Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ మితవ్యయ విధానాలకు, గత శతాబ్దంలో కనీవినీ ఎరుగని సామాజిక అసమానతల స్థాయికి వ్యతిరేకంగా అనేక దేశాలలో ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్నారు. 2018లోను, వర్తమాన సంవత్సరంలోను ప్రపంచమంతా వర్గపోరాటాలు పునరుద్ధరింప బడటంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్రను పోషించారు. అమెరికాలోని క్యాలిఫోర్నియా రాష్ట్రంలోగల ఓక్లాండ్లో మూడువేల మంది అధ్యాపకులు ప్రస్తుతం సమ్మె చేస్తున్నారు. 2019లో మొదటి ఎనిమిది వారాలలో 71వేలమంది ఉపాధ్యాయులు విధుల్ని బహిష్కరించారు. లాస్ఏంజల్స్లో గత నెలలో విధుల్ని బహిష్కరించిన తరువాత ఈ సమ్మె జరుగుతోంది. అలాగే డెన్వర్, కొలరాడో, పశ్చిమ వర్జీనియా రాష్ట్రాలలో అమెరికాలో ఎన్నడూలేని స్థాయిలో సమ్మెలు జరిగాయి. అమెరికాలో గతేడాది సమ్మెచేసిన ఐదు లక్షలమందిలో 3,80,000మంది ఉపాధ్యాయులే. 1986 సంవత్సరం తరువాత ఇది అత్యధిక సంఖ్య.
బ్రెజిల్లోని సావోపాలో ఉపాధ్యాయులు పింఛన్లలో కోతకు వ్యతిరేకంగా ఈ ఏడాది రెండోసారి సమ్మెకు దిగారు. మెక్సికోలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణ లకు వ్యతిరేకంగా, ఉద్యోగాల నుంచి తొలగింపునకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు రహదారులను దిగ్బంధించారు. ఫిబ్రవరి ఆరంభంలో జర్మనీలో అధ్యాపకులు, పసిపిల్లల సంరక్షణ చూసే ఉద్యోగులూ సమ్మెచేశారు. పోర్చుగల్లో విద్యావేత్తలు సాధారణ సమ్మెలో పాల్గొన్నారు. ఫ్రాన్స్లో ఉపాధ్యాయులు 'సంపన్నుల అధ్యక్షుడు' ఎమ్మాన్యుయెల్ మాక్రాన్కు వ్యతిరేకంగా సాగుతున్న యెల్లో వెస్ట్ ఉద్యమంలో పాల్గొన్నారు. నెదర్లాండులో మార్చి15న జరిగే మొదటి జాతీయ సమ్మెలో వివిధ రకాల విద్యాసంస్థలలోని లక్షకుపైగా అధ్యాపకులు పాల్గొంటున్నారు. ఇక ఆఫ్రికా ఖండంలోని మొరాక్కో, జింబాబ్వే దేశాలలో పాఠశాల విద్య ప్రయివేటీకరించటానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు సమ్మెకు దిగారు.
ప్రపంచ వ్యాప్తంగా సామాజిక అసమానతలు తీవ్ర స్థాయిలో పెరగటం వల్ల ఈ ఉద్యమాలు ఎగసిపడుతున్నాయి. నాలుగు దశాబ్దాల క్రితం బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్, అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్చే ఆరంభించబడిన ఈ ప్రతీఘాత విప్లవం 2008లో సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత వేగవంతమైంది. అమెరికా అధ్యక్షుడు మాజీ ఒబామా నాయకత్వంలో పెట్టుబడిదారీ ప్రభుత్వాలు బ్యాంకుల నిరర్థక ఆస్తులను కొనడానికి లక్షల కోట్ల డాలర్లను హెచ్చించాయి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లను పునరుద్ధ రించటానికి, ఆర్థిక నేరస్థుల ఆస్తులను పెంచటానికి అపరిమిత అప్పులను అందజేశాయి. వీటన్నింటికీ కావలసిన నగదును అందుబాటులో ఉంచటానికి పాలకవర్గ పార్టీలు 'మితవ్యయ' విధానాన్ని అనుసరించాయి.
ప్రపంచ వ్యాప్తంగా 2008లో సంభవించిన ఆర్థిక సంక్షోభం తరువాత అమెరికాలో సంపద కింది వర్గాల నుంచి పై వర్గాలకు ఎలా బదిలీ అయిందనే విషయాన్ని అనేక అధ్యయనాలు విశదీకరించాయి. దేశంలోని మొత్తం కుటుంబ సంపదలో అత్యంత అగ్రభాగాన గల 0.1శాతం అత్యంత సంపన్నుల నియంత్రణలో 25శాతం ఉంది. ఈ వాటా 1929తరువాత ఇంత ఎక్కువగా ఎన్నడూ లేదు. నిజానికి ఆఫ్ షోర్ ఖాతాలలో తమ సంపద దాచగలిగే సామర్థ్యం సంపన్నులకు ఉన్నందున వాస్తవంలో ఈ వాటా మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే కుటుంబ ఆదాయంలో శ్రమ ద్వారా వస్తున్న ఆదాయం 1970నుంచి క్రమేణా తగ్గుతూ వస్తోంది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అత్యంత కనిష్టస్థాయిలో ఉంది. ఇదే కాలంలో కార్పొరేట్ లాభాలకు బదిలీ అయ్యే కుటుంబ ఆదాయం 1980వ దశకంలో 12శాతం ఉంటే నేడది 20శాతానికి మించి ఉంది.
ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ఉపయోగించి ద్రవ్య పెట్టుబడిదారీ వర్గం ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టటమే కాకుండా ప్రపంచ 'విద్యా మార్కెట్'పై ఆధిపత్యాన్ని సాధించింది. 2030సంవత్సరం తరువాత ఈ మార్కెట్ 10ట్రిల్లియన్ డాలర్ల విలువ(1ట్రిల్లియన్ డాలర్లు 70లక్షల కోట్లకు సమానం)కు చేరుకుంటుందని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా పాఠశాల విద్యను ప్రయివేటీకరించటానికి కావలసిన నిధులను అందజేయటంలో ఐఎమ్ఎఫ్, వరల్డ్ బ్యాంకు, యుఎస్ ఎయిడ్, బ్రిటన్కు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(డీఎఫ్ఐడీ)లు ప్రధాన పాత్ర పోషిసున్నాయి.
అధ్యాపకుల మీద, ప్రభుత్వ విద్య మీద జరుగుతున్న దాడి విశ్వజనీన రూపాన్ని సంతరించుకుంది. ఈ దాడికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఉపాధ్యాయులకు ప్రజల మద్దతు ఉంది. ఎందుకంటే వారు తమ మౌలిక హక్కుల కోసం పోరాడుతున్నారు. అంతేకాదు, కార్మికులు కూడా తరుగుతున్న ఆదాయం, పెరుగుతున్న జీవన వ్యయం, ఉద్యోగ అభద్రత, ఆరోగ్య సంరక్షణ, పింఛన్ల వంటి సామాజిక హక్కులపై దాడులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఉపాధ్యాయుల్లో వృద్ధిచెందుతున్న ఉద్యమం అనివార్యంగా కార్మికవర్గంలోకి విస్తరిస్తోంది. అయితే కేవలం సమ్మెలతోనే సమస్య పరిష్కారం కాదు. వర్గపోరాట తర్కం భావాధిపత్యాన్ని సాధించి రాజకీయాధికారాన్ని కైవసం చేసుకున్నప్పుడే ఆర్థిక వ్యవస్థను ప్రయివేటు లాభం కోసం కాకుండా సామాజిక అవసరం కోసం పునర్నిర్మించే వీలు కలుగుతుంది.