Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఎక్కడమ్మా నువ్వు లేనిది.. ఏమిటీ నువ్వు చేయలేనిది'' అని మహిళల గురించి పత్రికలు, మ్యాగజెన్లల్లో కథనాలు తరచూ ప్రచురితమవుతుంటాయి. చదువుతుంటాం. ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చిందంటే చాలు అనేకులకు శిగం వస్తుంది. భరతనాట్య మాడుతుంటారు. మాటలు కోటలు దాటుతాయి. చేతలు మాత్రం గడప దాటవు. సరిగ్గా ఈ సంగతి ఇప్పటి మన రాష్ట్రానికి సరిపోతుంది. గత ఐదేండ్లలో మహిళలను కొత్త రాష్ట్రం పరిపాలనలో టీఆర్ఎస్ సర్కారు భాగస్వాములను చేయలేదు. మంత్రి పదవులు ఇవ్వకుండా వారిని నిర్లక్ష్యం చేసింది. వివక్ష చూపింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక, వేయి కండ్లతో మంత్రి పదవుల కోసం ఎదురుచూసినా, మహిళా ఎమ్మెల్యేలకు మళ్లీ చుక్కెదురైంది. ప్రతివిషయంలోనూ రాజకీయ ప్రయోజనాలను వెతుక్కోవడమే టీఆర్ఎస్ లక్షణంగా కనిపిస్తున్నది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో పూర్తి ఏకపక్షంగా వ్యవహరించిన గులాబీ నేత, ప్రతిపక్షం మాటకు విలువ ఇవ్వకుండా వాటిని కనుసన్నల్లో నడిపి, చివరకు తన మాటే వేదంగా వాటిని ముగించేశారు.
రెండు నెలల ఆలస్యంగా మంత్రివర్గాన్ని విస్తరించిన టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజాసమస్యలపై చర్చ లేకుండానే అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేసింది. మోడీ బిల్లు జీఎస్టీతోపాటు మరో రెండు చట్టాల సవరణలకు ఆమోదముద్ర వేసుకుని ఓటాన్ అకౌంట్ పద్దు తంతు ఒడిపించారు. తొలిసారి చూపించిన చొరవా వేగం ఈసారి సీఎం ప్రదర్శించడం లేదు. ఆచీతూచీ అడుగులేస్తున్నారు. సచివాలయంలో వేలాది పైళ్లు పెండింగ్లో ఉన్నట్టు స్వయానా అధికారులే సెలవిస్తున్నారు. ఐఏఎస్ అధికారులు రాష్ట్ర పరిపాలన విషయంలో అసంతృప్తిగా ఉన్నారనే అంశం ఒకవైపు చర్చ నడుస్తుండగా, కొత్త మంత్రులను ఏమేరకు పరిపాలనలో భాగస్వాములను చేస్తారనే అనుమానాలు మరోవైపు వ్యక్తమవుతున్నాయి. అనేక సమస్యలతో రాష్ట్రం కొట్టుమిట్టాడుతున్నది. పోడు భూముల సమస్య కొనసాగుతున్నది. సర్కారు తన అవసరాల కోసం అడవిబిడ్డలను, వాటికి దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. కుల దురంహంకార హత్యల పరంపర ఇంకా నడుస్తున్నది. పనులు చేసిన వర్కింగ్ ఏజెన్సీలు బిల్లుల కోసం చెప్పులరిగేలా సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. అక్కడేముంది ముఖ్యమంత్రి ప్రగతిభవన్లో కదా ఉండేది అని మీరనుకుంటే తప్పులో కాలేసినట్టే. అక్కడికి ఎంట్రీ లేదు కాబట్టి వారంతా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఆయా శాఖల హెచ్వోడీల చుట్టూ పరుగులుపెడుతున్నారు.
ధనిక రాష్ట్రంలో ఆయా పనులకు బిల్లులు చెల్లించాల్సిన సొమ్ము కాస్త అక్షరాలా రూ.50వేల కోట్ల పైమాటే అంటే నమ్మశక్యం కాదు సుమా! సర్కారు కాసులు రాల్చకపోతే, తామేమి చేసేది అంటూ కాంట్రాక్టర్లకు సర్దిచెప్పలేక తలలు పట్టుకుంటున్నారు ఉన్నతాధికారులు. ప్రజలకు ఇచ్చే పింఛన్లు నెలా, రెండు నెలలు ఆలస్యంగా లబ్దిదారులకు వెళ్తున్నాయి. ఆ వ్యవస్థను సరిదిద్దాల్సి ఉంది. కీలకశాఖలన్నీ తన దగ్గరే పెట్టుకున్న సీఎం పెండింగ్ పైళ్లకు పరిష్కారం చూసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఉపాధి కల్పనా కార్యాలయాల మాదిరిగా కేవలం రిజిస్ట్రేషన్లు చేయడమే తప్ప, వచ్చిన ఫిర్యాదులు లేదా దరఖాస్తుల దుమ్ముదులిపి బాధితుల ఆవేదన తీర్చినపాపాన పోయే నాధుడే లేడు. ఇదిలావుండగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ జూదానికి మరోసారి టీఆర్ఎస్ తెరలేపింది. తమకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య మేరకు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను గెలిచే అవకాశం ఉంది. అయినా ఐదో స్థానానికి పోటీపెట్టడం ద్వారా సక్రమార్గాలను ప్రభుత్వం అధికారికంగానే ప్రొత్సహిస్తున్నదనే విమర్శలున్నాయి. ప్రతిపక్షానికి ఒక సీటు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నా, కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి మరొకరిని బుట్టలో ఎప్పుడో వేసుకున్నామనీ, టీఆర్ఎస్లోని కీలకనేతలు చెప్పకనే చెబుతున్నారు. తద్వారా ఎమ్మెల్సీ సీట్లను చెరబట్టేందుకు కారు ప్రభుత్వం పావులు కదుపుతున్న తీరు ప్రజాస్వాయ్య ప్రక్రియను అపహాస్యం పాల్జేస్తున్నది. సంఖ్యా జూదంలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలకు తాయిలాలను ఎరగా వేసి, విలువలకు వలువలూడ్చే దుస్సాహానికి ఒడిగట్టింది కేసీఆర్ పార్టీ, సర్కారునూ. వేలకొలదీ సమస్యలు పైళ్ల రూపంలో నదీ ప్రవాహంలా సచివాలయాన్ని ముంచెత్తుతుండగా, వాటికి నిధులు సమకూర్చాల్సిన బాధ్యత ధనిక రాష్ట్రానికి లేదంటారా? చిత్తశుద్ధి లేని జీవోలను జారీచేస్తున్న ప్రభుత్వం, న్యాయస్థానాల నుంచి మొట్టికాయలు తినడం కొనసాగుతూనే ఉన్నది. అయినా గుణపాఠం నేర్చుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇందుకు భాషాపండితుల ఉద్యోగోన్నతులపై ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబట్టిన హైకోర్టు, స్టే ఇవ్వడం సర్కారు బాధ్యతారాహిత్యాన్ని వేలెత్తి చూపడమే తాజా ఉదాహరణ.