Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అటవీ హక్కుల గుర్తింపు చట్టంలో లొసుగుల్ని సవరించి తమ హక్కుల్ని కాపాడాలని ఏండ్ల తరబడి ఆందోళన చేస్తున్న ఆదివాసీల ఉనికికే ముప్పొచ్చింది. ఇటీవలి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు తరతరాలుగా అడవుల్లో జీవిస్తున్న నిరుపేదలను ఆదివాసీలను ద్రిగ్భాంతికి గురిచేసింది. 2006లో తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టం అమల్లో భాగంగా ఆదివాసీలు తమ ఆధీనంలోని భూముల్ని గుర్తించి వాటిపై యాజమాన్య హక్కులు కల్పించాలని దరఖాస్తులు పెట్టుకున్నారు. ఆ అర్జీల్లో కొన్ని తిరస్కారానికి గురయ్యాయి. అయినా ప్రభుత్వాలు ఇంకా వారిని భూముల నుంచి ఎందుకని ఖాళీ చేయించలేదని తప్పుపడుతూ వనసంరక్షణకు సంబంధించిన ఒక సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. విచారించిన న్యాయస్థానం ఇంకా భూముల్లో ఉన్న వారిని పంపించాలని రాష్ట్రాలను ఆదేశించింది. కేసు వాయిదా తేదీని జులై 24గా పేర్కొంటూ ఆ లోపు గిరిజనులను, గిరిజనేతరులను భూముల నుంచి ఖాళీ చేయించాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు స్పష్టం చేసింది. క్లెయిమ్ల స్థితిగతుల్ని నివేదించాలని కోరింది. వన్యప్రాణుల సంరక్షణ ముసుగులో ఆదివాసీలను, అడవులనే నమ్ముకున్న ఇతర పేదలనూ భూముల నుంచి వెళ్లగొట్టి ప్రయివేటు కంపెనీలకు, కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలన్న ప్రధాని మోడీ కుట్ర ఈ కేసు వెనుక దాగుందనిపిస్తోంది. అటవీ హక్కుల చట్టం అమలు బాధ్యత తీసుకున్న కేంద్రం ఈ కేసులో ప్రజల తరపున సరైన రీతిలో తన వాదనలను కోర్టులో వినిపించకపోవడానికి, అంటీముట్టనట్టు వ్యవహరించడానికీ ఇదే కారణం.
కోర్టు నిర్ణయంతో తెలంగాణ సహా దేశంలోని 21 రాష్ట్రాల్లో అడవులే జీవనాధారంగా సాగిస్తున్న 23.30 లక్షల గిరిజన, గిరిజనేతర కుటుంబాల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. 'అచ్ఛేదిన్, సబ్కా సాథ్ సబ్ వికాస్' నినాదాలతో ఎన్నికల ముందు ఊరించిన మోడీ అధికారంలోకొచ్చిన తర్వాత గిరిజన జాతులకు వికాసం లేకుండా చేశారన్నది వాస్తవం. గిరిజనులకు, గిరిజనేతరులకు ఉన్న అభివృద్ధి తేడా సరిచేస్తానని మాటిచ్చి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేయడం ఎంతవరకు సమంజసం. తమ నిర్ణయాల అమలుకు అటవీ అధికారులు, వన్యప్రాణి సంరక్షకులు చెప్పిందే నిజమంటున్న ప్రభుత్వాలు ఆదివాసీలకు అండగా ఉంటాయనుకోవడం అత్యాశే. కేంద్ర, రాష్ట్రాలు రూపొందించిన నిబంధనలు మొత్తం అటవీ ప్రక్రియనే సంక్లిష్టంగా మార్చిన క్రమంలో అడవినే నమ్ముకుని బతుకుతున్న ఆదివాసీలైనా, మరొకరైనా కోర్టు చెప్పినట్టు దాన్ని ధ్రువీకరించే సాక్ష్యాలు, పత్రాలు సంపాదించడం ఎలా సాధ్యమన్నది ప్రశ్న.
గిరిజనుల ఆధీనంలోని భూములపై వారికే హక్కులు కల్పించేందుకు అటవీ హక్కుల చట్టం వచ్చింది. అయితే ఈ చట్టం పూర్తిస్థాయిలో అమలుకాలేదు. లక్షలాదిమంది గిరిజనుల దరఖాస్తులను కొర్రీలూ సాంకేతిక అంశాలతో పరిష్కరించకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ వచ్చాయి. చట్టం అమలు కోసం గిరిజనులు ఇప్పటికీ పోరాటాలు చేయాల్సి రావడం దురదృష్టం. పాలకుల వైఖరితో మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అటవీ హక్కుల చట్టం పరిధిలో వ్యక్తులు గాని, సమూహాలు గాని తామే హక్కుదారులమని ముందుకొచ్చిన వారి విషయాన్ని రెండునెలల్లో తేల్చేస్తామన్న మోడీ సర్కార్లో ఇప్పటివరకు 25శాతమే పరిష్కారమయ్యాయి. ఆదివాసీలకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్ది, అటవీ ప్రాంతాల్లో వారు ఉండటానికి, అడవులపై వారి హక్కుల్ని గుర్తించి పరిరక్షించడానికి ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్టు చెప్పిన అప్పటి యూపీఏ ప్రభుత్వం కూడా సరిగ్గా వ్యవహరించలేదు. బీజేపీ ప్రభుత్వం గిరిజన హక్కుల్ని కాలరాస్తూ అటవీ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ వచ్చింది. 'ల్యాండ్ కాన్ఫ్లిక్ట్ వాచ్'(ఎల్సీడబ్ల్యూ) అనే సంస్థ గణాంకాల ప్రకారం గతేడాది జనవరినాటికి 11 రాష్ట్ర ప్రభుత్వాలు 26 కేసుల్లో గ్రామసభల అభిప్రాయాలను బుట్టదాఖలు చేసి అడ్డగోలుగా అటవీ భూముల్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేయడం గమనార్హం. ఛత్తీస్గడ్లోని 12 గ్రామాల్లో ఇనుప ఖనిజం ఉండడంతో అక్కడ అటవీ హక్కుల్ని గుర్తించడానికి అప్పటి బీజేపీ సర్కార్ నిరాకరించింది. జార్ఖండ్లో గ్రామసభల అనుమతి లేకుండానే 5లక్షల ఎకరాల అటవీభూమిని కార్పొరేట్ సంస్థకు అప్పగించింది. చట్టపరంగా అటవీభూమిని ఇతర అవసరాలకు ఉపయోగించాలంటే గ్రామసభల అనుమతి తప్పనిసరి. ఇదే విషయాన్ని మోడీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ట్రైబల్స్ అఫైర్స్ మినిస్ట్రీ కమిటీ నొక్కి చెప్పినా దానిని మోడీనే బేఖాతరు చేశారు. హడావుడిగా త్రిపుల్ తలాక్ పైన, మెడికల్ కౌన్సిల్ పైన ఆర్డినెన్సులు తేగలిగిన మోడీ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది గిరిజనులు నిరాశ్రయులు కాకుండా నిలువరించడానికి ఒక ఆర్డినెన్సు తేవడం అసాధ్యమేమీ కాదు. కానీ, కార్పొరేట్ల సొమ్ముతో ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రధాని మోడీ ఆ పని చేస్తారనుకోవడం అత్యాశే! అందుకోసం సుప్రీంకోర్టు ఆర్డర్ను రివ్యూ చేయించే విధంగా గిరిజనులు ఉద్యమించడమే మార్గం.