Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొదలు నరికి తనను మోడుగా మార్చిన గొడ్డలినే మన్నించి మొక్క మళ్లీ చిగురిస్తుంది. తిరిగి చిగురాకులనే చిరునవ్వులతో పలకరిస్తుంది. తనను కాలికింద తొక్కేసిన పాదానికి కూడా పువ్వు పరిమళాన్ని అద్ది మన్నిస్తుంది. అన్నీ తెలిసిన మనుషులు మాత్రం అందుకు భిన్నంగా పగలూ ప్రతీకారాల మాటున కుతకుత లాడిపోతుంటారు. ఆగ్రహావేశాలతో జీవితాన్ని సంకుచితంగా మార్చుకుంటారు. అర్థంలేని భావోద్వేగాలకు లోనవుతూ అవకాశం వచ్చినప్పుడల్లా కక్ష సాధించుకోవాలనుకుంటారు. తప్పులు సరిదిద్దాల్సిందిపోయి ఎప్పుడెప్పుడు కయ్యానికి కాలుదువ్వుదామా అని తహతహ లాడుతుంటారు. ఇటువంటి ధోరణి మనిషి వ్యక్తిత్వానికీ, అభివృద్ధికీ ఎప్పటికీ ఆటంకమే...!
ప్రతీకారం తీర్చుకుంటే తాత్కాలికంగా అహం శాంతిస్తుందేమో కానీ అది మనిషిలోని మానవీయ కోణాన్ని మరుగున పడేస్తుంది. సాధారణ మనిషిస్థాయికే పరిమితం చేస్తుంది. పగలూ, ప్రతీకారాలూ పెంచుకునేవారు కలవరం, ఒత్తిడీ, ఆందోళనలో కొట్టుమిట్టాడుతుంటారని నిపుణులు చెబుతుంటారు. అక్షరాలా నిజం! ఎంతటి వారికైనా ఇతరులతో ఏదో ఒక సమయంలో భేదాభిప్రాయాలు పొడచూపుతూనే ఉంటాయి. నిత్య సంఘర్షణలు ఎదురవుతూనే ఉంటాయి. అంతమాత్రానా వాటిని అనుక్షణం నెమరువేసుకొంటూ దెబ్బకు దెబ్బా, మాటకు మాటా తీర్చుకోనక్కర్లేదు. 'చెరుకు వెన్నుబుట్టి చెరపదా తీపెల్ల' అన్నట్టు మనిషిలో పుట్టే ప్రతీకారాన్ని కూడా మొగ్గలోనే తుంచేయకుంటే అది నిలువెల్లా మెదళ్లను దహించివేస్తుంది.
కొందరు బయటకు తెలియనివ్వకుండానే పగకు ఆశ్రయం కల్పిస్తారు. మాటలోనూ, ప్రవర్తనలోనూ వారి మనస్సును బయటపడనివ్వరు. ప్రతీకారం తీర్చుకుంటేనే తమ మనస్సు చల్లబడిందని భావిస్తారు. ఎందుకంటే మనకేదైనా హాని జరిగినా, బాధ కలిగినా, అవమానం ఎదురైనా, మనల్ని మోసగించినా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఎదుటిమనిషి మనకు నచ్చని పనిచేసినా కోపం తన్నుకొస్తుంది. ఆవేశంతో ఒక్కసారిగా విచక్షణ కోల్పోతాం. ప్రతీకార బదులుకు తెగిస్తాం. కానీ ఒకే ఒక్క క్షణం ఎదుటి వ్యక్తి మాట్లాడే సందర్భంలో వాళ్ల మానసికస్థితి, అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే విషయాన్ని గ్రహించం. ఏ కాస్త అర్థంచేసుకుని మసలుకున్నా కక్షలూ కార్పణ్యాలూ, పగలూ ప్రతీకారాలూ ఎండమావిలా ఆవిరైపోతాయి. అయితే ప్రతీకార చర్యల వల్ల జీవితాన్ని, సమయాన్నే కోల్పోతున్న దృష్టాంతాలెన్నో..! వ్యక్తికి లేదా ఒక కుటుంబానికి జరిగిన అన్యాయంపై ప్రతీకారం కోసం ఎదురుచూస్తే విలువైన క్షణాల్ని విస్మరిస్తుంటారు. తమను చిన్నాభిన్నం చేసిన వ్యక్తులను ఎదురుదెబ్బ కొట్టేందుకు ఏండ్లకేండ్లు కోల్పోతారు. చివరకు ప్రతీకారం తీర్చుకున్నప్పటికీ అప్పటికే అందమైన జీవితం వారి చేయికందకుండా పోతుంది. అన్నీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతారు. చివరికి మిగిలేదేముంది.. అంతా చింతే. చుట్టూ చీకటే..
నిజానికి ఒక వ్యక్తి మనసు నిండా ద్వేషం, పగాప్రతీకారాలే ఉంటే ఎలా సంతోషంగా ఉండగలరు? 'ప్రతీకారం తీర్చుకుంటే మనసు చల్లబడుతుందని అనుకుంటే.. చాలాకాలంగా పగపెట్టుకున్నవారి ముఖాలు ఒక్కసారి చూడండీ...!' అంటారొకాయన. కక్షతో రగిలిపోతున్నామంటే కణకణమని కాలే నిప్పుకణికల్ని జేబులో వేసుకున్నట్టే అని అంటారు మరొకరు. కానీ, పగవాడిని మన్నిస్తే సమాజం మనల్ని అసమర్థులుగా భావిస్తుందని కొందరు తమనుతాము సమర్థించుకుంటారు. అది ముమ్మాటికీ పొరపాటే! శక్తిసామర్థ్యాలుండీ ప్రతీకారం గురించి పట్టించుకోకుండా తమ పనిలో తాముంటే పోయేదేముంటుంది.. మనసుకు పట్టిన మకిలి తప్ప...! కొన్నాళ్లకు ఏదో ఒక సందర్భంలో చేసిన తప్పును తెలుసుకుంటారు. కానీ ఆధునిక సమాజంలో అంత ఓర్పూ సహనం ఉందా అంటే ప్రశ్నార్థకమే. మనతో పొసగని వ్యక్తులపై ఎప్పుడెప్పుడు ఎదురుదాడికి దిగుదామా? అని లెక్కలేనన్ని ప్రణాళికలు రచిస్తారు. సమయం కోసం పనిగట్టుకుని ఎదురుచూస్తూ ఉంటారు. అవకాశాన్ని కల్పించుకుని మరీ కయ్యానికి కాలుదువ్వుతారు. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకుంటారు. ఆపై జరిగే పర్యవసానాలూ, నష్టాలూ ఊహకందవు.
'కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చు కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు' అంటారు స్వామి వివేకానంద. కానీ అది ఆచరణలో ఉన్నదా లేదా అనే విషయాన్ని ఎవరికివారు గుర్తెరగాలి. ప్రతీకారం తీర్చుకోవడంలోనే వీరత్వం బయటపడుతుందని అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరోటి లేదు. పగ సాధించుకోవడం ఎప్పటికీ సమర్థనీయం కాదు. ప్రతీకారం తీర్చుకోవడం కంటే జరిగిన నష్టాన్ని పూడ్చుకునే మార్గాలను అన్వేషించగలగాలి. వ్యక్తులపై, వ్యవస్థలపై పగనే తీసుకోవాలంటే పురోగతి సాధ్యపడదు. అందుకే వ్యక్తుల్ని సృష్టించిన పరిస్థితులపై పగలూ ప్రతీకారాలు తీర్చుకోవాలి. అది ఆవేశంతో కాదు.. ఆలోచనతో జరగాలి. మనిషికి పరిణితి జీవితాంతం సాగే ప్రక్రియ. నిర్మలమైన జీవితం నిండుపున్నమిలా వికసిస్తుంది.