రైతాంగం బతుకుల్లో కల్లోలమే లేదు. వ్యవసాయ ఉత్పత్తులకు వినియోగదారుడు చెల్లిస్తున్న దాంట్లో కేవలం 20శాతం మాత్రమే అన్నదాతలకు చెందేలా జాగ్రత్త పడుతూ, మిగిలినదంతా మధ్య దళారులు దిగమింగేందుకు పాలకులు అవకాశమివ్వకుంటే రైతు బతుకు నిండుపున్నమే. పండించిన పంటకు గిట్టుబాటు ధర అన్నది రైతన్నల ప్రధాన డిమాండ్గా ఉంది. ఈ డిమాండ్ తీర్చేందుకు పాలకులకు అడ్డొచ్చేది కేవలం తమ వర్గ ప్రయోజనం తప్ప మరొకటేమీ లేదు. రైతు పండిస్తున్నాడు.. వినియోగదారుడు చెల్లిస్తున్నాడు.. ప్రభుత్వం తనకు రావాల్సిన పన్నులు తాను వసూలు చేసుకుని మిగిలినది రైతులకు అందేలా చూస్తే అసలు సమస్యే లేదు. ఈ సత్యం పాలకులకు తెలియనిదేమీ కాదు. అయినా, తమ వర్గ ప్రయోజనాలకోసం రైతుల ప్రాణాలు తీస్తున్నారు. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం 1995 నుంచి 2016 వరకూ మన దేశంలో 3 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మనదేశంలో గంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇతర రంగాలకు చెందిన వారిలా రైతాంగం సహజంగా ఆందోళన బాట పట్టదు. పడరాని బాధలను పంటిబిగువున భరిస్తూ తలవొంచుకుని నేలతల్లికే తననుతాను సమర్పించుకుంటుంది రైతాంగం. అయినా, పనిచేసేందుకైనా ప్రాణం మిగలాలి కదా?! అవును.. ఆత్మహత్యలకు లేదా ఆకలిచావులకు బలికాక తప్పని దుస్థితినుంచి తప్పించుకునేందుకు తప్పనిసరై రైతులు రోడ్డెక్కుతున్నారు. వాస్తవ పరిస్థితి ఇది అయితే 'మీడియా దృష్టిలో పడేందుకే రైతులు నిరసనలు చేస్తున్నారు. అదంతా పబ్లిసిటీ స్టంట్' అని సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ గత సంవత్సరం రైతులు దేశ వ్యాప్తంగా 10రోజుల పాటు చేసిన సమ్మె సందర్భంగా వ్యాఖ్యానించి తన రాబందు బుద్ధి ప్రదర్శించుకున్నారు.
వాస్తవానికి మన దేశంలో రైతు జీవితంపై లేశమాత్రమైనా అవగాహన లేని పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడు ఒక్కడు కూడా ఆ పార్టీలో కనిపించడు. కానీ పశువుల మీద మాత్రం ప్రతి ఒక్కరికీ డాక్టరేటే! కాబట్టి పశువులను రక్షించుకునేందుకు మనుషులను చంపేస్తుంటారు. అమ్మలను చంపేస్తూ ఆవులను పూజిస్తుంటారు. కర్షకులు, కార్మికుల చెమటా నెత్తురూ పిండి తమ కార్పొరేట్ మిత్రుల రాజసౌధాలకు రంగులద్దుతుంటారు. అయినా ఈ భూమ్మీద అన్ని శక్తులకన్నా ప్రజాశక్తే మిన్న. సహనం నశించిన జనం ఒక్కసారి సై అంటే నియంతల్లా విర్రవీగే నేతల పీఠాలు కదలాల్సిందే.
రైతన్నలు కన్నెర్రజేస్తే ఏమవుతుందో అర్థమయ్యింది కాబట్టే హరహర మోడీ ఇప్పటికైనా అన్నదాతల వైపు కన్నెత్తి చూశారు. అయినా తమ సహజసిద్ధ నైజాన్ని మార్చుకోలేక రైతన్నల ముంగిట నిలబడి మొసలి కన్నీరు కార్చుతున్నారు. ఆ మొసలి కన్నీరుకు మారుపేరే 'ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ యోజన'. ఈ పథకం పేరుతో దేశంలో ఐదెకరాల లోపు ఉన్న ప్రతి రైతుకూ ఏడాదికి రూ.6 వేలు అందించి ఉద్ధరిస్తారట! 'ప్రాణం నీది.. పాడె ఖర్చులు నావి.. ఇక సాగించు స్మశాన యాత్ర' అన్నట్టుగా ఉంది పాలకుల రాజనీతి.
బూర్జువా నాయకులకు భూమిపుత్రులు ఓట్ల రూపంలో తప్ప మనుషుల రూపంలో కనిపించరు. వినిపించుకోక తప్పని స్థితి సృష్టిస్తే తప్ప వారి గొంతులు వినిపించవు. దేశవ్యాప్తంగా చెలరేగుతున్న రైతు ఉద్యమాలు ఆ పరిస్థితి సృష్టించాయి కాబట్టే ఇప్పుడు పాలకులు తప్పని పరిస్థితిలో తమ అధికారం నిలుపుకునేందుకు రైతు జపం చేస్తున్నారు. జీవితాలను ఈ జపాలు బాగుచేయలేవు. అధికారాన్ని నిలుపుకునేందుకు తప్పని స్థితిలో తమ గురించి పట్టించుకునే నాయకులకు కాకుండా, తమ బతుకుల నుంచి వచ్చిన వారికి అధికారం అందిస్తే తప్ప రైతన్న బతుకులు బాగుపడవు! మహారాష్ట్రలో కొనసాగుతున్న లాంగ్మార్చ్ సహా దేశ వ్యాప్తంగా రైతుల కదలిక వెనుక ఉన్న శక్తులు వామపక్షాలే కావడం యాధృచ్ఛికం కాదు. ఈ పరిణామం ఒక చారిత్రక అనివార్యం. పాలకులు తమ వర్గాన్ని మరింతగా పెనవేసుకునే కొలదీ, ప్రజలు తమ వర్గానికి నాయకత్వం వహించగల శక్తులకు చేరువవుతారు. దేశంలో కమ్యూనిస్టులకు కాలం చెల్లిపోతున్నదని సంబరపడుతున్న వర్గాలకు ఇది రుచించకపోవచ్చుగానీ, లాంగ్మార్చ్లో బొబ్బలెక్కిన అన్నదాతల అరికాళ్ళనుంచి కారుతున్న ఎర్రటి నెత్తురే ఇందుకు సాక్షి!